సమ్మక్క-సారలమ్మ ఎవరు? వనదేవతలు అని ఎందుకు పిలుస్తారు? మేడారం మహా జాతర చరిత్ర, విశిష్టత ఇదే!

మేడారం..జీవితంలో ఒక్కసారి అయినా సందర్శించాలి, అది కూడా జాతర జరిగే సమయంలో అని చాలామంది కోరుకుంటారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తుంపుపొందింది మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర.

గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ జాతరలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే తల్లులుగా సమ్మక్క, సారలమ్మలను ఆరాధిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని డ్వాయి మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతమైన మేడారంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 4 రోజుల పాటు జరిగి ఈ మహా జాతరను తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు.

Medaram Jatara 2026 Who were Sammakka and Saralamma Everything You Need to Know About Forest Goddess

ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు మేడారంలో సమ్మక ,సారలమ్మ జాతర జరుగుతుంది. జాతరకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర ప్రారంభానికి ముందే దేశ,విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారం వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

న్యూజిలాండ్ దేశానికి చెందిన మావోరి గిరిజన ప్రతినిధులు కూడా మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకొని తమ విశిష్ఠ సంప్రదాయాలతో వనదేవతలకు నీరాజనాలు పలికాలరు. మేడారంలో బెల్లంని బంగారంగా భావిస్తారు. అసలు ఈ జాతర వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? సమ్మక్క,సారలమ్మలను వనదేవతలు అని ఎందుకు అంటారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఇక్కడ చూడండి.

Medaram Jatara 2026 Who were Sammakka and Saralamma Everything You Need to Know About Forest Goddess

సమ్మక్క - సారలమ్మ ఎవరు?

మేడారం జాతర వెనుక ఒక వీరోచితమైన చరిత్ర ఉంది. ఇది సుమారు 13వ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో జరిగింది. స్థానిక గిరిజనుల కథనం ప్రకారం.. మేడారం ప్రాంతాన్ని పాలించే గిరిజన రాజు మేడరాజు.

ఒకసారి వేటకు వెళ్లిన మేడరాజుకు అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న ఒక చిన్న పాప కనిపించింది. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. సమ్మక్కకు దైవశక్తి ఉందని, ఆమె అడుగుపెట్టిన చోట సిరులు కురుస్తాయని గిరిజనులు నమ్మేవారు.

సమ్మక్క యుక్తవయసు వచ్చాక ఆమెను మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం జరిపించాడు. వీరికి సారలమ్మ (సారక్క), నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు జన్మించారు. వీరు ప్రజలతో మమేకమై సుఖసంతోషాలతో జీవిస్తున్న కాలం అది.

జాతర వెనుక ఉన్న సంఘర్షణ

ఆ సమయంలో కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్నాడు. మేడారం ప్రాంతంలో వరుసగా కరువు కాటకాలు వచ్చాయి. వర్షాలు లేక పంటలు పండక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాకతీయ రాజులకు కట్టాల్సిన పన్ను (కప్పం) చెల్లించలేకపోయారు. పన్ను కట్టని కారణంగా ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధం ప్రకటించాడు.

గిరిజన సంప్రదాయాలను, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం పగిడిద్ద రాజు, సమ్మక్క, వారి పిల్లలు కాకతీయ సైన్యంపై వీరోచితంగా పోరాడారు. ఈ యుద్ధంలో పగిడిద్ద రాజు, కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు. కాకతీయ సైన్యం దాటికి తట్టుకోలేక, పరాభవాన్ని భరించలేక సమ్మక్క కుమారుడు జంపన్న అక్కడి సంపంగి వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగు అని పిలుస్తున్నారు.

Medaram Jatara 2026 Who were Sammakka and Saralamma Everything You Need to Know About Forest Goddess

వనదేవతలుగా అవతరణ
భర్త, బిడ్డలు చనిపోయినప్పటికీ సమ్మక్క బెదరలేదు. యుద్ధభూమిలో కాళికలా మారి కాకతీయ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు శత్రువుల దాడిలో గాయపడిన సమ్మక్క, తన రక్తపు ధారలతోనే చిలకలగుట్ట వైపు వెళుతూ..నేను గిరిజనుల రక్షణ కోసం అడవిలోనే ఉంటాను అని చెప్పి మాయమైందని ప్రతీతి.

గిరిజనులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లగా, చిలకలగుట్టపై ఒక పుట్ట దగ్గర నెమలి పింఛం, పసుపు, కుంకుమలు ఉన్న ఒక భరిణె మాత్రమే కనిపించింది. సమ్మక్క ఆత్మ ఆ భరిణె రూపంలో, ఆ చెట్టు రూపంలోనే ఉందని గిరిజనులు విశ్వసించారు. అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఆ తల్లులను స్మరించుకుంటూ జాతర జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

Medaram Jatara 2026 Who were Sammakka and Saralamma Everything You Need to Know About Forest Goddess

వనదేవతలు అని ఎందుకు అంటారు?
సమ్మక్క, సారలమ్మలు అడవి బిడ్డలు. వారు అడవిని, ప్రకృతిని, గిరిజనుల హక్కులను కాపాడటం కోసం ప్రాణాలర్పించారు. వారు చనిపోలేదు, అడవిలో (వనంలో) కలిసిపోయి దేవతలుగా మారారని భక్తుల నమ్మకం.

ఈ జాతరలో విగ్రహారాధన ఉండదు. కేవలం అడవిలో లభించే వెదురు కర్రలను, పసుపు కుంకుమలను గద్దెలపై ప్రతిష్టించి పూజిస్తారు. ప్రకృతితో మమేకమైన దైవాలు కాబట్టి వీరిని వనదేవతలు అని పిలుస్తారు.

జాతర ఎలా జరుగుతుంది?
ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి సమయంలో నాలుగు రోజుల పాటు జరుగుతుంది.

1వ రోజు.. కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెల పైకి తీసుకువస్తారు.

2వ రోజు: చిలకలగుట్ట నుండి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గిరిజన పూజారులు అత్యంత భక్తిశ్రద్ధలతో గద్దెల పైకి తీసుకువస్తారు. ఈ ఘట్టం జాతరలో అత్యంత ప్రధానమైనది. అప్పుడు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు.

3వ రోజు: భక్తులు తల్లుల దర్శనం చేసుకుంటారు. భక్తులు తమ బరువుకు సరితూగే బెల్లాన్ని (దీనిని ఇక్కడ బంగారం అంటారు) తులాలాభారంగా తూచి అమ్మవార్లకు సమర్పిస్తారు.

4వ రోజు: అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.

Desktop Bottom Promotion