Just In
- 5 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 5 hrs ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
- 6 hrs ago వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- 7 hrs ago ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
నర్స్ లినీ లేఖ : సాజీ చెట్టా.. నేను చనిపోతున్నా.. ఒంటిరిగా ఉండొద్దు.. విత్ లాట్స్ ఆఫ్ లవ్
సాజీ చెట్టా... ఇక నేను చనిపోబోతున్నానని నాకు తెలుసు. నాకు నిపా వైరస్ సోకింది. ఈ వైరస్ సోకితే చికిత్స లేదని తెలుసు. కొన్ని గంటల్లోనే చనిపోతాను అని నాకు తెలుసు.. నిపా వైరస్, నిఫా వైరస్ నర్స్ లినీ.కేరళ
'సాజీ చెట్టా... ఇక నేను చనిపోబోతున్నానని నాకు తెలుసు. నాకు నిపా వైరస్ సోకింది. ఈ వైరస్ సోకితే చికిత్స లేదని తెలుసు. కొన్ని గంటల్లోనే చనిపోతాను అని నాకు తెలుసు.. చివరిసారిగా మిమ్మల్ని, పిల్లలను కూడా చూడలేను అని తెలుసు. ఇది గుండెలను మరింత పిండేస్తుంది. నిన్ను కలుసుకునే సమయం లేదని కూడా తెలుసు.'మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో.
'మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. నీతో పాటు వాళ్లను గల్ఫ్కు తీసుకెళ్లు.పాపం కుంజూ, తనని మీతో గల్ఫ్కి తీసుకెళ్లండి. నాన్నలాఅతడ్ని ఒంటరిగా వదిలేయకండి... విత్ లాట్స్ ఆఫ్ లవ్' ఇవి నిపా వైరస్ సోకి మరణశయ్యపై ఉన్న నర్సు లినీ(31) చివరి మాటలు. ఇప్పుడు సోషల్ మీడియా అంతటా నిపా వైరస్ తో పాటు లినీ మాటలు కూడా ట్రెండింగ్ అవుతున్నాయి.
లేఖ అంతటా వైరల్
నిపా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో నర్సు లినీకి కూడా ఆ వ్యాధి సోకి చనిపోయిన విషయం తెలిసిందే. మరణానికి కొద్ది గంటల ముందు భర్తకు లినీ రాసిన లేఖ మాత్రం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది.
లినీ వీర మరణం పొందారు
లినీ మరణంపై డాక్టర్ దీపూ సెబిన్ స్పందించారు. దేశ ప్రజల రక్షణలో భాగస్వామ్యమై ప్రాణాలు వదిలిన లినీ వీర మరణం పొందారని, ఆమె అమరవీరురాలు కాకపోతే మరెవరో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. అయితే తాను చనిపోతున్నానని గ్రహించిన లినీ ఐసీయూ గదిలోనే తన భర్తకు రాసిన లేఖ ఇప్పుడు నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఇన్ఫెక్షన్ విస్తరించకుండా
అయితే ఆమెను కడసారి చూసుకునేందుకు కూడా ఆమె కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వలేదు. ఇన్ఫెక్షన్ విస్తరించకుండా నిరోధించేందుకు ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు.
వైరస్ వ్యాప్తిచెందకూడదని..
‘‘నిపా వైరస్ సోకిన రోగులకు లినీ చికిత్స అందించింది. అదే వైరస్ ఆమెను బలితీసుకుంది. వైరస్ వ్యాప్తిచెందకుండా ఆమె మృతదేహానికి హుటాహుటిన దహన సంస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. కనీసం ఆమె కుటుంబ సభ్యులకు కడసారి చూసుకునే అవకాశం రాలేదు...'' అని డాక్టర్ దీపూ సెబిన్ పేర్కొన్నారు. హెల్త్కేర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి మనకు వైద్యం అందిస్తున్నారనీ... దేశప్రజల రక్షణలో భాగంగా లినీ వీరమరణం పొందారని ఆయన వ్యాఖ్యానించారు.
విద్యుత్ శ్మశానవాటికలో
నిపా వైరస్కు మనిషి నుంచి మనిషికి వ్యాపించే స్వభావం ఉండడంతో నర్సు లినీ మృతదేహాన్ని పెరువన్నముళి సమీపంలోని చెంబనోడా ప్రాంతంలో ఉన్న ఆమె స్వగ్రామానికి తరలించలేకపోయారు.కుటుంబ సభ్యుల అనుమతితో కేరళ ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుని కోళికోడ్లోనే ఒక విద్యుత్ శ్మశానవాటికలో లినీ అంత్యక్రియల్ని నిర్వహించింది.
క్రిస్టియన్ అయిన లినీ..
క్రిస్టియన్ అయిన లినీ అంత్యక్రియలు వారి మతానుసారం నిర్వహిస్తే వైరస్ మరింతమందికి శరవేగంగా వ్యాపిస్తుందన్న ఆందోళనతో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విద్యుత్ దహనవాటికలో తక్షణం దహనం చేయించాల్సి వచ్చింది.
గల్ఫ్ నుంచి వచ్చిన భర్త
లినీకి ఐదేళ్లు, రెండేళ్ల ఇద్దరు మగపిల్లలు సంతానం కాగా.. భర్త గల్ఫ్లో పనిచేస్తుండగా రెండు రోజుల క్రితమే స్వదేశానికి వచ్చాడు. ఇంతలోనే ‘నిపా' ఆమెను పొట్టనపెట్టుకుంది. దీంతో కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన సంతానానికి కూడా కడచూపు దక్కలేదన్న విషయం దావానలంలా వ్యాపించి అందరినీ దుఃఖంలో ముంచుతోంది.
కడసారి చూపునకు నోచుకోలేదు
లినీ జబ్బున పడిందన్న భర్త సజీశ్ కేరళకు వచ్చినా వైద్యులు అతనిని లినీని కలవనివ్వలేదు. పిల్లలు సిద్ధార్థ్ (5), రితుల్ (2) కూడా అమ్మ ముద్దుకైనా నోచుకోలేదు. కడసారి చూపునకు నోచుకోలేదు.
లినీ పుతుస్సేరి కోజికోడ్లోని పెరంబర ఆస్పత్రిలో నిపా వైరస్ బారిన పడిన తొలి బాధితుడికి చికిత్స చేసిన బృందంలో పని చేసింది. నిపా వైరస్తో చంగరోత్ ప్రాంతం నుంచి పెరంబ్రా ఆసుపత్రిలో చేరిన ఒక యువకుడికి మాత్రమే అతడి చివరి రోజులలో నర్సుగా లినీ ఆప్యాయత అందింది.
లినీలో జబ్బు లక్షణాలు
ఆ తర్వాతి నుంచీ లినీలో ఆ జబ్బు లక్షణాలు కనిపించడం మొదలైంది. లినీకి కూడా ఈ వైరస్ సోకిందని నిర్ధారించుకున్న వెంటనే ఆమె భర్తకు వైద్యాధికారులు సమాచారం పంపించారు. అయితే అంతకంటే ముందే లినీ తన అంతిమ ఘడియల్ని పసిగట్టి భర్తకు ఉత్తరం రాశారు.
మృత్యువు కబళించింది
నిపా వైరస్ నాలుగు నుంచి పద్దెనిమిది రోజుల వ్యవధిలో మానవదేహంలో వృద్ధి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన రోగులకు అతి సమీపంలో ఉండి సేవలు అందించిందన్న కనికరం కూడా లేకుండా లినీని కూడా ఒక మామూలు రోగిలానే మృత్యువు కబళించింది.
కేరళ పర్యాటక శాఖ మంత్రి
లినీ అంత్యక్రియలకు కేరళ పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ హాజరయ్యారు. లినీ తన భర్తకు రాసిన ఉత్తరాన్ని ఆయనే తన ఫేస్బుక్లో పెట్టారు. లినీ మొదట కోళికోడ్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేశారు. గత సెప్టెంబరులో పెరంబ్రా తాలూకా ఆసుపత్రి కాంట్రాక్టుపై ఆమెను నియమించుకుంది. ఇక‘యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్' లినీ త్యాగనిరతిని ఆవేదనతో స్మరించుకుంది.
వైరల్ గా లేఖ
ఇక వైరల్గా మారిన ఈ లేఖ వెనుక విషాద గాథ ఉంది. శతృవుల బారినుంచి దేశాన్ని కాపాడే సైనికులు, అనారోగ్యం బారిన పడిన రోగికి చికిత్స చేసి.. సపర్యలు అందించే వైద్యులు, నర్సుల త్యాగనిరతితో కూడిన సేవ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
మరో ముగ్గురు నర్సులు కూడా..
ఇప్పటికే కోజికోడ్, మలప్పుర ప్రాంతాల్లో సుమారు 12 మందికి పైగా నిపా వైరస్ లక్షణాలతో కన్నుమూయగా.. చికిత్సలో భాగస్వామ్యులైన ముగ్గురు నర్సులకు కూడా ప్రాణాంతకమైన ఈ వ్యాధి సోకగా వారు చావుబ్రతుకులు మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో నిపా రోగులకు వైద్యం చేయాలంటే ఆసుపత్రి యాజమాన్యాలు, వైద్యులు, నర్సులు అందరూ వణికిపోతున్నారు.
యావత్తు సమాజం శ్రద్ధాజలి ఘటిస్తోంది
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన నర్సు లినీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని యునైటెడ్ నర్సెస్ అసోసియేషన్ (యూఎన్ఏ) డిమాండ్ చేసింది. త్వరలోనే తాము కూడా ఆమె కుటుంబసభ్యులకు చేతనైన సాయం చేస్తామని ప్రకటించింది.సిస్టర్ లినీ పుత్తుస్సెరీకి యావత్తు సమాజం శ్రద్ధాజలి ఘటిస్తోంది.