Just In
Nalambalam yatra: నాలాంబల యాత్ర: విశిష్టత, చరిత్ర, పురాణం
శ్రీరాముల వారితో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రఘ్నలు నలుగురు. వీరిని ఒకే రోజులో దర్శించుకోవడాన్ని నాలాంబల యాత్రగా పిలుస్తారు.
Nalambalam yatra: హిందువులకు శ్రీరాముడు ఎంతో ప్రీతిపాత్రమైన దేవుడు. ఆయన నామం దివ్యమైనది. ఆయనను స్మరించుకుంటూ జీవితాంతం గడిపే వారు చాలా మంది. ఆయన నడియాడిన ప్రాంతాలను దర్శించుకుని తరిస్తాం. పితృ వ్యాఖ్య పరిపాలకుడు అని రాముడిని తలుస్తారు. తండ్రి మాటను కాదనని శ్రీరాములవారు భార్య సీతాదేవి, సోదరడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యను వదిలి అరణ్యవాసం చేశారు. ఆ రోజుల్లో అన్న పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్య పాలన చేస్తాడు భరతుడు. అతనికి సహాయకుడిగా ఉంటాడు శత్రఘ్నుడు.
ఏ దేవాలయంలోనైనా, ఫోటోల్లోనైనా లక్ష్మణ సమేత సీతారామచంద్రులు, హనుమంతుడు కనిపిస్తారు. కానీ, కేరళలో మాత్రం ఈ నలుగురు అన్నదమ్ముల ఆలయాలను మనం చూడవచ్చు. ఈ దేవాలయాలను దర్శించుకోవడాన్ని నాలాంబల యాత్రగా పిలుస్తారు.
నాలాంబలం అంటే ఏమిటి?
మళయాళ భాషలో అంబలం అంటే దేవాలయం అని అర్థం. అలాగే నాల్ అంటే నాలుగు. శ్రీరాముల వారితో పాటు లక్ష్మణుడు, భరతుడు, శత్రఘ్నలు నలుగురు. వీరిని ఒకే రోజులో దర్శించుకోవడాన్ని నాలాంబల యాత్రగా పిలుస్తారు. కర్కాటక మాసం( జూన్ నుండి జులై ) ఒకే రోజులో ఈ యాత్రను పూర్తి చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు. ఈ యాత్ర రాముడి గుడి నుండి మొదలై భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల ఆలయాలను సందర్శించడంతో ముగుస్తుంది.
శ్రీరామ దర్శనంతో మొదలు:
1. శ్రీ రామ మందిరం:
నాలాంబల యాత్రలో మొదటిది రామ మందిరం. ఇది కేరళ త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్ పట్టణంలో ఉంది. ఇర్పా నది ఒడ్డున ఉన్న ఈ రామ మందిరంలో నాలుగు చేతుల మూల దేవతగా ఆరు అడుగుల ఎత్తైన శ్రీరామచంద్రుని విగ్రహం ఉంది.
2. భరత దేవాలయం:
నాలంబల యాత్రలో రెండవది భరత దేవాలయాన్ని సందర్శించాలి. భరతుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం త్రిస్సూర్ జిల్లాలోని ఇరింజలకుడలో ఉంది. దీనిని కూడలమాణిక్యం దేవాలయం అని కూడా అంటారు. ఇక్కడ తూర్పు ముఖంగా ఆరు అడుగుల భరతుని విగ్రహం మాత్రమే ఉంటుంది. ఇతర దేవతల విగ్రహాలు ఉండవు. ఈ ఆలయంలో భరతుడు భీకర రూపంలో కనిపిస్తాడు. ఇది ఈ యాత్రలో సందర్శించిన రెండవ ఆలయం. ఈ దేవాలయం త్రిప్రయార్ పట్టణానికి 20 కి.మీ దూరంలో ఉంది.
