Just In
కార్న్ ఫ్లోర్తో అందమైన, ఆకర్షణీయమైన చర్మం
కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, ఆఫీసులకు వెళ్లే పడతులు ఎవరికైనా చర్మ సమస్యలు కామన్. బయటకు వెళ్లారంటే దుమ్ము, ధూళి కారణంగా చర్మ ఆరోగ్యానికి హాని చేస్తాయి. వీటితో పాటు ఒత్తిడి, ఆందోళన కారణంగా చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది.
మానసిక ఒత్తిడి కారణంగా చర్మం నిర్జీవంగా మారడమే కాకుండా.. మొటిమలు, మచ్చలు తీవ్రంగా ఇబ్బందిపెడతాయి. ఇలాంటప్పుడు క్రీములు వాడటం కన్నా.. ఇంట్లో ఉండే వాటితోనే చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. మేని ఛాయను పెంపొందించుకోవడానికి మొక్కజొన్న పిండి బాగా ఉపయోగపడుతుంది.
రకరకాల వంటకాల్లో వాడే మొక్కజొన్న పిండి సౌందర్యానికి ఎంతో సహాయపడుతుంది. చర్మకాంతిని పెంచడమే కాదు.. రకరకాల చర్మ సమస్యలను పోగొట్టి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్కజొన్నతో ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.. మీ చర్మకాంతి ఇనుమడింపచేసుకోండి.
స్మూత్ స్కిన్ కి
చర్మం స్మూత్ గా లేకపోతే నిర్జీవంగా తయారవుతుంది. ఇలాంటప్పుడు మొక్కజొన్న పిండి చక్కటి పరిష్కారం. రెండు స్పూన్ ల మొక్కజొన్న పిండిలో రెండు స్పూన్ల బియ్యపిండి, ఒక స్పూన్ పాలు, తేనె వేసి కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే.. మంచి ఫలితం ఉంటుంది. చర్మం స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.
స్క్రబ్ లా
దుమ్ము, ధూళికి నిర్జీవంగా మారిన చర్మానికి మొక్కజొన్న పిండి ట్రై చేయండి. ఒక స్పూన్ మొక్కజొన్న పిండికి స్పూన్ కాఫీపొడి, స్పూన్ ఓట్స్ పొడి, కొంచెం కొబ్బరి నూనె కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత సున్నితంగా రుద్దుతూ క్లీన్ చేసుకుంటే.. చర్మం తాజాగా మెరిసిపోతుంది.
నల్లమచ్చలు
స్పూన్ మొక్కజొన్న పిండికి రెండు స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా పసుపు, కొంచెం రోజ్ వాటర్ కలిపుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖంపై ఉండే మొటిమలతో పాటు మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఇది ముఖానికి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.
ముడతలకు
ముఖంపై ముడతలు చాలా ఇబ్బందికి గురిచేస్తుంటాయి. వయసుపైబడినట్లు కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రెండు స్పూన్ల మొక్కజొన్న పిండికి గుడ్డులోని తెల్లసొన, రెండు స్పూన్ల కమలారసం, స్పూన్ తేనె కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత మళ్లీ ఇంకోసారి రాసుకోవాలి. ఇలా మూడు లేదా నాలుగు సార్లు అప్లై చేస్తూ ఉండాలి. తర్వాత చల్లటి నీటితో కింది నుంచి పైకి రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తుంటే చర్మంపై ముడతలు తగ్గి మృదువుగా తయారవుతుంది.
మెరుగైన ఛాయకు
బాగా పండిన అరటిపండు, బొప్పాయి ముక్కలు తీసుకుని మొక్కజొన్న పిండి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట ఫ్రిజ్ లో ఉంచాలి. తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని తర్వాత నెమ్మదిగా కలిపి పెట్టుకున్న మిశ్రమంతో మసాజ్ చేయాలి. తర్వాత నీటిలో ముంచిన కాటన్ తో ప్యాక్ తొలగించుకోవాలి. ఈ ప్యాక్ తో చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
పొడిచర్మానికి
అరటిపండు, బొప్పాయి ముక్కలకు మొక్కజొన్న పిండిని కలిపి పేస్ట్ చేయాలి. అలాగే కాస్త రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో చర్మానికి మసాజ్ చేస్తూ ఉండాలి. తరచుగా ఇలా చేస్తూ ఉంటే.. పొడిచర్మం తగ్గిపోయి స్మూత్ గా తయారవుతుంది.
జిడ్డు చర్మానికి
జిడ్డు చర్మానికి గుడ్ బై చెప్పాలంటే.. మొక్కజొన్న పిండి బాగా సహాయడుతుంది. అరటిపండు గుజ్జు, బొప్పాయి గుజ్జు, కాస్త మొక్కజొన్న పిండి, కొంచెం నిమ్మరసం తీసుకుని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల జిడ్డుగా ఉన్న చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
మాయిశ్చరైజర్ లా
మొక్కజొన్న పిండిలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి చర్మం కాంతివంతంగా మారడానికి సహాయడపతుంది. చర్మంపై ఇది మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.