మహా శివరాత్రి అసలు కథ..సాక్షాత్తు శివుడే పార్వతీ దేవికి చెప్పిన రహస్యం!

హిందూ సాంప్రదాయంలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైన పండుగ. మాఘ మాసంలో కృష్ణ పక్ష చతుర్దశి నాడు వచ్చే ఈ పర్వదినాన భక్తులందరూ ఉపవాసం, జాగరణలతో శివుడిని ఆరాధిస్తారు. అయితే ఈ శివరాత్రి వ్రతం ఎందుకు చేయాలి? దీనివల్ల కలిగే ఫలితం ఏమిటి? అని సాక్షాత్తు పార్వతీ దేవి, పరమేశ్వరుడిని అడిగినప్పుడు శివుడు స్వయంగా ఒక వేటగాడి కథను ఉదహరిస్తూ ఈ రోజు గొప్పతనాన్ని వివరించాడు. అదే లుబ్ధకుడి కథ.

పార్వతీ దేవి సందేహం
ఒకానొక సమయంలో కైలాసంలో పార్వతీ దేవి, శివుడిని ఉద్దేశించి స్వామీ మీకు అత్యంత ప్రీతికరమైన వ్రతం ఏది? ఏ వ్రతం చేయడం వల్ల సామాన్య మానవులు కూడా సులభంగా మీ కృపకు పాత్రులవుతారు? అని అడిగింది.

Maha Shivratri Story Every Devotee Must Know Shiva Reveals His Favorite Vrat to Parvati

అప్పుడు పరమశివుడు నవ్వి దేవీ మాఘ మాసంలో బహుళ చతుర్దశి నాడు వచ్చే మహా శివరాత్రి నాకు అత్యంత ఇష్టమైన రోజు. ఆ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి, రాత్రంతా మేల్కొని నన్ను లింగ రూపంలో బిల్వ పత్రాలతో అర్చిస్తారో వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి, దానికి నిదర్శనంగా ఒక వేటగాడి కథను చెప్పాడు.

వేటగాడి కథ
పూర్వం ఒక అడవిలో లుబ్ధకుడు (కొన్ని పురాణాల్లో గుణనిధి లేదా సుస్వర అని కూడా అంటారు) అనే వేటగాడు ఉండేవాడు. అతను క్రూర మృగాలను వేటాడుతూ పాప భీతి లేకుండా జీవించేవాడు. ఒకరోజు అతను వేట కోసం అడవికి వెళ్ళాడు. రోజంతా తిరిగినా అతనికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. ఇంతలో చీకటి పడింది.

కీకారణ్యం కావడంతో క్రూర మృగాల భయం పట్టుకుంది. రాత్రి పూట మృగాల బారి నుండి తనను తాను రక్షించుకోవడానికి అతను దగ్గరలో ఉన్న ఒక మారేడు చెట్ట (బిల్వ వృక్షం) ఎక్కాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది, కానీ అది ఎండిన ఆకుల కింద కప్పబడి ఉండటంతో వేటగాడికి కనిపించలేదు.

తెలియక చేసిన శివార్చన
రాత్రి గడుస్తున్న కొద్దీ నిద్ర రాకుండా ఉండటానికి ఆ వేటగాడు మారేడు ఆకులను ఒక్కొక్కటిగా తెంపి కింద పడేయడం మొదలుపెట్టాడు. అలా అతను తెంపి పడేస్తున్న మారేడు దళాలు సరిగ్గా చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడుతున్నాయి. అదే సమయంలో ఆ రోజు మహా శివరాత్రి.

రోజంతా ఆహారం దొరకకపోవడంతో అతను పస్తు ఉన్నాడు (ఉపవాసం). క్రూర మృగాల భయంతో రాత్రంతా నిద్రపోలేదు (జాగరణ). కాలక్షేపం కోసం ఆకులు తుంచి కింద వేయడం వల్ల తెలియకుండానే శివలింగానికి బిల్వార్చన జరిగింది. అతని దగ్గర ఉన్న నీటి పాత్ర నుండి కొన్ని చుక్కలు,లేదా అతని భయం వల్ల వచ్చిన చెమట చుక్కలు లింగంపై పడి అభిషేకం కూడా జరిగింది. ఇలా వేటగాడు తనకు తెలియకుండానే మహా శివరాత్రి వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరించాడు.

Maha Shivratri Story Every Devotee Must Know Shiva Reveals His Favorite Vrat to Parvati

శివ సాన్నిధ్యం
కొంతకాలానికి ఆ వేటగాడు మరణించాడు. అతని పాపకర్మల చిట్టా పెద్దది కావడంతో యమధర్మరాజు యమదూతలను పంపించి అతని ప్రాణాలను నరకానికి తీసుకురమ్మని ఆదేశించాడు. యమదూతలు అతడిని తీసుకువెళ్తుండగా శివగణాలు అక్కడకు వచ్చి అడ్డుకున్నాయి.

ఇతను మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉండి, జాగరణ చేసి, పరమేశ్వరుడిని బిల్వ దళాలతో అర్చించాడు. కాబట్టి ఇతను కైలాసానికి రావలసిన వాడు అని శివగణాలు చెప్పాయి. ఒక కిరాతకుడు, ఏ మంత్రాలు తెలియని వాడు, కేవలం యాదృచ్ఛికంగా శివరాత్రి వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన అతనికి మోక్షం లభించింది.

ఏమీ తెలియని ఒక వేటగాడు యాదృచ్ఛికంగా శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ, బిల్వార్చన చేసినందుకే అతనికి మోక్షం లభించింది. ఇక భక్తిశ్రద్ధలతో, నియమనిష్టలతో ఎవరైతే ఈ మహా శివరాత్రి నాడు నన్ను పూజిస్తారో, వారి ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? వారు నా అనుగ్రహానికి తప్పక పాత్రులవుతారు అని శివుడు పార్వతీదేవితో అన్నాడు.

Story first published: Saturday, February 14, 2026, 15:14 [IST]
Desktop Bottom Promotion