వినాయక చవితి పూజా విధానం, చదవాల్సిన మంత్రాలు, పత్రి నియమాలు

హిందూమతంలో అత్యంత ముఖ్యమైన పండుగల్లో వినాయచవితి ప్రథమమైనది. వినాయకచవితి వచ్చిందంటే చాలు ప్రతి ఊరు,ప్రతి వీధి గణేష మంటపాలతో కలకలలాడుతుంటాయి. నిమజ్జనం అయ్యేవరకు గణపతికి పూజలు,నైవేద్యాలతో గణేష్ మండపాల దగ్గర కోలాహలంగా సంబర వాతావరణం ఉంటుంది. ఏటా భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చవితి తిథి నాడు విఘ్నాలకు అధిపతి,ప్రథమ పూజ్యుడు అయిన వినాయకుడు జన్మదిన వేడుకను "వినాయక చవితి"గా ప్రపంచవ్యాప్తంగా హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరుపుకొంటారు.

వినాయక చవితి కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, మన జీవితంలోని అడ్డంకులను తొలగించి విజయాన్ని, జ్ఞానాన్ని, సిరిసంపదలను ప్రసాదించమని ఆ బొజ్జ గణపయ్యను వేడుకునే ఒక పవిత్రమైన అవకాశం. ఈ సంవత్సరం ఆగస్టు 27, బుధవారం నాడు గణేశ చతుర్థి వస్తున్న సందర్భంగా సంవత్సరం మొత్తం విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలు మనపై ఉండాలంటే పూజను ఎలా నిర్వహించాలో, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలో, ఏ మంత్రాలు జపించాలో ఇక్కడ చూడండి.

Vinayaka Chavithi 2025 A Complete Guide to Puja Vidhi Mantras and Offerings

పూజ ప్రారంభించే ముందు సిద్ధంగా ఉంచుకోవాల్సిన వస్తువులు
పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, హారతి కర్పూరం, అగరవత్తులు, తమలపాకులు, వక్కలు, పూల మాలలు, రకరకాల పువ్వులు, వివిధ రకాల పండ్లు, టెంకాయలు, బెల్లం ముక్కలు, పత్తితో చేసిన తోరం, వెండి లేదా మట్టి ప్రమిదలు, నెయ్యి లేదా కొబ్బరి నూనె, దీపారాధన వత్తులు, 21 రకాల పత్రి, స్వామికి ఇష్టమైన నైవేద్యాలు.

శాస్త్రోక్తమైన పూజా విధానం

గృహ శుద్ధి, సంకల్పం: పండుగ రోజు బ్రాహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని, మామిడి తోరణాలతో అలంకరించాలి. అనంతరం తలస్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించాలి. పూజా మందిరాన్ని లేదా ఇంట్లో తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకుని, పీఠాన్ని ఏర్పాటు చేయాలి.

విగ్రహ ప్రతిష్ఠ: ఒక పళ్లెంలో లేదా శుభ్రమైన వస్త్రంపై బియ్యం పోసి దానిపై తమలపాకులు ఉంచి మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పసుపుతో చేసిన హరిద్రా గణపతిని కూడా పూజలో ఉంచడం శ్రేష్ఠం.

కలశ స్థాపన, దీపారాధన: విగ్రహం పక్కన కలశాన్ని ఏర్పాటు చేసుకుని, అగరువత్తులను వెలిగించి, సుగంధభరిత వాతావరణాన్ని సృష్టించాలి. తర్వాత దీపారాధన చేయాలి. వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి, ఐదు వత్తులను వేరువేరుగా వేసి దీపం వెలిగిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. వీలైతే జిల్లేడు వత్తులతో దీపం పెడితే స్వామి అనుగ్రహంతో సంవత్సరం మొత్తం అత్యంత శుభప్రదంగా ఉంటుంది.

పత్రి పూజలో పాటించాల్సిన ముఖ్య నియమం
వినాయక చవితి పూజలో గరికకు అత్యంత ప్రాధాన్యం ఉంది. గరిక పోచలతో పూజించేటప్పుడు వాటిని విడివిడిగా కాకుండా, జంటగా సమర్పించాలి. ఆ జంట గరిక పోచలలో ఒకటి సిద్ధికి, మరొకటి బుద్ధికి ప్రతీకలుగా భావిస్తారు. ఇలా సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామిని ఆరాధించడం వల్ల సంపూర్ణ ఫలం దక్కుతుంది.

సంప్రదాయబద్ధంగా 21 రకాల పత్రులతో స్వామిని పూజిస్తారు. కానీ అవన్నీ దొరకడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం చింతించకుండా, జంట గరిక పోచలతో శ్రద్ధగా పూజ చేసినా 21 పత్రులతో పూజించినంత ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే గణపతికి ఎరుపు రంగంటే మహా ప్రీతి. అందుకే ఎర్ర మందారాలు, ఎర్ర గులాబీల వంటి పుష్పాలతో పూజిస్తూ గణపతి అష్టోత్తర శతనామావళిని లేదా సహస్రనామావళిని పఠించడం వల్ల ఆయన అనుగ్రహం త్వరగా సిద్ధిస్తుంది.

Vinayaka Chavithi 2025 A Complete Guide to Puja Vidhi Mantras and Offerings

పూజ పూర్తయిన తర్వాత ఈ మంత్రాలను జపించడం వల్ల విశేష ఫలితాలు

-పనుల్లో ఆటంకాలు తొలగి, విజయం వరించాలంటే శ్రీ వరసిద్ధి వినాయక వ్రత కల్పం చదివిన తర్వాత ఓం వక్రతుండాయ హూం అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి.

-మనసులోని కోరికలు శీఘ్రంగా నెరవేరాలంటే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి.

చవితి చంద్రుని దోష నివారణ
వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదని, చూస్తే నీలాపనిందలు వస్తాయని పురాణ కథనం. ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూసినా, ఆ దోషం నుంచి బయటపడటానికి ఒక సులభమైన మార్గం ఉంది. పూజ పూర్తయ్యాక కథ అక్షింతలను తలపై చల్లుకుంటూ..'సింహః ప్రసేనమవధీత్, సింహో జాంబవతా హతః సుకుమారక మారోదీః, తవ హ్యేష శమంతకః'.. శ్లోకాన్ని పఠించాలి. ఈ శక్తివంతమైన శ్లోకాన్ని పఠించడం వల్ల తెలియక చేసిన దోషం తొలగిపోయి సంవత్సరం మొత్తం ఎలాంటి నిందలు లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుందని పండితులు చెబుతున్నారు.

Story first published: Monday, August 25, 2025, 18:44 [IST]
Desktop Bottom Promotion