Just In
- 16 min ago చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- 3 hrs ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 4 hrs ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- 5 hrs ago మేషరాశిలో శుక్రుడి సంచారం ఈ రాశుల వారు భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు
హిందు ధర్మం ప్రకారం ‘దీపావళి’కి ఉన్న ప్రాముఖ్యత
భారతీయ సంస్కృతి కి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు!
మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకు అధిక ప్రాధాన్యము ఉన్నది . వీటిలో దీపావళి పండుగ ఒకటి. ఈ పండుగను ఆశ్వీయుజమాస బహుళ అమావాస్య రోజున జరుపుకొంటారు . దీపావళి అనగా దీపములవరుస అని అర్ధము .ఈ జరుపుకొనుట యొక్క ప్రాముఖ్యతను పురాణాలలో అనేక విధములుగా తెలియజేసారు .
1. విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞను శిరసా వహించి పధ్నాలుగు (14 ) సంవత్సరములు అరణ్యవాసము చేసి తిరిగి సీతతో కలిసి రాజ్యమునకు వచ్చిన సంధర్బమున ప్రజలు ఆనందోత్సాహాలతోదీపములనలంకరించి జరుపుకొన్న పండుగ ను దీపావళి అంటారని.
2. విష్ణుమూర్తి వామన అవతరుడై రాక్షస రాజు బలిచక్రవర్తి ని మూడు అడుగుల నేలను అడిగి అతనిని పాతాళమునకు అనిచివేసినందుకు దేవతలు, నరులు అనందించి జరుపుకున్న పండుగ అని ,
3. ద్వాపరయుగమందు నరకాసురుడనే రాక్షసుని శ్రీ కృష్ణుడు తన భార్య సత్యబామతో కలిసి సంహరింఛినందుకు ప్రజలు ఆనందంతో ప్రతి యింటిని దీపములతో అలంకరించి జరుపుకున్న పండుగ అని అంటారు. దీపావళి రోజున ఇంటిలో ని పిన్నలు ,పెద్దలు తలస్నానమాచరించి ,ఇల్లు శుబ్రము చేసి ,ఇంటిని కొత్త సున్నముతో ను,రంగులతోను అలంకరించి ,ముగ్గులు పె ట్టి,నూతన వస్రములను ధరించి ,ఇంటి నిండా దీపములతో అలంకరించెదరు. కొందరు లక్ష్మీ పూజను జరుపుతారు .దీపావళి పండుగను దీపోత్సవము అనికూడా అంటారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దీపావళి రోజున శివ సహితముగా కాళీ పూజలు ప్రత్యేకముగా నిర్వహిస్తారు . ఈ పండుగనాడు అమావాస్య చీకట్లు తొలగిపోవుటకు కాకరపువ్వొత్తులు , టపాకాయలు ,చిచ్చుబుడ్లు ,మతాబులు ,మొదలగునవి కాల్చి పండుగగా జరిపి ఆనందిస్తారు.
4. దీపాలపండుగ అయిన దీపావళి రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత కలదు. పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.
ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం
5. నరకాసురుడు దేవతలను ,నరులను బహు కష్టములపాలు చేసి భగవంతుడైన శ్రీక్రుష్ణునే వ్యతిరేకించుచుండెను. 16 000 మంది స్త్రీలను చెరసాలలో బంధించి ఉంచగా శ్రీకృష్ణుడు యుద్దము చేసి సత్యభామచే నరకాసురిని సంహరింపజేసెను. ఎందువల్లననగా విష్ణుమూర్తి యొక్క వరహావతార సమయమున భూదేవికి ,విష్ణువుకు జన్మించినవాడు నరకాసురుడు.ఇతనికి తల్లి చేతిలో తప్ప మరో విధముగా చావులేదనే వరమున్నది. అందువల్ల శ్రీ కృష్ణుడు సత్యభామచే ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురవధ జరిపి మాతృభూమిని ఉద్దరించాడు . ఈ దీపావళిని నరకాసురవధ జరిగిన తరువాత ప్రజలు ఆనందించి జరుపుకున్న పండుగగా చెబుతారు .ఆనాటి నరకాసురుని రాజధాని ప్రస్తుత అస్సాం రాష్ట్రంలోని ప్రాగ్జోతిషపురము. శ్రీకృష్ణుని ద్వారకానగరము ఈనాటి గుజరాత్ రాష్ట్రములోని ద్వారక.
జైనులు మహావీరుడు నిర్యాణం పొందిన రోజును దీపావళిగా జరుపుకొందురు.స్వామి దయానంద సరస్వతి హిందూ ఆధ్యాత్మికత యొక్క గొప్పదనమును చాటుటకు అమావాస్య రోజునే సన్యాసము స్వీకరించుట జరిగినది. స్వామి రామతీర్థ కూడా పశ్చిమ దేశాలలో ఆధ్యాత్మికతను ,హిందు ధర్మాన్ని అందజేశారు.