Just In
Ashada Masam 2021:ఆషాడంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా...
2021 సంవత్సరంలో ఆషాఢ మాసం తేదీ, విశిష్టత మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
2021లో అప్పుడే మూడు నెలలు ముగిశాయి. తెలుగు క్యాలెండర్ ప్రకారం, నాలుగో నెల ఆషాఢ మాసం కూడా వచ్చేసింది. తెలుగు నెలలన్నీ ప్రకృతితో అనుబంధంగా ఉంటాయి. హిందూ క్యాలెండర్ కూడా రుతువుల ఆధారంగా, నక్షత్రాల ఆధారంగా నిర్ణయించబడుతుంది.
అయితే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్లయిన స్త్రీలు తమ భాగస్వామిని వదిలి వెళ్లేందుకు తెగ బాధపడిపోతారు. మరోవైపు ఈ సమయంలో శుభకార్యాలను కూడా వాయిదా వేసుకుంటారు. ఈ ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ మాసంలో నదీ, సముద్ర స్నానం చేయడం.. దానం చేయడం.. జపం, పారాయాణాలు వంటివి చేయడం వల్ల ఎన్నో ఫలితాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు.
అలాగే ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పును దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయానం కూడా ప్రారంభమవుతుంది. కర్కాటకంలోని సూర్యుడు ప్రవేశించిన కాలంలోనే ఇది ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలోకి ప్రవేశించే వరకు దక్షిణ యానం అంటారు. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. ఇది మన పూర్వీకులైన తండ్రులకు చాలా ఇష్టమైన సమయం అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ మాసంలో ఇంకా ఏయే ప్రత్యేకతలున్నాయో ఇప్పడు తెలుసుకుందాం...
జ్యేష్ఠ పూర్ణిమను రైతుల పండుగ ఎందుకంటారో తెలుసా...
గురు పౌర్ణమి
ఈ ఆషాఢ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పౌర్ణమి కూడా వస్తుంది. దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అలాగే ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కూడా జరుగుతుంది.
బోనాల ఉత్సవాలు..
ఈ ఆషాఢ మాసంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయ పండుగ అయిన బోనాల ఉత్సవాలను భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.
శూన్య మాసం..
ఈ ఆషాఢ మాసాన్ని ‘శూన్య మాసం'గా భావిస్తారు. అందుకే ఈ నెలను అనారోగ్య మాసం అని కూడా అంటారు. అందుకే వాటి నుండి తమను కాపాడమని భక్తులందరూ అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్లు, వేపాకులు ఈ బోనం కలిపి అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల తాము అనారోగ్యం నుండి బయటపడతామని వారి నమ్మకం.
విష్ణువు నిద్రలోకి..
పురాణాల ప్రకారం, ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ సమయంలో పెళ్లిళ్లు చేసినా.. ఇంకా ఏదైనా శుభకార్యాలు చేసినా ఆ భగవంతుని ఆశీర్వాదాలు అందవనే నమ్మకంతో పూర్వీకులు శుభకార్యాలను ఈ మాసంలో నిషేధించారట.
భాను సప్తమి..
ఈ ఆషాఢంలోని సప్తమిని భాను సప్తమి అని అంటారు. సూర్యుడు ఉత్తరం నుండి దక్షిణం దిశకు పయనిస్తూ మూడు నెలల తర్వాత మధ్యలో చేరుకుంటారు. ఆ రోజున పగలు, రాత్రి అనే తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి.
ఛాతుర్మస వ్రతం..
ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని మరియు శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజునే చాతుర్మాస వ్రతం కూడా ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని కూడా అంటారు.
కుమారస్వామికి ప్రత్యేక పూజలు..
ఈ మాసంలో ఆషాఢ శుద్ధ పంచమిని స్కంధ పంచమిగా చెబుతారు పండితులు. అలాగే ఆషాఢ షష్టిని కుమార షష్టిగా చెబుతారు. ఈ పవిత్రమైన రోజున సుబ్రహ్మాణ్య స్వామి(కుమార స్వామి)ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈరోజున నీటిని మాత్రమే తీసుకుని, కఠినమైన ఉపవాసం ఉండి, తర్వాతి రోజు ఆలయానికి వెళ్లి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి
ఆయురారోగ్యాలు దక్కుతాయని పురాణాల్లో చెప్పబడింది.
గోరింటాకు..
ఆషాఢ మాసం వచ్చిందంటే.. చాలా మందికి గుర్తొచ్చేది గోరింటాకు. ఈ మాసం వచ్చేలోపు వర్షరుతువు ప్రభావం వల్ల వాతావరణం మొత్తం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఈ మార్పుల వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకు వల్ల బాడీలో వేడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లే లేత గోరింటాకు పెట్టుకోవడం వల్ల బయటి వాతావరణానిక అనుగుణంగా అది మన బాడీని కూల్ చేస్తుందట.