పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ, ప్రత్యేక బస్సులు నడపనున్న TSRTC.. బుకింగ్స్ ప్రారంభం

తమిళనాడులోని అరుణాచల క్షేత్రం ఎంతో విశిష్టమైనది. ఈ పుణ్య క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వేలాది సంఖ్యలో వెళ్తుంటారు. అరుణాచల గిరిప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అరుణాచలేశ్వరుడి కొండ చుట్టూ నడక ప్రదక్షిణలు చేస్తే ఎంతో పుణ్యమని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఇక్కడ వేలాది మంది నిత్యం గిరిప్రదక్షిణ చేస్తుంటారు. పౌర్ణమి రోజుల్లో గిరిప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యమంని భక్తులు నమ్ముతుంటారు. ప్రతి నెలా పౌర్ణమి రోజు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అరుణాచలంకు వెళ్తుంటారు.

ఈ గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ- TSRTC గత నెలలో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టూర్ ప్యాకేజీకి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. బుకింగ్స్ అలా ఓపెన్ చేయగానే ఇట్టే బస్సులన్నీ ఫుల్ అయిపోయాయి. 32 బస్సులు ఏర్పాటు చేయగా.. అన్నీ ఫుల్ అయిపోయాయి. ఈ రూట్ లో ఉన్న డిమాండ్ ను గుర్తించిన యాజమాన్యం.

TSRTC Starts Arunachala Giri Pradakshina Tour Package, Know Significance Of Giri Pradaskhina In Telugu

ఇక మీదట ప్రతి నెలా హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లా కేంద్రాల నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. సూపర్ లగ్జరీలతో పాటు ఏసీ బస్సులు కూడా నడపాలని ఆర్టీసీ నిర్ణయించినట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి నెల పౌర్ణమికి 10 రోజుల ముందు నుంచి ఆన్‌లైన్‌ లో టికెట్లు అందుబాటులో ఉంచుతారు. జులై 31న పౌర్ణమి రోజుల జరగబోయే గిరి ప్రదక్షిణకు టికెట్ల కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జులై 30న రాష్ట్రంలోని వేర్వేరు బస్ స్టేషన్ల నుంచి సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉంటాయి.

కాణిపాకం, వెల్లూర్ గోల్డెన్ టెంపుల్ కూడా:

అరుణాచలం టూర్ ప్యాకేజీలో అరుణాచలం ఆలయంతో పాటు కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ కూడా దర్శించుకోవచ్చు. జులై 30వ తేదీన బస్సులు బయల్దేరతాయి. దారిలో ఉండే కాణిపాకం దర్శనం తర్వాత అరుణాచలం చేరుకుంటుంది. గిరిప్రదక్షిణ ప్రారంభం కావడానికి 4 గంట ముందే ప్రయాణికులు అరుణాచలం చేరుకునే టూర్ ప్లానింగ్ సిద్ధం చేశారు. గిరి ప్రదక్షిణ అరుణాచలేశ్వరుడి దర్శనం అనంతరం మరుసటి రోజు తిరుగు ప్రయాణం ఉంటుంది. వచ్చేటప్పుడు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శించుకోవచ్చు.

అరుణాచలం గిరిప్రదక్షిణ ప్రాముఖ్యత:

అరుణాచలం లేదా అన్నామలై తమిళనాడులో ఉంటుంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్నిభూతముకు ఇది ప్రతీక. తమిళంలో తిరువణ్ణామలై అని పిలుస్తుంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అంటే పెద్ద కొండ అని అర్థం. ఇక్కడి క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ క్షేత్ర దర్శన సందర్భంలో పరమేశ్వరుడిని తలుచుకుంటే చాలు ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.

అరుణాచల గిరిప్రదక్షిణ దాదాపు 14 కిలోమీటర్ల మేర ఉంటుంది. గిరిప్రదక్షిణ చేస్తే పాపాల నుంచి, జన్మ, పునర్జన్మల చక్రం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ప్రధాన దైవం అన్నామలైయార్ లేదా అరుణఆచలేశ్వరర్, ఆయన భార్య ఉన్నమాలైయార్ కొలువుదీరి ఉంటారు. గిరి ప్రదక్షిణను ఏ రోజులోనైనా, ఎప్పుడైనా చేయవచ్చు. రాత్రి, పగలు, ఉదయం, సాయంత్రం అనే భేదాలేం లేవు. చాలా మంది భక్తులు మాత్రం అర్థరాత్రి వేళ గిరిప్రదక్షిణ చేస్తుంటారు. పౌర్ణమి రోజుల్లో గిరిప్రదక్షిణ రోడ్డు మార్గంలో వాహనాలను అనుమతించరు. విశాలమైన రోడ్డు మార్గంలో వేలాది మంది భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Saturday, July 22, 2023, 10:30 [IST]
Desktop Bottom Promotion