రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు!

పశ్చిమ బెంగాల్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కళ్లు బైర్లు కమ్మే సంచలన నిజాలు వెలుగుచూశాయి. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. కొత్త అసెంబ్లీలో నేరచరితులు, కోటీశ్వరుల సంఖ్య మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగింది.

Shocking ADR Report Bengal Assembly Packed with Criminals and Crorepatis

బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 292 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను ఏడీఆర్ పరిశీలించగా.. వారిలో ఏకంగా 65 శాతం (190 మంది) తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని స్వయంగా ప్రకటించారు. 2021లో ఈ సంఖ్య 142గా ఉండేది. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. వీరిలో 170 మంది (58 శాతం) అత్యంత తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా 14 మందిపై హత్య కేసులు, 54 మందిపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. మరో 63 మందిపై మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు ఉండగా, ఇద్దరు ఎమ్మెల్యేలపై అత్యాచార ఆరోపణలు ఉన్నాయి.

నేరాల్లో ఆ పార్టీదే అగ్రస్థానం
బీజేపీ పార్టీ నుంచి గెలిచిన 206 మంది ఎమ్మెల్యేల్లో 152 మందికి నేరచరిత్ర ఉంది. ఆ తర్వాతి స్థానంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 81 మంది ఎమ్మెల్యేల్లో 34 మంది ఈ జాబితాలో ఉన్నారు. ఇక సీపీఎం, ఇతర చిన్న పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థులందరిపైనా కేసులున్నాయి. ఇందుకు పూర్తి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఎలాంటి మచ్చా లేకుండా క్లీన్ రికార్డుతో ఉండటం విశేషం.

Shocking ADR Report Bengal Assembly Packed with Criminals and Crorepatis

పెరుగుతున్న ధన బలం
కొత్త అసెంబ్లీలో కోటీశ్వరుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి తాజాగా ఎన్నికైన 292 మందిలో 178 మంది కోటీశ్వరులే. ఎమ్మెల్యేలందరి ఉమ్మడి ఆస్తి ఏకంగా రూ.1091 కోట్లుగా ఉంది. గత ఎన్నికల్లో రూ.2.53 కోట్లుగా ఉన్న సగటు ఆస్తి.. ఇప్పుడు రూ.3.73 కోట్లకు ఎగబాకింది.

పార్టీల వారీగా చూస్తే టీఎంసీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ.5.36 కోట్లు కాగా, బీజేపీ ఎమ్మెల్యేల సగటు రూ.2.97 కోట్లుగా ఉంది. అయితే ఆ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తలా రూ.17.92 కోట్లతో సభలోనే అత్యంత ధనికులుగా నిలిచారు.

చదువులు, వయసు, మహిళల ప్రాతినిధ్యం
చదువుల విషయానికొస్తే 63 శాతం మంది డిగ్రీ లేదా అంతకంటే పై చదువులు చదివారు. ఒక ఎమ్మెల్యే మాత్రం తనకు అక్షరం ముక్క రాదని ప్రకటించుకున్నారు. వయసు చూస్తే.. చట్టసభలో యువతకు దక్కిన ప్రాధాన్యం కేవలం 16 శాతం (25-40 ఏళ్లు). ఎక్కువ మంది 41 నుంచి 60 ఏళ్ల మధ్య వారే.

ముగ్గురు ఎమ్మెల్యేలు 80 ఏళ్లు పైబడిన వారున్నారు. ఇక మహిళా సాధికారత కేవలం మాటలకే పరిమితమైంది. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 37కి (13%) పడిపోయింది. గత ఎన్నికల్లో ఇది 14 శాతంగా ఉండేది.

Story first published: Wednesday, May 6, 2026, 22:14 [IST]
Desktop Bottom Promotion