Just In
- 16 min ago చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- 3 hrs ago గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- 4 hrs ago పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- 4 hrs ago ప్రేమ విషయంలో ఈ రాశులను మాత్రం అస్సలు నమ్మకూడదు..నమ్మక ద్రోహం చేస్తారు..
విభూతి యొక్క విశిష్టత: విభూతిని ఎందుకు ధరిస్తారు
హోమంలో దర్బలు మరియు ఇతర హోమ వస్తువులు దహించగా మిగిలిన హోమభస్మాన్ని విభూతి అని కూడా అంటారు. చాలా పవిత్రంగా భావించబడే విభూతి (విభూది) ప్రతి శివాలయంలోనూ తప్పక ఉంటుంది. నెయ్యి మరియు ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి హోమంలో ఆహూతిగా సమర్పించినపుడు అందులోనుంచి వచ్చిన భస్మమే విభూతి. లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకము చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు. అంతే కానీ కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూతిగా పరిగనించబడదు.
విభూతిని సాధారణంగా నుదిటి మీద పెట్టుకొంటారు. కొందరు దానిని భుజాలు చాతీ మొదలైన ఇతర శరీర భాగాల మీద కూడా పెట్టుకుంటారు. కొందరు, ఆస్తికులు శరీరానికి అంతటికీ దీనిని రుద్దుకొంటారు. చాలా మంది భస్మాన్ని స్వీకరించినప్పుడల్లా చిటికెడు నోట్లో వేసికొంటారు. నిప్పు కాలుస్తుంది. కట్టెలు, పిడకలు లాంటివి నిప్పు సోకినప్పుడు కాలిపోతాయి.. ఈ రెండింటి కలయికతో పుట్టిన విభూతి, ఆ రెండు గుణాలనూ వదిలి, కొత్త రూపాన్ని, శాశ్వతత్వాన్నీ సంతరించుకుంది. ఏదైనా ఒక వస్తువును లేదా పదార్ధాన్ని కాల్చినప్పుడు బూడిదగా మారడం మనకు తెలిసిందే. కానీ బూడిదను కాలిస్తే ఏ మార్పూ జరగదు. ఎంతమాత్రం రూపాంతరం చెందదు. తిరిగి బూడిదే మిగులుతుంది. అంటే బూడిదకు మార్పు లేదు, నాశనం లేదు. నాశనం లేని విభూతితో మార్పులేని మహాశివుని ఆరాధిస్తున్నాం. విభూతి శాశ్వతమైంది, పవిత్రమైంది మాత్రమే కాదు ఆరోగ్యదాయిని కూడా. విభూతి దహించదు, దహనమవదు. ఇది నిర్గుణత్వాన్ని సంతరించుకుంది. నిర్గుణుడు అయిన మహాశివునికి విభూతి మహా ప్రీతికరమైంది.
విభూతిని ఎలా తయారుచేస్తారు
స్వచ్చమైన విభూదిని పొందడానికి మొదట గడ్డిమాత్రమే తినే అవు పేడను సేకరించాలి. ఆ పేడను దాన్యపు పొట్టులో శివరాత్రి రోజు కాల్చాలి. కాల్చిన పేడను నీటిలో కడిగిన అనంతరం ఆరబెట్టాలి. ఆ పిమ్మట దానిని పరమేశ్వరుడికి అర్పించాలి. ఈ విభూదిని శుభ్రమైన చోటపెట్టి వాడుకోవాలి.
విభూదిని తడిపిగాని, పొడిగా గానీ వాడుకోవచ్చు. విభూది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. హిందువుల విశ్వాసం ప్రకారం విభూదిని ధరించడం వల్ల శివుడు ప్రసన్నుడవుతాడని విభూదిని నుదురు, మెడ, భుజాలు, చేతి మదిమలు మరియు మోచేతుల్లో ధరిస్తారు. జ్వరంతో బాధపడుతున్న వాడికి నుదిటిపై తడి విభూదిని పూస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుముఖం పడుతుంది. హోమంలో వేసిన ఔషదీయ కర్రలు మరియు ఆవు నెయ్యి పవిత్ర భస్మాన్ని మిగుల్చుతుంది.
