భారతదేశ మహిళా మణిరత్నం - ఇందిరా ప్రియదర్శిని గాంధీ!

By B N Sharma

Indira Gandhi
ఇందిరా ప్రియదర్శిని గాంధీ నవంబర్ 19, 1917 నాడు ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ లోని మొఘల్ సరాయ్ లో జన్మించింది. ఈమె భారత దేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి. ఇందిరా ప్రియదర్శినీ గాంధీ భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె.

ఇందిరా ప్రియదర్శిని బెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం లో చదివింది. ఇంగ్లండు లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లోని సోమర్ విల్ కళాశాల లో చదివేటప్పుడు, స్వాతంత్ర్యం సంపాదించడంకోసం లండను లో స్థాపించబడిన ఇండియాలీగ్ లో, 1930 లో, చేరింది. ఆ తర్వాత లండన్ లోని ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం లో చదువుకునే సమయంలోనే, జర్నలిస్ట్ ఫిరోజ్ గాంధీ తో పరిచయం క్రమంగా పరిణయానికి దారి తీసింది. తన తండ్రికి ఇష్టం లేకున్నప్పటికి, మహాత్మా గాంధీని ఒప్పించడంతో 1942 లో ఇందిర, ఫిరోజ్ ల వివాహం జరిగింది. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్టు అయి జైలుకు వెళ్ళి 1943 మే 13 న విడుదలైంది. భర్తతో కలిసి అలహాబాదులో ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో అలహాబాదును వదలి ఢిల్లీ చేరి తండ్రితో జీవించింది.

ఇందిరా గాంధీ 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఈ కాలంలో రాజభరణాల రద్దు, 1966లో రూపాయి మూల్య న్యూనీకరణ, 1969లో బ్యాంకుల జాతీయీకరణ లాంటి నిర్ణయాలతోపాటు దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలన కై గరీబీ హటావో నినాదం, 20 సూత్రాల పథకము లాంటి ప్రజాకర్షక పథకాలు చేపట్టింది. 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో నిర్ణయాత్మక విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. 1974లో రాజస్థాన్ ఎడారి లోని పోఖరాన్ లో అణుపాటవ పరీక్ష చేసి అమెరికా కన్నెర్రకు గురైంది. అంతేకాదు, ఆ చర్య వల్ల భారత అణు కార్యక్రమానికి బలమైన పునాది పడింది.

ఉన్నత రాజకీయ కుటుంబంలో జన్మించిన ఇందిర సహజంగానే రాజకీయవాదిగా ఎదిగి దేశ రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. 4 విడతలుగా మొత్తం సుమారు 16 సంవత్సరాలపాటు ప్రధాన మంత్రిగా దేశాన్ని పరిపాలించింది. ఈమె హయంలో రాజాభరణాల రద్దు, గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం, హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచన, 1971 పాకిస్తాన్ తో యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందినప్పటికి, 1975 నాటి అత్యవసర పరిస్థితి, స్వర్ణ దేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ వంటి వివాదాస్పద నిర్ణయాలవల్ల తీవ్ర విమర్శల పాలైంది. చివరకు బ్లూస్టార్ చర్య పర్యవసానంగా ఆమె తన అంగరక్షకుల తుపాకి గుళ్ళకు అక్టోబర్ 31, 1984 తేదీన బలైంది.

Story first published: Wednesday, February 29, 2012, 14:58 [IST]
Desktop Bottom Promotion