శ్రీవేంకటేశ్వరుని దర్శించిన తర్వాత..తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే..ఎలా?

ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లు తిరుపతి. శ్రీవేంకటేశ్వరుడిని దర్శనార్తం వచ్చే భక్తులతో తిరుమల నిత్యం రద్దీగా ఉంటుంది. అలాగే సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు. అలమేలు మంగ లేదా పద్మావతి, కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. అలిమేలు మంగమ్మ పుట్టినిల్లుగా తిరుచానూరు ప్రసిద్ది.

దీన్నే 'అలమేలు మంగాపురం' అని కూడా పిలుస్తుంటారు. చిత్తూరు జిల్లా తిరుపతి క్షేత్రంలో తిరుమలలో పాటు అనేక పుణ్యక్షేత్రాలున్నాయి. వాటిల్లో ఒకటి తిరుచానూరు. ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీ దేవి అవతారమైన అలమేలు మంగ ఆలయం ప్రసిద్ధి చెందింది. అందుకనే తిరుచానూరుని అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తారు.

Tiruchanur Padmavathi Ammavari Temple History and Significance in Telugu

ఇక్కడ వెంకటేశ్వరుని దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేలు మంగమ్మ కొలువై ఉంటుంది. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ తీర్థయాత్రకు ఫలం లభించదని చెబుతారు.

శ్రీనివాసుని దేవేరులుగా అలమేలు మంగ, లక్ష్మి, భూదేవి, శ్రీదేవి, పద్మావతి, అండాళ్, గోదాదేవి, బీబీ నాంచారి వంటి అనేక పేర్లు పేర్కొనబడడంవల్ల సామాన్యభక్తులలో కొంత అయోమయం నెలకొంటుంది. సంప్రదాయ గాధలను బట్టి ఈ దేవతలను గురించి ఇలా చెప్పవచ్చును. శ్రీదేవి (లక్ష్మి), భూదేవి ఇరువురూ శ్రీమహావిష్ణువును వరించిన దేవతలు. ఉత్సవ మూర్తియైన మలయప్పస్వామి ఉభయ నాంచారులతో కలిసి ఉన్నాడు. తిరుచానూరులో అమ్మవారు కొలువవ్వడానికి ఒక పురాణాగాథ ఉంది.

త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో మహా కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నడంతో తన నివాస స్థానాన్ని అవమాన పరిచాడని అలిగిన లక్ష్మి దేవి భూమి మీదకు చేరుకుంది. దీంతో సిరి లేని శ్రీనివాసుడు భూమి మీదకు వచ్చాడు.. తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మిదేవి అంగీకారంతో పరిణయం చేసుకున్నాడు.

Tiruchanur Padmavathi Ammavari Temple History and Significance in Telugu

అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ, రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి.
ఈ ఆలయం సన్నిధిలో శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి కొలువై ఉన్నారు. చారిత్రిక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇది "తిరువెంగడ కూటం"గా ఉంది. గతంలో ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి గుడి ఒకటుండేది. కాలక్రమంలో ఇక్కడ నుంచి వెంటకటేశ్వర స్వామిని వేరే సి చోటకు తరలించినట్లు తెలుస్తోంది.

తిరుపతి యాత్రకు వెళ్లిన భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవాలి.. లేదంటే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి. శ్రీవారి ఆలయంలో జరిగిన విధంగానే ప్రతి రోజు అలిమేలు అమ్మకు పూజాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం "అష్టదళ పదపద్మారాధన" జరుగుతుంది. శుక్రవారం అభిషేకం జరుగుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఉంటుంది.శ్రావణమాసంలోను, మరి కొన్ని దినాలలోను లక్ష్మీపూజ జరుగుతుంది.

ఇక్కడ ప్రసాదంతో పాటు ఇచ్చే పసుపు కుంకుమలను భక్తులు అతి పవిత్రమైనవిగా భావిస్తారు. కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడి ముఖ్యమైన ఉత్సవం. అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు తిరుమలనుండి గజవాహనంపై వచ్చే చక్రత్తాళ్వార్‌తో అమ్మవారు స్నానమాచరించడం సంప్రదాయం. ఆ సుముహూర్తంలో లక్షలాది జన సందోహం భక్తితో పుష్కరిణిలో స్నానమాచరిస్తారు.

Tiruchanur Padmavathi Ammavari Temple History and Significance in Telugu

అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి నాడు ఆది శంకరాచార్యులు అమ్మవారికి అలంకరించినట్లు చెప్పబడే మంగళ సూత్రాలను దర్శిస్తారు. దసరాకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. పదివేల జనాభా ఉన్న తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మంటపాలున్నాయి. ఏటా వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయి.

అలమేలు మంగాపురం వెళ్ళడానికి తిరుపతి బస్ స్టాండ్ నుంచి తిరుచానూరుకు రవాణా సౌకర్యం ఉంది. బస్సులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. లేదా లోకల్ గా తిరిగే షేర్ ఆటోలలో ఎక్కి దేవస్థానం వరకు చేరుకోవచ్చు

Story first published: Thursday, July 20, 2023, 8:00 [IST]
Desktop Bottom Promotion