Just In
- 56 min ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- 3 hrs ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- 5 hrs ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
- 7 hrs ago First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
కార్గిల్ వార్ లో పాల్గొన్న ఏకైక మహిళా పైలట్ ఎవరో తెలుసా...
ఇండియన్ ఎయిర్ ఫోర్సులో, కార్గిల్ వార్ లో పాల్గొన్న గుంజన్ సక్సేనా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
ఆడవారు తలచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమి లేదు. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వారిని ఉద్దేశించి ఇలా ఉన్నాడు. దేన్నైనా భరించే శక్తి కేవలం రెండింటికే ఉంది అది ఒకటి నేల.. రెండోది స్త్రీలు మాత్రమే. చరిత్రను పరిశీలిస్తే కూడా యుద్ధ భూమిలో పురుషులకు ధీటుగా పోరాడిన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు.
రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారెందరో రణ రంగంలో తమ సత్తా ఏంటో చాటారు. మరోవైపు మన దేశానికి స్వాతంత్య్ర పోరాటంలో మేడమ్ బికాజీ కామా, సరోజిని నాయుడు, దుర్గాబాయ్ దేశ్ ముఖ్ తో పాటు ఎంతోమంది వీరవనితలు ఉన్నారు.
వీరందరి సంగతి పక్కనబెడితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. ఎన్నో కట్టుబాట్లు ఉండే మన దేశంలో అందరినీ ఎదిరించి.. దేశానికి సేవ చేసేందుకు మరణానికి సైతం భయపడకుండా.. మొక్కవోని దీక్షతో కార్గిల్ వార్ లో పాల్గొంది ఓ మహిళ. భయంకరమైన కార్గిల్ యుద్ధంలో ఏమాత్రం అధైర్యపడకుండా స్వేచ్ఛగా విమానాన్ని నడిపింది. అంతేకాదు భారత వాయుసేనలో తొలి మహిళా పైలట్ కూడా ఆమెనే.
'శౌర్య చక్ర' పురస్కారం సైతం అందుకున్న ఆమె 'ది కార్గిల్' గర్ల్ గా పేరు సంపాదించింది. ఆమె సాహసాలను మరోసారి ఈ తరానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఇటీవలే ఆమె బయోగ్రఫీ పేరిట ఓ సినిమా కూడా విడుదలైంది. ఆమె ఎవరో కాదు. 'గుంజన్ సక్సేనా'.. ఈ నేపథ్యంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...
గుంజన్ బాల్యం..
గుంజన్ సక్సేనా 1975లో సైనిక అధికారుల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి, సోదరుడు భారత సైన్యంలో సేవలందించారు. ఆమెకు ఐదేళ్ల సమయంలోనే కజిన్ ఒకరు కాక్ పిట్ చూపించేవారు. అప్పుడే ఆమె విమానం నడపాలని, పైలట్ కావాలని నిర్ణయించుకున్నారు. అలా ఢిల్లీలో డిగ్రీ చదువుతూనే.. ఫ్లయింగ్ క్లబ్ లో చేరారు. ఆమె తల్లిదండ్రులు తన కుమార్తె ప్రమాదకరమైన పనిలో చేరుతుందని తెలిసినా.. ఆమెకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఎలాంటి అడ్డంకులు చెప్పలేదు.
అదే తొలిసారి..
గుంజన్ తో సహా మొత్తం 25 మంది ఉన్న బ్యాచ్ కు శిక్షణ పూర్తవ్వగానే జమ్మూకాశ్మీర్ లో కొందరికి బాధ్యతలు అప్పజెప్పారు. మహిళా సిబ్బందిని తీసుకోవడం అదే మొట్టమొదటిసారి. అయితే మహిళా సిబ్బంది తొలిసారి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వారికి అక్కడ వసతులు లేవు. ప్రత్యేక స్నానపు గదులు, దుస్తులు మార్చుకునేందుకు వేర్వేరు గదులు లేవు. వీటన్నింటికీ కొంత సమయం పడుతుందని తెలిసి వారు చాలా ఓపికగా, మహిళా పైలట్లే రక్షణ గోడగా నిల్చొని దుస్తులు మార్చుకునేవారు.
తొలి మహిళగా రికార్డు..
