Just In
- 9 min ago శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- 1 hr ago Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- 3 hrs ago సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- 4 hrs ago ఈ మూడింటిలో మీ వేలు ఆకారం ఎలా ఉందో చెప్పండి... మీరు ఎలాంటి వారో మేం చెబుతాం
బలరాముడు హలాయుధంతో హస్తినను యమునలో పడేలా కొట్టాడు, అందుకే ఢిల్లీ దక్షిణ భాగం ఒక వైపుకి ఒరిగింది
బలరాముడు వారిని వారించి తానొక్కడే కొద్దిపాటి సైన్యంతో బయలుదేరాడు. సాంబుణ్ణి అప్పగించే ప్రసక్తే లేదు అని కౌరవులంటారు. దీంతో తన పరాక్రమం చూపిస్తూ తన హలాయుధంతో హస్తినను యమునలో పడేలా కొట్టాడు బలరాముడు.
విష్ణుమూర్తి దశావతారాల్లోని బలరాముడు, పూర్ణావతారమైన శ్రీకృష్ణుని వెన్నంటి ఉంటూ ఆ అవతార ప్రయోజనం సిద్ధించడానికి కృషిచేసాడు. బలరాముడు వసుదేవుని కుమారుడు, శ్రీకృష్ణుని సోదరునిగా అవతరించాడు. ఆదిశేషుడే బలరామునిగా అవతరించాడు అంటారు. విష్ణువు శ్వేత(తెల్లని) తేజస్సు ఆయనలో ప్రవేశించింది.
ఈయనకి మరో పేరు సంకర్షణుడు, అంటే ఒక గర్భం నుంచి మరొక గర్భమునకు లాగబడినవాడు అని అర్థం. దేవకీ, వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపివేస్తుంటే, దేవకి ఏడో గర్భాన జన్మించవలసిన బలరాముడు విష్ణుమూర్తి ఆదేశంతో, యోగమాయ సహాయంతో ఆమె గర్భం నుంచి వసుదేవుని మరొక భార్య అయిన రోహిణి గర్భంలోకి వెళ్తాడు.
వ్రేపల్లెలో నందుని సంరక్షణలో
ఆమె అప్పటికి వ్రేపల్లెలో నందుని సంరక్షణలో ఉంది. అలా శ్రీకృష్ణ జననం కంటే ముందుగానే, రామకృష్ణులిరువురి బాల్యచేష్టలకు రంగం సిద్ధమై పోయింది. ఇక శ్రీకృష్ణుడు వ్రేపల్లెలో అడుగు పెట్టింది మొదలు, కృష్ణుని వెన్నంటే ఉన్నాడు బలరాముడు. రాముడు అంటే ఆనందము కలిగించువాడు. బలవంతుడు , వ్రేపల్లె ప్రజలకి ఆనందము కలిగించువాడు బలరాముడు. బలరాముడు తెల్లనివాడు, కృష్ణయ్య నల్లనయ్య.
గదాయుద్ధంలో ఆయనకు సాటిఎవరూ లేరు
దుష్టశిక్షణలో ఏనాడూ శ్రీకృష్ణుని విడిచిలేడు బలరాముడు. బలరాముడు బలవంతులలోకెల్లా శ్రేష్టుడు. గదాయుద్ధంలో ఆయనకు సాటిఎవరూ లేరు. బలరాముణ్ణి ప్రకృతి తత్త్వంగా చెప్తారు. ఈయన ఆయుధం హలము, నాగలి. నాగలితో దున్నిన భూమి నుంచి వచ్చిన ఆహారంతో సమస్త జీవరాసులనూ ఈ ప్రకృతి సాకుతోందన్న దానికి సంకేతం ఆయన ఆయుధం. బలరాముడి భార్య రేవతి.
యుద్ధంలో ఎవరి పక్షమూ వహించకుండా
భీమదుర్యోధనులిద్దరూ ఆయనకి గదాయుద్ధంలో శిష్యులు. వాస్తవానికి భీముడికన్నా దుర్యోధనుడికే గదాయుద్ధంలో కాస్త ప్రావీణ్యం ఎక్కువ. భారత యుద్ధంలో తనకి కౌరవపాండవులిద్దరూ సమానమే కాబట్టి తటస్థంగా ఉంటాడు. యుద్ధంలో ఎవరి పక్షమూ వహించక తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. కొన్ని విషయాల్లో శ్రీకృష్ణునితో ఏకీభవించకపోయినప్పటికీ, ఆయనను అతిక్రమించి మాత్రం ప్రవర్తించలేదు. ఇక్కడే బలరామునిలో ప్రకృతి తత్త్వం కనిపిస్తుంది.
