వినాయకుడు పరిపూర్ణతకు మారుపేరుగా ఉన్నాడు. తన భక్తుల జీవితాల నుండి అడ్డంకులు తొలగించడమే కాకుండా, వారిని సరైన దిశలో మార్గనిర్దేశం చేసే దేవునిగా పేరెన్నిక కలవానిగా ఉన్నాడు. విఘ్నాలను తొలగించి విజయావకాశాలను ఇవ్వడంలో వినాయకుని మించిన దేవుడు లేడని భక్తుల విశ్వాసంగా ఉంది. క్రమంగా, ఏ కార్యమైనా విఘ్నేశ్వరుని పూజ తర్వాతనే అన్నట్లు ఉంటుంది. కాణిపాకం వంటి ప్రతిష్టాత్మకమైన దేవాలయాల్లో సాక్షి గణపతిగా ఉన్న వినాయకుని మీద ప్రమాణాలు చేసి మంచి మార్గాలలో వెళ్ళేలా భక్తులు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కూడా.
పరమేశ్వరుని భార్య, పార్వతీ దేవి స్నానం చేసేందుకు వినియోగించే చందనంతో తయారు చేసిన బొమ్మ నుండి, జనించిన వానిగా వినాయకుడు మనందరికీ తెలుసు. పరమేశ్వరునికి తన కుమారునిగా తెలిసే క్రమంలో జరిగిన జాప్యం కారణంగా, వినాయకుని రూపు రేఖలు సైతం మారిపోయాయని కూడా మనకు తెలుసు. అయినప్పటికీ, ఇంకనూ వినాయకుని గురించి తెలుసుకోదగిన అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆ వివరాలను అందించే క్రమంలో ఈ వ్యాసం మీకు దోహదం చేస్తుంది.
పరిపూర్ణమైన అవతారం :
పార్వతీ దేవి స్నానం చేస్తున్న సమయంలో వినాయకుడు, కాపలా దారునిగా ఇంటిబయట రక్షణగా ఉన్న సమయంలో, పరమేశ్వరుడు గృహంలోకి అడుగు పెట్టబోయాడు. కానీ పరమేశ్వరుడు ఎవరో వినాయకునికి తెలియని కారణాన, అతన్ని లోనికి అనుమతించుటకు నిరాకరించి వాగ్వాదానికి సైతం దిగాడు. కానీ, తపశ్శక్తితో పరమేశ్వరుని ఆత్మ లింగాన్ని కడుపులో దాచుకున్న గజేంద్రుని సంహారం నుండి విముక్తి పొందిన పరమేశ్వరుడు, ఆ ఆగ్రహావేశాలను పసిబాలుడైన వినాయకుని మీద చూపి, మూడవ కన్నుతో తలను భస్మం చేశాడు. స్నానం నుండి తిరిగివచ్చిన పార్వతీ దేవి భోరున విలపిస్తూ అసలు నిజం తెలుపగా, తన పొరపాటును గ్రహించిన పరమేశ్వరుడు, ఉత్తర దిక్కున తల పెట్టి నిద్రిస్తున్న వారి తలను తీసుకుని రమ్మని అనుచరులకు పురమాయించగా. చావు బ్రతుకులలోనున్న గజేంద్రుని తలను తీసుకుని వచ్చారు. క్రమంగా ఆ బాలునికి గజేంద్రుని తలను అమర్చి, పునరుజ్జీవం గావించాడు.
ఏది ఏమైనా ఏనుగు తల కారణంగా మానవ శరీరం అసంపూర్ణంగా ఉన్న కారణాన, పార్వతీదేవికి మాత్రమే మానవ రూపంలో కనిపించేలా వరాన్నిచ్చాడు పరమేశ్వరుడు. మరియు ఏనుగు తల సరిగ్గా వినాయకునికి సరిపోయేలా పరిపూర్ణ రూపాన్ని ఇచ్చాడు. అందుకే పరిపూర్ణతకు చిహ్నంగానే కాకుండా, అపరిపూర్ణత నుండి జనించిన పరిపూర్ణ అవతారంగా కూడా వినాయకుడు కీర్తించబడుతాడని చెప్పబడింది.
