కడుపు నిండుతోంది.. కానీ పోషకాలేవి? భారతీయుల ఆహారపు అలవాట్లపై ICMR షాకింగ్ నిజాలు!

వేడి వేడి అన్నం, మెత్తటి రోటీలు, చపాతీలు..ఇవి లేకుండా మన భారతీయ భోజనం పూర్తి కాదంటే అతిశయోక్తి లేదు. తరతరాలుగా మన దైనందిన జీవితంలో ఇవి ఒక అంతర్భాగం. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో పెద్దలు కడుపు నిండా తినాలి అని చెబుతూ వస్తుంటారు. కడుపు నిండితేనే మంచి భోజనం చేసినట్లు మనందరి అభిప్రాయం. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మొదలుకొని రాత్రి డిన్నర్ వరకు మన ప్లేట్ నిండా ధాన్యాలే (కార్బోహైడ్రేట్లు) దర్శనమిస్తాయి. కానీ కడుపు నిండినంత మాత్రాన మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతున్నాయా? అంటే లేదనే చెబుతోంది తాజా ప్రభుత్వ రిపోర్ట్.

Full Stomach Empty Nutrition What the Latest ICMR Report Reveals About the Indian Diet

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మార్గదర్శకాలు, 2022-23 గృహ వినియోగ సర్వే ఆధారంగా వెలువడిన ఒక అధ్యయనం మన ఆహారపు అలవాట్లలోని డొల్లతను బయటపెట్టింది. మన ప్లేట్‌ లో ధాన్యాలు గుట్టలుగా ఉంటుంటే.. శరీరానికి అత్యంత అవసరమైన ప్రొటీన్లు, పప్పులు, ఆకుకూరలు, పండ్లు, పాలు మాత్రం కనుమరుగవుతున్నాయని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.

మితిమీరుతున్న ధాన్యాల వినియోగం
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో త్వరగా కడుపు నింపే భోజనానికే మనం ఓటు వేస్తున్నాం. ఆఫీసుకు వెళ్లే హడావిడిలో ఉన్నా, పిల్లలకు క్యారేజీ కట్టాలన్నా అన్నం, రోటీలనే ఈజీ ఆప్షన్స్ గా భావిస్తున్నాం. నివేదిక ప్రకారం, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తికి నెలకు సుమారు 7.5 కిలోల ధాన్యం సరిపోతుంది. కానీ అనేక రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఏకంగా 10 నుంచి 11 కిలోలకు చేరుకుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, బీహార్, త్రిపుర వంటి రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బియ్యం, గోధుమలను మోతాదుకు మించి లాగించేస్తున్నారు.

ప్రాణాల మీదకు తెస్తున్న జంక్ ఫుడ్
ఇంట్లో అధికంగా కార్బోహైడ్రేట్లు తినడమే కాకుండా, బయట ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినే సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. రెస్టారెంట్లలో తినడం ఒక ఫ్యాషన్‌ గా మారింది. ఫలితంగా శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందకపోగా.. చిన్న వయసులోనే ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి భయంకరమైన జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు.

Full Stomach Empty Nutrition What the Latest ICMR Report Reveals About the Indian Diet

ప్లేట్‌ లోంచి మాయమవుతున్న కూరగాయలు, ప్రొటీన
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మన కంచంలో కూరగాయలు, ప్రొటీన్ శాతం దారుణంగా పడిపోయింది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం ప్రతి వ్యక్తి నెలకు 12 కిలోల కూరగాయలు తినాలి. కానీ దేశంలోనే అత్యధికంగా కూరగాయలు తినే ఛత్తీస్‌గఢ్‌లో సైతం గ్రామాల్లో 6.7 కిలోలు, పట్టణాల్లో 8.3 కిలోలు మాత్రమే తింటున్నారు.

ఇక ప్రొటీన్‌ కు ప్రధాన వనరు అయిన పప్పు ధాన్యాల పరిస్థితి మరీ దారుణం. ఐసీఎంఆర్ సూచనల ప్రకారం మాంసాహారులు నెలకు 1.7 కిలోలు, శాకాహారులు 2.6 కిలోల పప్పులు తినాలి. కానీ, దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గణాంకాలను పరిశీలిస్తే, సగటున ఒక వ్యక్తి కిలో కంటే తక్కువ పప్పులనే వినియోగిస్తున్నారు. తగినంత ప్రొటీన్ లభించకపోతే కండరాల క్షీణత, తీవ్రమైన అలసట, నీరసం వంటి సమస్యలు తప్పవు. ముఖ్యంగా శాకాహారులకు ఇది పెద్ద ప్రమాద ఘంటిక.

సమతుల్యతే అసలైన ఆరోగ్యం
కేవలం ఆకలి తీర్చుకోవడం, కడుపు నింపుకోవడం మాత్రమే ఆరోగ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తినే ప్రతి ముద్దలో సమతుల్యత ఉండాలి. మీ ఆహారంలో అన్నం, రోటీలను కొద్దిగా తగ్గించి... ఆ స్థానంలో పప్పులు, ఆకుకూరలు, కూరగాయల శాతాన్ని పెంచండి. జంక్ ఫుడ్‌ ను పూర్తిగా పక్కనపెట్టి, స్థానికంగా ఆయా సీజన్లలో దొరికే పండ్లను, పాలను ఆహారంలో భాగం చేసుకోండి. రోజూ భోజనానికి ముందు కాస్త సలాడ్ తినడం అలవాటు చేసుకోండి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, May 27, 2026, 14:52 [IST]
Desktop Bottom Promotion