కృష్ణుడి తర్కానికి లొంగాడు
ప్రకృతి కూడా భగవానుని కంటే వేరుగా కనిపించినప్పటికీ విరుద్ధంగా ప్రవర్తించదు. ఆయన ఆదేశాలకు లోబడే పనిచేస్తుంది. ఈ అభిప్రాయ భేదమనేది భారతంలో కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. అర్జునుడు సుభద్రని చేపట్టే విషయంలో కూడా అభిప్రాయభేదం కలిగినప్పటికీ, కృష్ణుడి తర్కానికి లొంగాడు.
దుర్యోధనుడి తొడ విరగ్గొట్టడం ధర్మం కాదని వాదిస్తాడు
అజ్ఞాతవాసం పూర్తి అయిన తరువాత చర్చలలో శ్రీకృష్ణుడు కౌరవులు పాండవులను మోసగించారని అంటే, ధర్మ రాజు బలహీనత కూడా ఉంది కాబట్టి, ఇద్దరూ రాజ్యానికి సమాన వారసులే కాబట్టి, ఇద్దరికీ ఆమోదయోగ్యంగా రాజ్యవిభజన జరగాలనే అభిప్రాయాన్ని చెప్పాడు. అలాగే భీముడు భారత యుద్ధం చివరిలో దుర్యోధనుడి తొడ విరగ్గొట్టడం ధర్మం కాదని వాదిస్తాడు.
బలరాముడు శ్రీకృష్ణునితో విభేధించినట్లు కనబడినప్పటికీ
అప్పుడు కృష్ణుడు కలుగజేసుకుని, దుర్యోధనునికి శాపం ఉన్న సంగతీ, భీముడి ప్రతిజ్ఞ సంగతీ గుర్తుచేసి, ప్రతిజ్ఞా పాలనం క్షత్రియ ధర్మం కాబట్టి, అది అలా జరగడం ధర్మమేనన్నాడు. దానికి బలరాముడు మారుమాట్లడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బలరాముడు శ్రీకృష్ణునితో విభేధించినట్లు కనబడినప్పటికీ అసలు ధర్మసూక్ష్మం ఏమిటో మనకు తెలియబరుస్తాడే తప్ప నిజానికి అది విభేదం కాదు.
జాంబవతి కుమారుడైన సాంబుడు
బలరాముడి సాహసం, పరాక్రమం తెలియచెప్పే సంఘటన.. హస్తినను యమునలో కలపడానికి ప్రయత్నించడం. జాంబవతి కుమారుడైన సాంబుడు దుర్యోధనుడి కుమార్తెయైన లక్ష్మణను స్వయంవరం నుంచి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తుండగా, కౌరవ సైన్యం సాంబుని బంధించారు. ఈ విషయం తెలిసిన యాదవులు, దుర్యోధనుని సైన్యం మీదకి యుద్ధానికి బయలుదేరారు.
హస్తినను యమునలో పడేలా కొట్టాడు బలరాముడు
కానీ బలరాముడు వారిని వారించి తానొక్కడే కొద్దిపాటి సైన్యంతో బయలుదేరాడు. సాంబుణ్ణి అప్పగించే ప్రసక్తే లేదు అని కౌరవులంటారు. దీంతో తన పరాక్రమం చూపిస్తూ తన హలాయుధంతో హస్తినను యమునలో పడేలా కొట్టాడు బలరాముడు. ఆ దెబ్బకి హస్తినలో కొంతభాగం యమునలో పడింది. ఇప్పటికీ హస్తినలో (ఢిల్లీ) లోని దక్షిణ భాగం ఒక వైపుకి ఒరిగిందంటారు. భారతంలో జరిగే కురుక్షేత్ర యుద్ధం సమయంలో బలరాముడు తటస్థ వైఖరి అవలంబించి సరస్వతీ నదీ తీరాన ఉన్న తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు.