Just In
Netaji Birth Anniversary:‘పరాక్రమ్ దివాస్’ఎవరి జ్ణాపకార్థం జరుపుకుంటారంటే...!
సుభాష్ చంద్ర బోస్ జయంతి దినోత్సవం 2022 సందర్భంగా మనలో ప్రేరణ పెంచే నేతాజీ నినాదాలు.. తన జయంతి ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
'మీరు నాకు రక్తం ఇస్తే.. నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను' అనే నినాదం భారతదేశంలోని అత్యంత గౌరవనీయమైన నినాదాల్లో ఒక ప్రముఖమైన దానిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు అందించారు. ఈయన ఆలిండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండుసార్లు మరియు భారత జాతీయ సైన్యం నాయకుడిగా కూడా పని చేశారు. అంతేకాదు ఈయన 'ఆజాద్ హిందూ ఫౌజ్' అనే సంస్థను ఏర్పాటు చేసి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఒడిశాలోని కటక్ లో 1897, జనవరి 23వ తేదీన జన్మించిన ఈయన అతి తక్కువ కాలంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగారు.
అదే సమయంలో గాంధీజీతో విభేదించారు. బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి విముక్తి కలగాలంటే శాంతి, అహింస మార్గాలే కాదు.. సాయుధ పోరాటం కూడా చేయాలన్నారు. అప్పుడే మనకు స్వాతంత్య్రం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి. రామక్రిష్ణ పరమహంస, స్వామి వివేకానందుల మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించారు.
'మానవసేవే మాధవసేవ' అనే నినాదం, రామక్రిష్ణ ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత భారతదేశ స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్నారు. శ్రీ ఆర్యా పత్రికలో ఆయన సంపాదకులుగా రాసిన వ్యాసాలు స్వాతంత్య్ర సమరంలో పాల్గొనే వీరుల్లో మంచి ఉత్సాహాన్ని నింపాయి.
తను డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లండ్ కు వెళ్లిన సమయంలోనే జలియన్ వాలా బాగ్ ఉదంతం చోటు చేసుకుంది. అదే సందర్భంలో యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించే మరియు మనకు స్ఫూర్తినిచ్చే సందేశాలు. నినాదాలను ఎన్నో ఇచ్చారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా ఆయన నినాదాలను, మాటలను మరోసారి గుర్తు చేసుకుందాం...
Netaji Birth Anniversary : మనలో పోరాట పటిమను పెంచే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సందేశాలివే...
ఆంగ్లేయులపై పోరు..
సుభాష్ చంద్ర బోస్ ‘ఆజాద్ హింద్ ఫౌజ్' అనే సంస్థను స్థాపించి.. అందులో అనేక మందికి శిక్షణ ఇచ్చి.. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమయ్యాడు. వారిపై యుద్ధం ప్రకటించి భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని మరో మలుపు తిప్పిన స్వాతంత్య్ర సమరయోధుడు.
స్వాతంత్య్ర పోరులో..
భారత స్వాతంత్య్ర పోరులో నేతాజీ పాత్ర చాలా కీలకం. ఆయన సొంతంగా ఆర్మీని ఏర్పాటు చేసి.. రష్యా, జపాన్ ఇంకా ఇతర దేశాల సహాయం తీసుకుని.. ఆంగ్లేయులను ఓడించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అనూహ్య రీతిలో ఆయన కల నెరవేరలేదు.
విమాన ప్రమాదంలో..
మన దేశానికి స్వాతంత్య్రం రావడానికి అతి కొద్ది కాలం ముందే అంటే 1945 సంవత్సరంలో ఆగస్టు 18వ తేదీన తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు చాలా మంది చెబుతారు. అయినా తన మరణంపై నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
పరాక్రమ్ దివాస్..
ఆయన పోరాట పటిమను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తనకు అరుదైన గౌరవం కల్పించింది. ఆయన జన్మించిన జనవరి 23వ తేదీన ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివాస్' దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించింది. 2021లో నేతాజీ 125వ జయంతి దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది.
- సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?
సుభాష్ చంద్ర బోస్ ఒడిశాలోని కటక్ లో 1897, జనవరి 23వ తేదీన జన్మించిన ఈయన అతి తక్కువ కాలంలో అత్యంత ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అదే సమయంలో గాంధీజీతో విభేదించారు. బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి విముక్తి కలగాలంటే శాంతి, అహింస మార్గాలే కాదు.. సాయుధ పోరాటం కూడా చేయాలన్నారు. అప్పుడే మనకు స్వాతంత్య్రం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి. రామక్రిష్ణ పరమహంస, స్వామి వివేకానందుల మార్గంలో పయనించి సన్యాసం తీసుకోవడానికి తీర్మానించారు.
- పరాక్రమ దినోత్సవాన్ని ఎవరి జ్ణాపకార్థం జరుపుకుంటారు?
సుభాష్ చంద్ర బోస్ పుట్టినరోజును పురస్కరించుకుని.. ప్రతి సంవత్సరం భారతదేశంలో పరాక్రమ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2021లో నేతాజీ 125వ జయంతి సందర్భంగా కేంద్రం ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకోవాలని నిర్ణయించింది.