మహాభారతాన్ని రాసింది వినాయకుడు :
వాస్తవానికి వేద వ్యాసుడు చెప్తుండగా, వినాయకుడు మహాభారతాన్ని లిఖించాడని చెప్పబడింది. వ్యాసుడు, మహా భారతం రాయడంలో తనకు సహకరించమని వినాయకుని కోరగా, వినాయకుడు ఒక నిబంధన మీద మహా భారతాన్ని మాత్రమే మహా భారతాన్ని రాయడానికి ఒప్పుకున్నాడు. ఒకసారి కలమును పట్టాక, మహాభారతం పూర్తయ్యే వరకు ఆపను, ఆవిధముగా మీరు ఎటువంటి అంతరాయము లేకుండా చెప్పవలసి ఉంటుంది అని సూచించాడు. దానికి వ్యాసుడు బదులుగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని తార్కిక కోణంలో అర్ధం చేసుకున్న పిదపనే రాయవలసి ఉంటుందని సూచించాడు.
ఇండోనేషియాలో కరెన్సీ నోట్లమీద వినాయకుని చిత్రం:
ఇండోనేషియా యొక్క 20,000 రూపియా నోట్లమీద వినాయకుని చిత్రం ముద్రించబడింది. ఇండోనేషియాలో దాదాపు నాలుగు మిలియన్ల హిందువులు ఉన్నారని అంచనా. అంతేకాకుండా వినాయకుడు, బౌద్ధమతంలో కూడా ఆరాధించబడుతున్నాడు. బౌద్ధమతంలోని మహాయన విభాగంలో వినాయకుడు అత్యంత ప్రాచుర్యాన్ని పొందిన దేవునిగా ఉన్నాడు.
వినాయకుని కుటుంబం :
వినాయకునికి ఇద్దరు భార్యలున్నారు. సిద్ది మరియు బుద్ది అని పండితులు చెబుతుంటారు. బుద్దిని, రిధి అనే నామంతో కూడా పిలుస్తారు. బుద్ది శ్రేయస్సుని సూచిస్తే, సిద్ది విజయానికి చిహ్నంగా ఉంటుంది. వినాయకునికి ఇద్దరు కొడుకులు. శుభుడు, లభుడు అని. ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి, పేరుప్రఖ్యాతలకు ప్రామాణికంగా సూచిoపబడితే, సిద్ది కుమారుడైన లభుడు, లాభానికి చిహ్నంగా చెప్పబడ్డాడు. అందుచేతనే ఒక్క వినాయకుని పూజిస్తే అన్నిటా విజయములు సొంతమవుతాయని భక్తుల ప్రఘాడవిశ్వాసముగా ఉంటుంది. తద్వారా ఎటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా, మొట్టమొదట వినాయకుని పూజ చేయడం హిందువుల ఆనవాయితీగా ఉంటుంది. ఎటువంటి ఆటంకములూ లేకుండా కార్యాలు పూర్తవుతాయని భక్తుల నమ్మకం.
వినాయకునికి ఒక దంతం విరిగి ఉంటుంది :
వినాయకుని ప్రతిమను ఎప్పుడైనా గమనించారా, ఒక దంతం విరిగి ఉండడం గమనించవచ్చు. ఒకప్పుడు పెద్దవారు మనకు కథలుగా చెప్పడం వలన, అనేకమందికి ఈవిషయాల గురించిన అవగాహన ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఒకసారి వినాయకుడు, ద్వారంవద్ద కాపలా కాస్తున్న సమయాన, శివుని దర్శనానికి పరశురాముడు వచ్చాడు. పరశురాముడు మహావిష్ణువు అంశ మరియు ముక్కోపి కూడా. కానీ, వినాయకుడు పార్వతీ పరమేశ్వరులకు అంతరాయం కలిగించకూడదన్న నెపముతో పరశురాముని లోనికి పంపలేదు. ఆగ్రహావేశాలకు గురైన పరశురాముడు, తన ఆయుధమైన గొడ్డలిని వినాయకునిపై విసరగా, ఆ గొడ్డలి శివునిచే ప్రసాదింపబడినది కావడం వలన, యుద్దానికి దిగకుండా, వినాయకుడు ఆయుధాన్ని అంగీకరించాడు. ఆ గొడ్డలి దంతాన్ని విరిచేసింది. మరో కథ ఆధారంగా లోక క౦ఠకునిగా పరిణమించిన మూషికుని సంహరించేందుకు తానే స్వయంగా దంతాన్ని విరిచి మూషికుడిపై అస్త్రంలా ప్రయోగించాడు, ఆ సమయాన మూషికుని భార్య పార్వతీదేవిని శరణుకోరగా, తన చేతి గాజుని దంతానికి అడ్డుగా నిలిపి మూషికుని కాపాడింది పార్వతీదేవి. తప్పు తెలుసుకున్న మూషికుడు అప్పటి నుండి గణేశుని సేవకై అంకితమైపోయాడు.