3. లక్ష్మణ దేవాలయం:
ఈ యాత్రలో మూడవ ఆలయంగా లక్ష్మణ దేవాలయాన్ని సందర్శించాలి. ఈ ఆలయం ఎర్నాకులం జిల్లాలోని తిరుముళికులంలో ఉంది. పూర్ణా నది సమీపంలో కొలువై ఉంది లక్ష్మణ్ పెరుమాళ్ ఆలయం. ఇక్కడే హరిత మహర్షి తపస్సు చేశారని పురాతన గ్రంథాలు పేర్కొంటున్నాయి. త్రిప్రయార్ లోని రాముడిలా, ఇక్కడ లక్ష్మణుడు ఆరు అడుగుల ఎత్తైన విగ్రహాంగా కనిపిస్తాడు. నాలుగు చేతులతో అలంకరించబడ్డాడు. ఈ ఆలయం ఇరింజలకుడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
4. శత్రుఘ్న దేవాలయం:
శత్రుఘ్న దేవాలయం ఈ తీర్థ యాత్రలో చివరి గమ్యస్థానం. దీనిని పాయమ్మాల్ శ్రీ శత్రుఘ్న దేవాలయం అంటారు. ఇది ఇరింజలకుడ నుండి కేవలం ఏడు కిలో మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ఈ ఆలయాన్ని లక్ష్మణ దేవాలయాన్ని సందర్శించిన తర్వాత తప్పక సందర్శించాలి. ఇది రాముని చివరి సోదరుడైన శతృఘ్నకు అంకితం చేయబడింది. ఈ దేవాలయంలో శత్రుఘ్ను విగ్రహం మిగతా వాటితో పోలిస్తే చిన్నగా ఉంటుంది. నలుగురు అన్నదమ్ముల్లో చివరి వాడిగా ఈ విగ్రహం సూచిస్తుందని అంటారు పండితులు.
చివరిగా త్రిస్సూర్ జిల్లాలోనే ఉన్న హనుమంతుడి దర్శనంతో యాత్రకు పరిపూర్ణత లభిస్తుందని అంటారు.
నాలాంబలం చరిత్ర:
పురాణాల ప్రకారం, రాముడు లంకకు వెళ్లే మార్గంలో ఈ ప్రదేశంలో (రామపురం) విశ్రాంతి తీసుకున్నాడు. అందమైన పర్వతాలు, అడవులు, పచ్చదనంతో కూడిన ఈ ప్రదేశానికి రాముడు చేరుకున్నప్పుడు, అది తన ధ్యానానికి అనువైన ప్రదేశంగా భావించాడని పురాణాలు చెబుతున్నాయి. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు తమ అగ్రజుడు అదృశ్యమవడం తట్టుకోలేక, వారు కూడా అయోధ్యను విడిచి పెట్టి, అతను దక్షిణాది వైపు వెళతాడని భావించి రాముడి మార్గంలో నడుస్తారు. రామాపురంలో రాముడిని చూసిన తర్వాత, వారు కూడా సమీపంలో స్థిరపడ్డారని స్థల పురాణం చెబుతోంది. తద్వారా రామాపురంలో ఒకదానికొకటి సమాన దూరంలో ఉంటాయి నాలుగు దేవాలయాలు.
శ్రీకృష్ణుడి పూజలు అందుకున్న విగ్రహమూర్తులు:
ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ నాలుగు అన్నదమ్ముల విగ్రహాలను పూజించాడని స్థల పురాణం చెబుతోంది. ద్వాపర యుగం చివరిలో ప్రళయం ఏర్పడింది. ద్వారకా నగరం సముద్రంలో కలిసి పోయింది. ఈ విగ్రహాలు సముద్రంలో కొట్టుకువచ్చి కేరళ తీరంలోని చీటువ ప్రాంతంలో తేలాయి. వక్కయిల్ కైమల్ అనే స్థానిక మంత్రికి కలలో విద్యవాణి వినిపించి వీటి గురించి చెప్పింది. అక్కడికి వెళ్లిన ఆయనకు విగ్రహాలు కనిపించాయని.. వాటిని ఆయన పలు ప్రదేశాల్లో ప్రతిష్టించి నిత్య కైంకర్యాలు నిర్వహించారని మరో స్థల పురాణం ఇక్కడి స్థానికులు చెబుతుంటారు.
నాలాంబలం ఎలా చేరుకోవాలి?
* త్రిస్సూర్ వరకు రైలు మార్గం ఉంది. అక్కడి నుండి ప్రైవేటు వాహనాల్లో దేవాలయాలకు వెళ్లవచ్చు.
* విమానంలో వెళ్లాలనుకునే వారికి కొచ్చిలో విమానాశ్రయం ఉంది. అక్కడ దిగి ట్సాక్సీల్లో లేదా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లవచ్చు.
* ఇక బస్సు మార్గం ద్వారా వెళ్లాలనుకునే వారికి రవాణా సౌకర్యం ప్రతి చోటు నుండి ఉంటుంది.