Just In
- 3 hrs ago Gajalakshmi Rajayoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో గజలక్ష్మి రాజయోగంతో ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
- 4 hrs ago ఈరోజు రాశి ఫలాలు: ఈ రాశుల వారు డబ్బు విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి...
- 14 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
- 14 hrs ago అశ్విని నక్షత్రంలో శుక్ర సంచారం ఈ రాశుల వారికి నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి..
Women's World Boxing:బాక్సింగులో విశ్వ విజేతగా నిలిచిన నిఖత్ జరీన్ ఎవరు? ఈ స్థాయికి ఎలా ఎదిగిందంటే...
నిఖత్ జరీన్ ఎవరు? తెలంగాణ బాక్సర్ గా సత్తా చాటి విశ్వ విజేతగా ఎలా ఎదిగింది.
మన తెలంగాణ బిడ్డ ప్రపంచ స్థాయిలో సత్తా చాటింది.. మహిళా బాక్సర్ విభాగంలో విశ్వ విజేతగా నిలిచి భారత కీర్తిని మరింత ఇనుమడింపజేసింది.
ఒకప్పుడు మేరీకోమ్ నుండి అవమానం ఎదురైనప్పటికీ.. ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. తనకు ఎదురైన అడ్డుగోడలన్నింటినీ బద్దలు కొట్టింది.
మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన కారణంగా తనకు ఎదురైన ప్రతికూలతలన్నింటినీ కష్టపడి అధిగమించింది. అంతే భారత క్రీడా రంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. బాక్సింగులో పుష్కర కాలం పాటు అనేక అవమానాలు, ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంది. మొక్కవోనీ దీక్షతో.. పట్టుదలతో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది నిఖత్ జరీన్. తాజాగా గురువారం రాత్రి జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఉమెన్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో థాయ్ లాండ్ కు చెందిన జిట్ పాంగ్ పై పంచ్ ల వర్షం కురిపించింది.
అంతే నిఖత్ జరీన్ స్వర్ణ పతకం తన ఖాతాలో వేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇంతకీ నిఖత్ ఎవరు? మేరీకోమ్ సరసన నిలబడే అవకాశాన్ని ఎలా దక్కించుకుంది? తన కుటుంబ నేపథ్యం ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
కుటుంబ సహకారం..
నిఖత్ జరీన్ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించింది. జమీల్ అహ్మద్, పర్వీన్ సుల్తానా దంపతులకు ఉన్న నలుగురు కూతుళ్లలో మూడో అమ్మాయి నిఖత్. తనకు చిన్నప్పటి నుండే క్రీడలంటే చాలా ఇష్టముండేది. జమీల్ కూడా స్వతహాగా అథ్లెట్ కావడంతో తన ఇష్ట ప్రకారమే ఆమె తండ్రిని తనను ప్రోత్సహించాడు. ముందుగా అథ్లెట్ గా ఆరంభించిన నిఖత్ 100, 200, 400 రన్నింగ్ రేసుల్లో గెలిచి అనేక బహుమతులను గెలుచుకుంది. అయితే పిఇటి సలహా మేరకు తను బాక్సింగ్ ఎంచుకుంది. తనకు తన అక్కలు, అమ్మ అందరూ ఎంతగానో ప్రోత్సహించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
ఆరు నెలల్లోనే..
నిజామాబాద్ లో ప్రముఖ బాక్సింగ్ కోచ్ శంషముద్దీన్ వద్ద శిక్షణ తీసుకుంది. నిఖత్ చూపుతున్న ఆసక్తి.. తన అటాకింగ్, పంచ్ లను గమనించిన కోచ్ తన టాలెంట్ ను చూసి తనకు సరైన శిక్షణ ఇప్పించాడు. దీంతో తను 13 ఏళ్ల వయసులోనే బాక్సర్ గా ఎదగడమే కాదు.. కేవలం ఆరు నెలల కాలంలోనే రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచింది. అంతేకాదు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటి స్వర్ణం సాధించింది.
2011లోనే..
మరో మూడు నెలల్లోపే జాతీయ సబ్ జూనియర్ స్థాయిలో ఉత్తమ బాక్సర్ గా నిలిచి అందరినీ అబ్బురపరిచింది. అనంతరం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నేషనల్ క్యాంపుకు సెలెక్ట్ అయ్యింది. 2011లో టర్కీలో జరిగిన జూనియర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లోనూ విన్నర్ గా నిలిచింది. అదే ఆమె గెలుపుకు పునాదిగా మారిందని చెప్పొచ్చు.
మేరీకోమ్ తో అవమానం..!
నిఖత్ జరీన్ కు చిన్ననాటి నుండీ మేరీకోమ్ ఆదర్శం. తనలా ఎదగాలని కసిగా, పట్టుదలగా ఆడేది. కానీ తనతోనే అసలు పంచాయితీ వస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. 2019లో తనతో గొడవ జరిగింది. ఒలింపిక్స్ కు ముందు 51 కేజీల విభాగంలో ఏ ట్రయల్స్ మేరీకోమ్ ను భారత్ తరపున ఎంపిక చేయడం నిఖత్ కు నచ్చలేదు. అందుకే కేంద్ర మంత్రికి లేఖ రాసింది. ఇది తెలుసుకున్న మేరీకోమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో నిఖత్ తో బరిలోకి దిగి.. తనను భారీ పాయింట్ల తేడాతో ఓడించింది. అయితే గెలిచాక కనీసం మర్యాద ప్రకారం షేక్ హ్యాండ్ వెళ్లడమే కాదు.. చాలా చీదరింపుగా చూసింది.
మేరీకోమ్ సరసన సగర్వంగా..
ఆ సమయంలో నిఖత్ తప్పేమీ లేకున్నా.. దిగ్గజ బాక్సర్ తో తలపడేందుకు ప్రయత్నించిందని.. తనపై విమర్శలొచ్చాయి. అయినా అప్పటి నుండి మరింత కసిగా, పట్టుదలతో రింగులోకి దిగింది. ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ పైకి లేచింది. ఆ తర్వాత గాయం కారణంగా కొన్నిరోజుల పాటు బాక్సింగ్ కు దూరమైంది. కోలుకున్న తర్వాత ఏ దశలోనూ తిరిగి చూడలేదు. ఇప్పుడు ఏకంగా మేరీకోమ్ సరసన నిఖత్ సగర్వంగా నిలబడింది.
ఒలింపిక్స్ లక్ష్యం..
ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచిన నిఖత్ జరీన్ కు దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని మోడీ నుండి తెలంగాణ సీఎం దాకా ఎందరో ప్రముఖులు తనను అభినందిస్తున్నారు. 2024లో జరిగే ఒలింపిక్స్ లో భారత్ తరపున స్వర్ణం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ నిఖత్..