ఎలుక వినాయకుని వాహనంగా ఉండడానికి కారణాలు :
అన్నదమ్ములైన వినాయకుడు మరియు కార్తికేయులలో అగ్ర పూజ అర్హత గురించిన ప్రశ్న తలెత్తింది. విశ్వ భ్రమణం గావించి ముందుగా వచ్చిన వారికి ఆదిపూజ అర్హత ప్రసాదింపబడుతుంది అని నారదుడు సూచించగా, కార్తికేయుడు తన వాహనం అయిన నెమలిని అధిరోహించి విశ్వభ్రమణానికి పూనుకున్నాడు. ఇది కార్తికేయునికి చాలా తేలికైన అంశము. కానీ, వినాయకునికి ఎటువంటి వాహనమూ లేదు. ఆ సమయంలో నారదమునీంద్రుల సలహా ప్రకారం, తల్లిదండ్రులే విశ్వమని గ్రహించిన వినాయకుడు వారిచుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు. తద్వారా కార్తికేయుడు ఎక్కడికెళ్ళినా అక్కడ వినాయకుడు కనిపిస్తూ వచ్చాడు. క్రమంగా ఓటమిని అంగీకరించిన కార్తికేయుడు, వినాయకుడే అగ్రపూజకు అర్హుడని ఒప్పుకున్నాడు. అప్పటి నుండి ఆదిపూజ వినాయకునికి చేయడం హిందూమతంలో సాంప్రదాయంగా మారింది. ఇలా వాహనం లేక ఇబ్బందులకు గురైన వినాయకుడు, మూషికాసురుని గెలిచిన తర్వాత తనవాహనం వలె ఉండేందుకు వరాన్ని ప్రసాదించాడు. మూషికాసురుని భార్య ఛత్రముగా మారి వినాయకునికి తన వంతు సేవలను అందిస్తుంది.
వినాయకుని గజాననుడిగా పిలుస్తారు ఎందుకు?
గజము అనగా ఏనుగు, ఆనన అనగా తల. ఏనుగు ముఖాన్ని తలగా కలిగి ఉన్న రూపం కలవాడు కాబట్టి గజాననుడిగా కూడా పిలవబడుతాడు. మరో కథనం ప్రకారం, గ అనగా గతి, జ అనే పదం జన్మ అను పదాల నుండి వచ్చినది. అనగా ఈ ప్రపంచంలో ఎటువంటి విషయాలైనా వినాయకుని కారణం చేతనే జరుగుతుంది, మరియు అన్ని ఫలితాలు వినాయకుని చేతనే నిర్ణయించబడుతాయి. మరియు చావు పుట్టుకలకు మూలాధారముగా కూడా వినాయకుడు కీర్తింపబడుతున్నాడు.
వినాయకుని గణపతి అని పిలవడానికి గల కారణాలు :
వినాయకునికి గణపతి అని మరొక పేరు కూడా ఉంది. గణ అనగా అంశము. గణాలకు అధిపతి కావున గణపతిగా కీర్తిని గడించాడు. ఈ విశ్వంలో ఉన్న అన్ని అంశాలు 5గణాలుగా విభజింపబడినవి. ఎటువంటి విషయం అయినా వాటి వాటి గణాలకు నిర్దేశించబడి ఉంటాయి. ఈ గణాలు వినాయకుని నుండే జనిస్తాయి. అంతేకాకుండా పార్వతిదేవి నివాసాన్ని కాపు కాచే వారిని కూడా గణాలుగా పరిగణించబడుతుంది. ఈ ద్వారపాలకులు శివునితో కలిసి యుద్దానికి వెళ్ళిన సమయాన, వినాయకుడు ద్వార పాలకునిగా ఉన్న కారణాన కూడా గణపతి అనే నామం, ఏర్పడిందని చెబుతుంటారు.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆద్యాత్మిక, ఆహార, ఆరోగ్య, జీవన శైలి, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.