వరల్డ్ వాటర్ డే(ప్రపంచ జలదినోత్సవం) ప్రత్యేకతేంటి?

ఉత్సవం అంటే - కేళి , పండుగ , సంబరం , జాతర ,వేడుక . ఉత్సవం అంటే గొప్పయజ్ఞమనీ, మిక్కిలి ఆనందాన్ని కలిగించేదని అర్థం ఉంది. జీవితంలో ఒక సంగీతం ఉండదు. ఒక నాట్యం ఉండదు. జీవితం ఉన్నంత వరకు అలా పనిచేస్తూనే ఉండిపోతారు. ఉత్సవమంటే ఏమిటో తెలియకుండానే జీవితం గడిచిపోతుంది. అలా కాకుండా గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది . ఇందంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ రోజు ప్రపంచ జలదినోత్సవం(వరల్డ్ వాటర్ డే).

ప్రతిసంవత్సరము మార్చి 22 వ తేదీన ప్రపంచ జల దినోత్సవము నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించినది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచన, " పర్యావరణం, ప్రగతి అనే అంశంపై 1992లో రియో డి జెనేరోలో జరిగిన ఐక్యరాజ్యసమితి మహాసభ '' (యు ఎన్ సి ఇ డి) లో రూపుదిద్దుకున్నది. ఇందులో భాగంగా, 2010 సంవత్సరాన్ని " ఆరోగ్యవంతమైన ప్రపంచంకోసం, పరిశుభ్రమైన నీరు " అనే, నిర్దిష్ట భావనతో పాటించడం జరుగుతుంది.

Why World Water Day Is Celebrated?

మనం నివసించే భూగోళంలో 70 శాతానికిపైగా నీరే. అయితే, ఇందులో శుభ్రమైన నీరు చాలా స్వల్ప భాగం మాత్రమే. మొత్తం భూగోళంలోని నీటిలో దాదాపు 2.7 శాతం మాత్రమే శుభ్రమైన నీరు కాగా, ఇందులోనూ 75.2 % ధృవప్రాంతాలలో మంచురూపంలో ఘనీభవించి వుంటే, మరో 22.6 % నీరు భూగర్భంలో వుంది. మిగతా నీరు సరస్సులు, నదులు, వాతావరణం, గాలిలోని తేమ, భూమిలోని చెమ్మ, చెట్టు చేమలలో వుంటుంది. ఇంతేకాదు, సరస్సులు, నదులు, భూగర్భ జలాలలో కూడా మానవ వినియోగానికి, ఇతర అవసరాలకు చక్కగా ఉపయోగపడగలిగిన నీరు, చాలా కొద్ది పరిమాణం మాత్రమే.

ప్రపంచం మొత్తంలో లభ్యమయ్యే, పరిశుభ్రమైన నీటిలో, 1 % కంటెకూడా తక్కువ పరిమాణంలో, ( లేదా, భూమిపై లభించే మొత్తంనీటిలో దాదాపు 0.007 % మాత్రమే) నీరు మానవ వినియోగానికి నేరుగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ , మనకు కనీసం 30-50 లీటర్ల పరిశుభ్రమైన, సురక్షితమైన నీరు అవసరం. కాని, ఇప్పటికీ, 88.4 కోట్ల మంది( 884 మిలియన్ల మంది) ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు.

ప్రపంచవ్యాప్తంగా, ప్రతిఏటా , 1,500 ఘన కిలోమీటర్ల పరిమాణంలో, వ్యర్ధమైన నీరు వస్తుంటుంది. వ్యర్ధ పదార్ధాలను, వ్యర్ధమైన నీటిని పునర్వినియోగ ప్రక్రియ ద్వారా, ఇంధనోత్పత్తికి, వ్యవసాయ అవసరాలకు వినియోగించవచ్చు. కాని, సాధారణంగా , అలా జరగడం లేదు. అభివృద్ధిచెందుతున్న దేశాలలో, తగిన నిబంధనలు, వనరులు లేనికారణంగా, 80 శాతం వ్యర్ధాలను పునర్వినియోగ ప్రక్రియకు మళ్ళించకుండానే పారవేస్తున్నారు. పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక ప్రగతికూడా, కొత్తరకాల కాలుష్యానికి మూలమవుతున్నాయి. ఇదే దామాషాలో, పరిశుభ్రమైన నీటి అవసరం పెరుగుతున్నది. ఈ కారణంగా, ఇటు వర్తమానంలోను, అటు భవిష్యత్తులోను మానవ ఆరోగ్యానికి , పర్యావరణ స్వచ్ఛతకు ముప్పు పొంచివుండగా ; తాగడానికి ఉపయోగపడే పరిశుభ్రమైన నీటికి, వ్యవసాయ అవసరాలకు కావలసిన నీటికి తీవ్రమైన కొరత ఏర్పడుతున్నది. అయినప్పటికి, నీటి కాలుష్యం ‘అత్యవసరంగా దృష్టిసారించవలసిన అంశం' అనే ప్రస్తావన, అరుదుగా కాని రావడంలేదు.

జలం... గాలి తరువాత జీవకోటికి అత్యవసరమైన ప్రకృతి వనరు. మానవాళి మనుగడలో జలానిదే ప్రధాన భూమిక. ఇతర గ్రహాలకు భిన్నంగా భూగోళంపై ప్రాణకోటి వృద్ధి చెందడానికి నీరే ప్రధాన కారణం. కానీ ప్రస్తుతం జలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోయాయి. వందలకొద్దీ లోతుకు వెళ్లినా కడివెడు నీరు దక్కని పరిస్థితి. కారణాలేమైనా క్షీణించిపోతున్న ప్రకృతి సంపదలో జలం కూడా చేరిపోయింది. ఇప్పుడైనా మనం జాగ్రత్తపడి బొట్టుబొట్టూ కాపాడి భవిష్యత్ తరాలకు అందించలేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.

Story first published: Saturday, March 22, 2014, 14:20 [IST]
Desktop Bottom Promotion