Just In
- 14 hrs ago గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- 15 hrs ago అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- 17 hrs ago Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- 19 hrs ago Gruha Pravesham Wishes : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
ఖర్జూరాలను తెగ తినేస్తున్నారా? ఇది చదివితే దాని జోలికి వెళ్లరేమో!
రంజాన్ మాసంలో ఖర్జూరాలు మార్కెట్లో కుప్పలు తెప్పలుగా అమ్ముతుంటారు. ఎరుపు, నలుపు రంగుల్లో నిగనిగలాడుతూ చాక్లెట్లలా నోరూరిస్తుంటాయి. వాటిని చూడగానే గబగబా నోట్లో ఒక పది పన్నెండు పండ్లు వేసుకోవాలనిపిస్తుంది.
పైగా ఖర్జూరాలు చాలా మంచివనే సద్భావన. అలాంటిది మీరేంటి కొత్తగా ఖర్జూరాల వల్ల సమస్య అంటున్నారు! ఏదేమైనా ఖర్జూరాలు తినడం వల్ల ఏం ప్రమాదముంటుందో తెలుసుకొని దాని సంగతి చూడాల్సిందే!
1. ఉదర సమస్యలు
ఖర్జూరాలు నేరుగా ఉదర సమస్యలను సృష్టించవు. అయితే వీటిలో కృత్రిమంగా కలిపే రసాయన పదార్థాల వల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. సల్ఫైట్లు అనే రసాయన పదార్థాన్ని ఖర్జూరాలను నిల్వ ఉంచేందుకు వాడతారు. ఇవి హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఐతే కొందరికి సల్ఫైట్లు లాంటి రసాయన పదార్థాలు పడవు. అలాంటివారికి కడుపు నొప్పి, గ్యాస్, డయేరియా, ఉబ్బసం లాంటి సమస్యలు ఏర్పడవచ్చు.
ఖర్జూరాల్లో ఫైబర్ శాతం ఎక్కువ. అది వరకే తక్కువ ఫైబర్ తీసుకునేవారు ఎక్కువ మోతాదులో ఖర్జూర పండ్లను తినడం మూలాన ఫైబర్ శాతం ఎక్కువై హఠాత్తుగా కడుపునొప్పి, కళ్లు తిరగడం, ఉబ్బసం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
ఖర్జూరాలు తినడం వల్ల ఒక్కోసారి డయేరియా కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
2. చర్మంపై వాపులు
ఖర్జూరం లాంటి ఎండు ఫలాలు చర్మంపై వాపులను సృష్టించవచ్చు. దీనికి మళ్లీ రసాయన పదార్థాలైన సల్ఫైట్లు కారణంగా చెప్పుకోవచ్చు. అదీ కాక ఈ పండ్లలో దాగి ఉండే ఫంగస్ కూడా చర్మంపై ర్యాషెస్ ఏర్పడేందుకు ఒక కారణంగా చెప్పుకోవచ్చు.
3. ఆస్థమా ప్రమాదాలు
కచ్చితంగా ఖర్జూరాలు ఆస్థమా ప్రమాదాన్ని తెస్తుందని ఏ పరిశోధనలోనూ వెల్లడి కాలేదు. ఐతే వీటి వల్ల ఏర్పడే అలర్జీల కారణంగా ఆస్థమాకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. ఆస్థమాతో బాధపడే వారిలో 80శాతం మందికి ఫంగస్, నాచుతో అలర్జీ ఉంటుంది. దీని కారణంగానే ఆస్థమా ప్రమాదం ఎక్కువవుతుంది.
4. బరువు పెరగొచ్చు!
అదేంటీ ఖర్జూరాల్లో ఫైబర్ ఎక్కువ కదా! బరువు తగ్గాలి కదా అంటారా! నిజానికి ఖర్జూరాల్లో క్యాలరీలు ఎక్కువ. దీని వల్ల తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంది. ప్రతి గ్రాము ఖర్జూరానికి 2.8 క్యాలరీలు ఉంటాయి. అంటే దీన్ని బట్టి భారీగానే బరువు పెరిగే అవకాశం ఉంది.
5. హైపర్ ల్యూకేమియా ప్రమాదం!