కార్గిల్ వార్ లో భారత వాయు సేన తరపున పాల్గొన్న ఏకైక మహిళ గుంజన్ సక్సేనా. 25 ఏళ్ల వయసులో ఉన్న మహిళా పైలట్ గుంజన్ సక్సేనా 1999లో ఫార్వర్డ్ ఏరియా కంట్రోల్(ఎఫ్ఐసి)కు యుద్ధం ప్రారంభంలోనే వెళ్లారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని సందర్భాలు సైనికులకు చాలా అనుభవమే. అలాంటి అవకాశం తనకు కార్గిల్ యుద్ధంలో దక్కిందని గుంజన్ చెప్పారు. అంతేకాదు ఆమెనే కార్గిల్ వార్ లో పాల్గొన్న మొట్టమొదటి మహిళా పైలట్ కూడా.
అలా పిలుపొచ్చింది..
భారత సైన్యం ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సఫేద్ సక్సెస్ కావాలంటే వాయుసేన సహాయం అవసరం. అప్పటికే వాయుసేనలో పురుష పైలట్లు యుద్ధంలో పోరాడుతున్నా మరింత మంది అవసరం ఏర్పడింది. అప్పుడే లెఫ్టినెంట్ శ్రీవిద్య రాజన్ తో పాటు గుంజన్ సక్సేనాకు పిలుపొచ్చింది.
ఆ బాధ్యత అప్పగించారు..
పాకిస్థాన్ తో కార్గిల్ యుద్ధంలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతూ గాయపడ్డ వారిని సైనిక శిబిరాలకు చేర్చే బాధ్యతను వారికి అప్పగించారు. సరైన సమయంలో వారికి వైద్య సేవలు అందేలా హెలికాఫ్టర్లలో తరలించాలి. యుద్ధక్షేత్రంలోని వారికి నిత్యావసరాలు, యుద్ధసామాగ్రి తరలించాలి. పాక్ సైనికులు ఎక్కడ మాటు వేశారో గుర్తించి చెప్పాలి.
ప్రాణాలకు తెగించి..
ఆ సమయంలో గుంజన్ సక్సేనా తన ప్రాణాలకు తెగించి విధులను నిర్వర్తించింది. ఆమెకు కేటాయించిన చీతా హెలికాఫ్టర్ లో ఎదురుదాడి చేసేందుకు ఆయుధాలు ఉండవు. చిన్నగా ఉండే హెలికాఫ్టర్ లో ఒక సందర్భంలో గాయపడ్డ సైనికులను తీసుకొచ్చేందుకు వస్తుండగా, పాక్ సైనికులు రాకెట్ లాంఛర్లు ప్రయోగించారు. వరుసగా వస్తున్న బాంబులను ఆమె అత్యంత చాకచక్యంగా రిస్క్ చేసి తప్పించుకుంది. కొండపై హెలికాఫ్టర్ ను ల్యాండ్ చేసి గాయపడ్డ సైనికులను మళ్లీ సైనిక శిబిరానికి చేర్చారు. ఆమె తెగువను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
నాకేంతో ప్రేరణగా..
‘యుద్ధంలో గాయపడిన జవాన్లను తీసుకురావడంలో.. యుద్ధంలో పాల్గొనేందుకు నాకేంతో ప్రేరణ కలిగింది. వారి ప్రాణాలను కాపాడటమే ఒక హెలికాఫ్టర్ పైలట్ కు అత్యంత సంతోషం కలిగే అంశం' అని గుంజన్ చెప్పారు.
‘శౌర్య చక్ర’తో సత్కారం..
ఆమె చూపిన ధైర్య సాహసాలకు ప్రభుత్వం గుంజన్ సక్సేనాకు ‘శౌర్య చక్ర' అవార్డుతో గౌరవించింది. ఈ పురస్కారం అందుకున్న మొట్టమొదటి మహిళా పైలట్ కూడా సక్సేనానే కావడం విశేషం. స్వల్పకాల సేవల కమిషన్ కారణంగా ఈమె ఏడేళ్లకే 2004 జులైలో తన బాధ్యతలకు వీడ్కోలు పలకాల్సి వచ్చింది. ఆమె జీవిత చరిత్ర పేరిట ‘ది కార్గిల్ గర్ల్' అనే పుస్తక రూపంలో వచ్చింది. ఇప్పుడు సినిమాగా కూడా వచ్చేసింది..