For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంటలు పిండివంటలు - దసరా స్పెషల్...

|

దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. నవరాత్రులు ఒక్కో రోజు.. ఒర్కో పేరుతో అమ్మవారిని కొలిచి చివరి రోజున చేసుకునే వేడుక విజయదశమి.. ఈ దసరా పండుగ నాడు ఎన్నో రకాల పిండి వంటలు, రకరకాల స్వీట్లు, పదార్థాలు తయారు చేస్తారు. ప్రాంతాలు వేరైనా.. వంటలు వేరైనా వాటిని భక్తితో దేవికి నైవేద్యంగా పెడతారు. ఈ పండుగ రోజు వివిధ ప్రాంతాల్లో తయారు చేసుకునే రకరకాల వంటలను ఇక్కడ ఇస్తున్నాం.. కమ్మని వంటలతో దేవిని కొలవండి.. అతిథులకు విందు చేయండి..

తారాట్టిపాల్‌

తారాట్టిపాల్‌

కావలసిన పదార్థాలు: పాలు: 1/2ltr, బెల్లం: 1cup, యాలుకల పొడి: 1tsp, నెయ్యి: 1tbsp. తయారు చేయు విధానం: ముందుగా వెడల్పాటి గిన్నెను స్టౌ మీద పెట్టి అందులో పాలు పోసి సన్నని మంట మీద బాగా మరగనివ్వాలి. పాలు సగం అయ్యే వరకు వాటిని కలుపుతూ మరిగించాలి. దగ్గరిగా అయిన తరువాత అందులో బెల్లం తురుముకుని వేసుకోవాలి. నెయ్యి కూడా వేసి గిన్నె అంచులకు అంటుకోకుండా కలుపుతూ వుండాలి. యాలుకల పొడి కూడా వేసి కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకుంటూ సన్నని మంట మీద బాగా దగ్గరిగా అయ్యే వరకు ఉడికించాలి. నెయ్యి పాల నుండి బయటికి వస్తున్నప్పుడు మరో అయిదు నిమిషాలు ఉడికించి తీసేయాలి.

రవ్వ బొబ్బట్లు

రవ్వ బొబ్బట్లు

కావలసిన పదార్ధాలు: రవ్వ: 1cup, మైదా: 2cups, గోధుమ పిండి: 1/2cup, పంచదార: 2cups, సోడా: చిటికెడు, నెయ్యి: 2tsp, నూనె: 1/2cup. తయారు చేయు విధానం: ముందుగా మైదా, గోధుమపిండి రెండింటినీ సమపాళ్ళలో తీసుకొని కలపాలి. దానిలో తగినన్ని నీళ్లు, వంట సోడా వేసి పూరీ పిండిలా కలిపి మూతపెట్టి ఉంచాలి. తర్వాత పాన్ లో నెయ్యి వేసి రవ్వను దోరగా వేయించి ఉంచాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో 3 కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు బాగా మరుగుతుండగా వేయించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి. రవ్వ ఉడికిందనుకున్న తరవాత పంచదార, యాలకులపొడి వేసి కలపాలి. ఇది పూర్ణం చేయడానికి సరిపడా చిక్కబడిన తరువాత పక్కకు దింపుకొని నిమ్మకాయ సైజులో ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న సైజు పూరీలా ఒత్తి మధ్యలో రవ్వ పూర్ణాన్ని పెట్టి చుట్టూతా పూరీతో మూసేసి మళ్లీ దాన్ని కర్రతో లేదా చేత్తో బొబ్బట్టులా ఒత్తి పెనం మీద నూనె లేదా నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.

పూర్ణం భక్షాలు

పూర్ణం భక్షాలు

కావలసిన పదార్థాలు: శెనగపప్పు: 1/2cup, మైదా: 1/2kg, ఏలకులు: 6, నెయ్యి: 1cup, వంటసోడా: చిటికెడు, పాలిథీన్‌ కవర్‌: 1, బెల్లం: 1/2kg, నూనె: సరిపడా, ఉప్పు: చిటికెడు. తయారు చేయు విధానం: ముందుగా వెడల్పుగా ఉన్న ప్లేట్ లో మైదా జల్లించి దానికి వంటసోడా, ఉప్పు కలపాలి. అందులో నెయ్యి వేసి నీళ్లు పోసి జారుగా కలపాలి. ఈ మైదాకు మధ్యలో గుంట చేసి కప్పు నూనె పోసి ఆకు మూత పెట్టాలి. నీరు మరిగించి శనగపప్పుకి బెల్లం, ఏలకుల పొడి కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ ముద్దని మనకి నచ్చినంత సైజు ఉండలు చేయాలి. నానిన మైదా ముద్దని నూనె పూసిన పాలిథీన్‌ కవరు మీద పరిచి, శెనగపప్పు బెల్లం ముద్దని మధ్య పెట్టి చుట్టూ మూసి భక్ష్యాన్ని పల్చగా వత్తి దళసరిపెనం మీద నెయ్యితో మాడకుండా కాల్చాలి. అతిధులకు ఇవి వడ్డిస్తే తినేందుకు ఎంతో రుచికరంగానూ వుంటాయి. అయితే వీటిని మాడనివ్వకుండా శ్రద్ధ వహించాలి.

మినప -నేతి గారెలు

మినప -నేతి గారెలు

కావలసిన పదార్థాలు: మినపపప్పు: 4cup, పచ్చిమిర్చి: 10, పచ్చికొబ్బరి తరుము: 1tsp‌, అల్లం పేస్టు: 5tsp, నూనె: సరిపడ, దాల్చిన చెక్క: 4ముక్కలు, లవంగాలు: 2, ఉప్పు: తగినంత, బ్లాక్ పెప్పర్: 1tsp‌, జీలకర్ర: 5tsp. తయారు చేయు విధానం: ముందుగా మినపపప్పును మూడు గంటల పాటు నీళ్ళలో నానపెట్టాలి. తరువాత ఈ మినపపప్పును మిక్సీలో వేయండి. ఇందులో నూనె తప్ప మిగతా పదార్థాలన్నింటినీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం స్టౌ వెలిగించి పాన్ పెట్టి తగినంత నూనె వేయండి. నూనె కాగిన తరువాత ప్లాస్టిక్‌ పేపర్‌పై మినపపప్పు మిశ్రమాన్ని వేసి గారెలుగా చేసి నూనెలో వేయండి. బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలి.

సాబుదాన(సగ్గు బియ్యం) వడలు

సాబుదాన(సగ్గు బియ్యం) వడలు

కావలసిన పదార్థాలు: సాబుదానా (సగ్గుబియ్యం): 1cup, ఆలూ: 1(ఉడికించి పొట్టుతీసినది), పచ్చిమిర్చి: 8, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: వేయించడానికి సరిపడ. తయారు చేయు విధానం: ముందుగా సగ్గుబియ్యంలో నీళ్లు పోసి కడగాలి. తరువాత అందులో నీళ్లు పోసి 2-3 గంటలు నాననివ్వాలి. నానిన తరువాత సగ్గుబియ్యం, ఆలూ, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు అన్నీ ఒక బౌల్‌ లో వేసి బాగా కలుపుకోవాలి. నూనె వేడి చేయాలి. సగ్గుబియ్యం మిశ్రమాన్ని చిన్న చిన్న వడలుగా చేతితో వత్తు కోవాలి. సన్నని మంట మీద నూనెను వుంచి వీటిని అందులో వేసి నెమ్మదిగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ప్లేటులో పేపర్‌ నాప్‌కిన్‌ వేసి దానిపై వేయించిన వడలు వేసుకోవాలి. ఎక్కువగా వున్న ఆయిల్‌ అది పీల్చుకుంటుంది.

పూర్ణం బూరెలు

పూర్ణం బూరెలు

కావాలసిన పదార్థాలు: మినపప్పు: 1cup, బియ్యం: 2cups, శెనగపప్పు: 2cups, బెల్లం: 2cups, యాలకుల పొడి: 1/2tsp‌, నెయ్యి: 1/2cup‌, నూనె: సరిపడ. తయారు చేయు విధానం: ముందుగా మినపప్పు, బియ్యాన్ని కడిగి సరిపడా నీళ్ళు పోసి సుమారు నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి. తరువాత మెత్తగా రుబ్బి పక్కకు పెట్టుకోవాలి. శెనగపప్పును కుక్కర్‌లో వేసి తగినంత నీళ్ళు పోసి ఉడికించాలి. ఇందులో తరిగిన బెల్లం వేసి కలిపి మళ్ళీ ఉడికించాల్సి ఉంటుంది. తడి పోయేంత వరకు ఉడికించాలి. లేకుంటే వేయించేటప్పుడు విడిపోయి నూనెలో కలసిపోతుంది. చివరలో యాలకుల పొడి, నెయ్యి వేసి కలిపి దింపేయాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ సైజులో ఉండేవిధంగా ఉండలు చేసుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకున్న తరువాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తరువాత ఉండలను మినపప్పు-బియ్యం మిశ్రమంలో పూర్తిగా ముంచి నూనె వేయాలి. బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించాలి.

కట్టె పొంగలి

కట్టె పొంగలి

కావలసిన పదార్థాలు: బియ్యం: 2cups, పెసరపప్పు: 1cup, మిరియాలు: 1/2tsp, జీలకర్ర: 1tsp, కరివేపాకు: 2రెబ్బలు, ఉప్పు: తగినంత, నెయ్యి: 4tsp, నూనె: 3tsp ఇంగువ: చిటికెడు, పచ్చిమిర్చి: 5. తయారు చేయు విధానం: బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. ఒక గిన్నెలో నూనె, సగం నెయ్యి వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత జీలకర్ర, మిరియాలు వేసి దోరగా వేగిన తర్వాత కరివేపాకు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేపి, మూడు గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. ఇందులో తగినంత ఉప్పు వేయాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం, పప్పు నీళ్లనుండి తీసి వేసి మెత్తగా ఉడికించాలి. చివరిలో మిగిలిన నెయ్యి వేసి దింపేయాలి.

పెసరపప్పు పొంగలి

పెసరపప్పు పొంగలి

కావలసిన పదార్థాలు: బియ్యం: 1cup, పెసరపప్పు: 1cup, బెల్లం: 2cup, నీళ్ళు: 4.5cups, జీడిపప్పు: 10, కిస్‌మిస్‌: 10, ఎండుకొబ్బరి ముక్కలు: 1/2cup, ఏలకుల పొడి: 1/2tsp, నెయ్యి: 1/2cup. తయారు చేయు విధానం: ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి దానిలో నెయ్యి మొత్తాన్ని వేసి ముందుగా ఎండుకొబ్బరి ముక్కలను కొంచెం ఎర్రగా మంచి సువాసన వచ్చేదాకా వేయించి దానిలోనే జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి. దానిని అన్నం వండినట్లుగానే ఉడికించుకుంటూ (అన్నం మొత్తం పలుకు లేకుండా ఉడకాలి. అన్నం మొత్తం ఉడికిన తరువాత ఎసరు లేకపోతే కొంచెం నీరు పోసుకోవచ్చు) కొంచెం నీరు ఉన్నప్పుడే దానిలో బెల్లం తురుము వేసి కరిగేదాకా మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌తో పాటుగా నెయ్యి వేసి బాగా కలిపాలి. అంతే.. ఎంతో రుచికరమైన స్వీట్‌ పెసర పప్పు పొంగలి రెడీ. నవరాత్రి సందర్భంగా కేరళా, తమిళనాడులో ఈ వంటకాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు.

బాదం పాయసం

బాదం పాయసం

కావలసిన పదార్థాలు: బాదం పప్పులు: 1cup, పాలు: 6cups, పంచదార: 1cup, కుంకుమ పువ్వు: కొద్దిగా, నీళ్లు: ఒక గ్లాసు. తయారు చేయు విధానం: ముందుగా బాదం పప్పులను వేడి నీటిలో వేసి ఒక గంట పాటు నాననివ్వాలి. తరువాత నీటిని వంచి బాదం గింజలపై వుండే పొట్టును తీసేయాలి. తర్వాత బాదం పప్పులను మిక్సీలో వేసి, మెత్తటి పేస్టులాగా చేసుకోవాలి. అవసరం అయితే పాలు వేసుకోవాలి. తరువాత బాదం పేస్టును పాన్‌లో వేసి 5- 10 నిమిషాలు వేడి చేయాలి. తరువాత అందులో చక్కెర వేసి ఇంకొంచెం సేపు వుంచాలి. అది చిక్కగా అయిన తరువాత పాలు మొత్తం వేసి ఉడికించాలి. దీనిపైన కుంకుమపువ్వుతో అలంకరించాలి. రుచికరమైన బాదం పాయసం రెడీ..

English summary

Dasara Special Recipes | శరన్నవరాత్రికి... నవరసాలా వంటలు...

Easy to cook and Traditional Recipes for Dussehra Festival. Here are some special festival recipes of navratri. You can prepare these tasty dishes easily in your homely kitchens...
Story first published: Monday, October 22, 2012, 14:41 [IST]
Desktop Bottom Promotion