Just In
Mahalaya Amavasya 2021:మహాలయ అమావాస్య ఎప్పుడు? ఈరోజున పితృ దేవతలకు శ్రాద్ధం పెట్టే విధానాలివే...
మహాలయ అమావాస్య 2021 తేదీ, సమయం, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసం చివర్లో వచ్చే అమావాస్య రోజును మహాలయ అమావాస్య అంటారు. ఇది ఈనెల 6వ తేదీన వచ్చింది.
ఈ కాలంలో తమ పూర్వీకులు లేదా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు తమతోనే ఉంటారని చాలా మంది నమ్ముతారు. అందుకే వారికి నచ్చిన ఆహారాన్ని సమర్పిస్తుంటారు. అలాగే మహాలయ అమావాస్య సమయంలో దేవాలయాలకు వెళ్లి పితృ దోషాలకు సంబంధించిన పూజను జరిపిస్తారు.
అనంతరం దాన ధర్మాలు చేయాలి. అమావాస్య సందర్భంగా మరణించిన వారికి తిథిని ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ సందర్భంగా ఈ మహాలయ అమావాస్య అక్టోబర్ మాసంలో ఎప్పుడొచ్చింది? పూజా విధానం మరియు దీని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
Mahalaya Amavasya 2021: పితృ పక్షాల సమయంలో చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసుకోండి..
అక్టోబర్ 6న..
2021 సంవత్సరంలో అక్టోబర్ 6వ తేదీన అంటే బుధవారం నాడు మహాలయ అమావాస్య వచ్చింది. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా చాలా మంది హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో తమ పూర్వీకులకు మరియు పిత్రు దేవతలకు నిష్టగా పూజలు చేస్తారు. వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు, వస్తువులను, దుస్తులను, పువ్వులను సమర్పిస్తారు.
సూర్యోదయానికి ముందు..
మహాలయ అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి. మీ ఇంటిని శుభ్రం చేసుకుని.. గుమ్మానికి తోరణాలు కట్టాలి. పూజ గదిని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకుని అనంతరం పూజకు సిద్ధమవ్వాలి. అనంతరం నైవేద్యానికి సంబంధించిన ఆహార పదార్థాలు, పువ్వులను, దుస్తులను సిద్ధం చేసుకోవాలి. వాటిని పితృ దేవతలకు సమర్పించేందుకు వెండి పాత్రలను ఉపయోగించడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీతో వెండి పాత్రలు లేకపోతే మీరు అరటి ఆకులో కూడా నైవేద్యాన్ని సమర్పించొచ్చు.
మధ్యాహ్నంలోపు..
మహాలయ అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటలలోపు పితృ దేవతలకు పూజలు, శ్రాద్ధకర్మలను పూర్తి చేయాలి. ముఖ్యంగా పుణ్యతీర్థాల సమీపంలో పితృ దేవతలకు శ్రాద్ధకర్మలు జరిపిస్తే, పూర్వీకులు సంతోషించి, తమకు సుఖశాంతులను ప్రసాదిస్తారని నమ్మకం. అందుకే ఈరోజున వారికి ఇష్టమైన ఆహారాన్ని, వస్త్రాలను సమర్పించి వాటిని బ్రాహ్మాణులకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు కచ్చితంగా పుణ్యఫలం దక్కుతుంది.
నైవేద్య పదార్థాలు..
పితృ దేవతలకు సమర్పించే నైవేద్యాల్లో పాయసం, అన్నం, పప్పు వంటి పదార్థాలను మహాలయ అమావాస్య రోజున సమర్పించొచ్చు. అలాగే పసుపు గుమ్మడికాయను నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇలాంటి వాటిని పితృ దేవతలకు సమర్పించడానికి మహాలయ అమావాస్య అనువైన రోజున ఈరోజున మరణించిన వారికి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తే.. వారి ఆత్మకు శాంతి కలిగి.. మనకు మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే తమ కుటుంబానికి వారి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.
సంతాప దినాలు..
మహాలయ అమావాస్య సమయంలోని పక్షం రోజుల్లో మగవారు కటింగ్, షేవింగ్ వంటివి చేసుకోరు. ఎందుకంటే ఈ దినాలను సంతాప దినాలుగా భావిస్తారు. ముఖ్యంగా పితృ పక్షం ముగిసే వరకు ఎలాంటి శుభకార్యాలు కూడా చేపట్టరు. ఏవైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ, వాటిని వాయిదా వేస్తారు. కొత్త పనులను కూడా మొదలుపెట్టరు. కొత్త బట్టలు, కొత్త వస్తువులు, బంగారం, ఏ ఇతర విలువైన వస్తువులను కొనుగోలు చేయరు. కొత్త ఇల్లు, వాహనాలు, కూడా కొనుగోలు చేయరు.
పితృ దోషాలు..
గత జన్మలో ఎవరైనా పెద్దవారికి కానీ, తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే అలాంటి వ్యక్తికి అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే అందుకు కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమని కూడా నమ్ముతారు. వారు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తర్వాత తరాల వారు కష్టాలపాలవ్వడం, పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది.
- 2021 అక్టోబర్ నెలలో ఏ తేదీన మహాలయ అమావాస్య వచ్చింది?
హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసం చివర్లో వచ్చే అమావాస్య రోజును మహాలయ అమావాస్య అంటారు. ఇది ఈనెల 6వ తేదీన వచ్చింది.