విభూతిని ఎందుకు ధరించాలి?
భస్మము అనే మాటకు "మన పాపాలను భస్మము చేసేది, భగవంతుడిని జ్ఞాపకము చేసేది" అని అర్ధము. "భ" అంటే భస్మము చేయడాన్ని; "స్మ" స్మరణమును సూచిస్తున్నాయి. అందువలన భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. భస్మము .. ధరించిన వారికి శోభనిస్తుంది గనుక "విభూతి" (శోభ) అనీ, దానిని పెట్టుకున్న వారిని పరిశుద్ద పరచి వారిని అనారోగ్యత, దుష్టతలనుండీ రక్షిస్తుంది గనుక రక్ష అని అంటాము.
హోమము (పవిత్రమైన మంత్రాలతో అగ్ని దేవుడికి సమర్పించే నివేదన)
అహంకారము స్వార్ధ కామనలను జ్ఞానమనే అగ్నికి లేదా ఒక ఉన్నత నిస్స్వార్ధ కారణార్ధముకు ఆహుతిగా సమర్పించడానిని సూచిస్తుంది. తద్వారా వచ్చే భస్మము అటువంటి పనులు ఫలితంగా వచ్చే మానసిక పరిశుద్దతను సూచిస్తుంది. నివేదనలను, సమిధలను అగ్నిలో దహింపజేయడమనేది జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానము, సోమరి తనాన్ని వదిలించు కోవడాన్ని సూచిస్తుంది. మనము ధరించే భస్మము, ఈ శరీరములో నున్న అసత్యపు తాదాత్మ్యత మరియు జనన మరణాల పరిమితుల నుంచి విడివడి స్వతంత్రుల మవ్వాలని సూచిస్తుంది. శరీరము నశించేదని, ఒకనాడది బూడిదగా అవుతుందని కూడా మనకు భస్మ ధారణ గుర్తు చేస్తుంది. అందువలన మనము దేహముపై మితిమీరిన మమకారం కలిగి ఉండకూడదు. మరణమనేది ఏ క్షణానైనా రావచ్చు. ఈ గ్రహింపు జీవితాన్ని ఉత్తమోత్తమముగా వినియోగించుకొని అభివృద్ధి మార్గాన పయనించే లాగున చేస్తుంది. అంతేకాని మరణాన్ని గురించి జ్ఞాపకము చేసే దుఃఖ భరితమైనదని అపార్ధము చేసికో కూడదు. కాలము ఎవరి కోసం నిలబడదని తెలియజేసే శక్తివంతమైన సూచిక ఈ భస్మము.
శరీరమంతటా భస్మాన్ని
శరీరమంతటా భస్మాన్ని రాసుకోనేటటువంటి పరమ శివునితో ఈ భస్మము ప్రత్యేకమైన సంబంధము కలిగి ఉంది. శివ భక్తులు భస్మాన్ని త్రిపుండ్రాకారంలో ధరిస్తారు. మధ్యలో ఎర్రని బొట్టుతో కలిపి పెట్టుకున్నప్పుడు ఆ గుర్తు శివ శక్తులను సూచిస్తుంది.
కట్టెలన్నీ(పదార్ధాలు) కాలిపోయిన తరువాత మిగిలేది బూడిద. దానికి నాశనము లేదు. అదే విధముగా లెక్కలేనన్ని నామ రూపాలతో కూడిన సృష్టి అంతా నశించినప్పుడు మిగిలి ఉండేది, నాశనము లేనటువంటి శాశ్వత సత్యము ఐన భగవంతుడు మాత్రమె.
"భస్మము" ఔషధగుణాలని కలిగి ఉంది.
ఇది ఎన్నో ఆయుర్వేద మందులలో వాడ బడుతుంది. ఇది శరీరములోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది . భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి.