Just In
Rathyatra: పురుషోత్తమ పట్నం పూరి పుణ్యక్షేత్రంగా ఎలా మారిందో తెలుసా...
పూరి జగన్నాథుని ఆలయంలోని పురుషోత్తం దేవా పద్మావతి గజపతి కళింగుల కథ గురించి తెలుసుకుందామా.
ఈ ప్రపంచంలో అనేక హిందూ దేవాలయాలున్నాయి. అయితే వాటిలో ప్రసిద్ధ చెందిన ఆలయాలు కొన్ని మాత్రమే. అందులోనూ మన భారతదేశంలోని ఆలయాలు పురాణాల కాలం నుండి నేటి వరకు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి.
అలాంటి దేవాలయాల్లో పూరీ జగన్నాథుని ఆలయం ఒకటి. పూర్వకాలంలో ఈ నగరాన్ని పురుషోత్తముని పట్నం అని పిలిచేవారు. శ్రీమహా విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై ఇక్కడ ప్రత్యేక పూజలందుకుంటున్నాడని పండితులు చెబుతుంటారు. ఈ సందర్భంగా పురుషోత్తముని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
జగన్నాథుని ఆలయంలో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలివే...!
ఆలయాన్ని ఎవరు కట్టించారంటే..
హిందువులు అతి పవిత్రంగా భావించే ‘ఛార్ దాం' పుణ్యక్షేత్రాలలో పూరి కూడా ఒకటి. ఈ ఆలయాన్ని 1078లో కళింగ రాజ్య పరిపాలకుడైన అనంత వర్మ చోడగంగా దేవ ప్రారంభించగా.. ఆయన మనవడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తి చేసినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతకంటే ముందు ఈ దేవాలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతుంటారు.
గిరిజనుల దేవునిగా..
పూరి పుణ్యక్షేత్రంలోని జగన్నాథుని గిరిజనుల దేవుడని, నీలమాధవుడనే పేరుతో పూజలందుకునేవారు. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథున్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టేందుకు విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు.
గుడికి వెళ్లే దారిలో..
విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాదేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకి తీసుకెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడవునా ఆవాలు జారవిడుస్తాడు.
Bonalu Festival:తొలి బోనం గోల్కొండలో.. మరి రెండో బోనం ఎక్కడంటే...
కొన్నాళ్ల తర్వాత..
కొన్నాళ్లకు అవి మొలకెత్తి ఆ దారి స్పష్టంగా తెలిసిపోతుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు ఆ విషయాన్ని చేరవేరుస్తాడు. అదే సమయంలో రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్న నిరాశతో వెనుదిరుగుతాడు. అప్పుడే నిరాహార దీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టిస్తాడు.
కలలో కనిపించి..
ఒక రోజు అక్కడే రాజు నిద్రిస్తుండగా.. జగన్నాథుడు కలలో కనిపించి సాగర తీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి. కానీ విగ్రహ నిర్మాణానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న తరుణంలో దేవ శిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో అక్కడికొస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవ్వరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలిగించకూడదని షరత్తులు విధిస్తాడు.
పని పూర్తికాకుండానే..
అయితే రోజులు గడుస్తున్నా ఆ గదిలోంచి ఎలాంటి శబ్దం రాదు. అదే సమయంలో రాణి గుండిచాదేవి తొందరపెడుతుంది. దీంతో ఆ రాజు ఇచ్చిన గడువు పూర్తి కాకముందు ఆ గది తలుపులు తెరిపిస్తాడు.
విగ్రహం మాత్రమే..
అప్పుడు ఆ శిల్పి కనిపించడు. చేతులూ, కాళ్లూ లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో ఆ రాజు బ్రహ్మదేవుడిని వేడుకొంటాడు. చతర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట ఈ రూపంలోని విగ్రమాలు పూజలందుకుంటాయని చెబుతాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ట చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు.
కళ్లు పెద్దవిగా..
చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్టుగా కళ్లు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ దేవతా మూర్తులను ప్రతి ఎనిమిది, 12, 19 సంవత్సరాలకు మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్టిస్తూ ఉంటారు. దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు.
12 రోజుల ఉత్సవం..
ఇక ఈ ఆలయంలో నిర్వహించే జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఊరేగింపు సమయంలో మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. కానీ ఒడిశాలోని పూరిలో మాత్రం బలభద్ర, సుభద్ర సహా ఈ ఆలయంలో స్వయంగా కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకొచ్చి కనువిందు చేస్తారు. అంతేకాదు రథయాత్రకు ప్రతి సంవత్సరం కొత్త రథాలను సిద్ధం చేస్తారు. అందుకే జగన్నాథ రథయాత్రను ఎంతో అపురూపంగా భావిస్తారు.
ఘనంగా ఉత్సవాలు..
కరోనా కారణంగా ఈ ఏడాది కూడా జగన్నాథ రథయాత్రకు భక్తులకు అనుమతి ఇవ్వలేదు. అయితే రథయాత్రను మాత్రం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమైన ఈ రథయాత్ర మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది. ఆ తర్వాత సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేరనున్నాయి.
All Images Credited to FB