రక్తంలో పొటాషియం ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంటే దాన్ని హైపర్ ల్యూకేమియా అంటారు. ఖర్జూరాల్లో పొటాషియం పాళ్లు ఎక్కువ. అందుకే వీటిని ఎక్కువగా తింటే హైపర్ ల్యూకేమియా వచ్చే ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నట్టే. ఖర్జూరాలను కాస్త అదుపులో తింటే దీని బారి నుంచి తప్పించుకోవచ్చు.
ప్రతి లీటర్ రక్తంలో పొటాషియం స్థాయి 3.6 నుంచి 5.2 మి.లీ. ఉండాలి. 7 మి.లీ. లకు మించితే మాత్రం చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
6. మైనపు పూతతో హాని!
యాపిల్ పండు నిగనిగలాడేలా మైనపు పూత పూయడం తెలిసిందే. ఖర్జూరం విషయంలోనూ కొందరు వ్యాపారులు అదే చేస్తారు. చూసేందుకు తాజాగాను కనిపిస్తాయి. ఖర్జూరాలపై పెట్రోలియం వ్యాక్స్, లేదా కెమికల్ స్ప్రే చల్లుతారు. ఇవి రెండు జీర్ణ సమస్యలను గురిచేసే అవకాశం ఉంది.
7. చిన్న పిల్లలకు మంచిది కాదు
ఖర్జూరాలు చాలా దళసరిగా ఉంటాయి. వాటిని చిన్న పిల్లలు నమలాలన్నా కష్టమే. సరిగ్గా అరగదు కూడా! దీని వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. ఖర్జూరాలను పసిపాపలకు ఇస్తే అవి శ్వాస నాళికను అడ్డుకునే ప్రమాదముంది. అందుకని దయచేసి పసిపిల్లలకు ఖర్జూరాల డబ్బాను దూరంగా పెట్టండి.
8. తీపిదనం ఎక్కువై...
ఖర్జూరాల్లో సహజంగానే తీపి పాళ్లు ఎక్కువ. కొందరికి అతి తీపి పడదు. చక్కెర సరిగ్గా అరగక కడుపులో గ్యాస్, మంట ఏర్పడవచ్చు. అదీ కాకుండా కడుపులోని బ్యాక్టీరియాతో కలిసి మరిన్ని సమస్యలు సృష్టించే అవకాశం ఉంది.
ఇవండి ! ఖర్జూరాలతో ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని విషయాల్లో మనకు స్పష్టత కావాలి... అవేమిటో చూద్దామా!
రక్తంలో చక్కెరస్థాయిపై ప్రభావం
ఖర్జూరాలు తీయగా ఉంటాయి కాబట్టి రక్తంలో చక్కెర స్తాయిలను పెంచుతాయి. ఐతే ఇందుకు తగిన ఆధారాలు మాత్రం లేవు. మరి కొన్ని పరిశోధనల్లో తేలిందేమిటంటే ఖర్జూరాలు రక్తంలో చక్కెరస్థాయిని తగ్గించి డయాబెటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తాయట! దీనికీ కారణాన్ని కనిపెట్టారు. ఖర్జూరాల్లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్నా.. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల అంత ప్రమాదమేమీ కాదని తేలింది.
ఖర్జూరాలు తినడం వల్ల పళ్లు పాడవుతాయని ఎక్కడా పరిశోధనలో రుజువు కాలేదు. ఐతే ఎందుకైనా మంచిది డాక్టర్ను సంప్రదించడం మేలు.
ముఖ్యంగా గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు ఖర్జూరం ఆరోగ్యకర ఆహారం. డెలివరీకి 4 వారాల ముందు నుంచీ ఖర్జూరాలు తినడం వల్ల ప్రసూతి సవ్యంగా సాగుతుందని ఒక పరిశోధనలో తేలింది.
ఏదైనా సరే మితిమీరి తినడం శ్రేయస్కరం కాదు. ఖర్జూరాల విషయంలోనూ ఇదే పాటించాలి.
అదుపులో తింటే హాయిలే!
ఈ కథనం చదివి.. ఖర్జూరాలకు ఆమడ దూరం ఉండాలని కాదు. ఖర్జూరాలపై ప్రేమతో రోజుకు 10 పండ్లు లాగించేశారనుకోండి అప్పుడు సమస్య మొదలవ్వచ్చు. కేవలం ఖర్జూరాలే కాదు.. ఈ లోకంలో అనేక పండ్లు ఉన్నాయి. వాటినీ రుచి చూసి మైమర్చిపోండి.