పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి!

నీరు మన ప్రాణాధారం. ఇది కేవలం మన దప్పికను తీర్చడానికే కాకుండా, శరీర ఉష్ణోగ్రతను వాతావరణానికి అనుగుణంగా నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని పోషకాలను, పీల్చుకునే ఆక్సిజన్‌ ను శరీరంలోని ప్రతి కణానికి రవాణా చేసేది నీరే. అంతేకాదు మన కీళ్ల కదలికలను సులభతరం చేయడానికి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి, శరీరంలోని పనికిరాని విషతుల్యాలను చెమట, మూత్రం రూపంలో బయటకు పంపడానికి నీరు అత్యంత కీలకం.

Stop Sipping Water All Day Sadhguru Warns About This Dangerous Habit

అయితే శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌ గా ఉంచుకోవాలి కదా అని ఎడాపెడా, అవసరానికి మించి నీళ్లు తాగేయడం ఏమాత్రం సరైనది కాదు. మీరు నీరు ఎలా తాగుతున్నారు అన్న దానిపైనే అది మీకు అమృతంలా ప్రయోజనం చేకూరుస్తుందా లేక హానికరంగా మారుతుందా అనేది ఆధారపడి ఉంటుంది.

కొద్ది కొద్దిగా నీళ్లు తాగితే ఏమవుతుందంటే..

ముఖ్యంగా వేసవికాలం రాగానే, ఎండ వేడిని తట్టుకోవడానికి వీలైనంత ఎక్కువ నీరు తాగమని అందరూ ఉచిత సలహాలు ఇస్తుంటారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఆఫీసుల్లోకానీ, ప్రయాణాల్లో కానీ చాలామంది చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని, రెండు నిమిషాలకోసారి ఒక చిన్న గుటక నీళ్లు తాగే వారు మనకు తరచుగా కనిపిస్తుంటారు.

అయితే నీటిని సరైన మోతాదులో తీసుకోవాలి కానీ, పదే పదే కొద్దికొద్దిగా నీరు తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు చెబుతున్నారు. రోజంతా బాటిల్ పట్టుకుని సిప్ చేయడం వల్ల మెదడు వాపు వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆయన తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో షేర్ చేశారు.

రోజంతా కొద్దికొద్దిగా నీటిని తీసుకున్నప్పుడు మన శరీరం తీవ్ర గందరగోళానికి గురవుతుంది. అవసరానికి మించి నీటిని నిరంతరం గ్రహించడం వల్ల శరీరంలోని సోడియం లెవల్స్ లో అసమతుల్యత ఏర్పడి, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Stop Sipping Water All Day Sadhguru Warns About This Dangerous Habit

నీరు తాగడానికి సరైన పద్ధతి ఏమిటి?
సద్గురు సూచనల ప్రకారం, మీకు సహజంగా దాహం వేసినప్పుడు మాత్రమే మీరు నీరు తాగాలి. అది కూడా కొద్దికొద్దిగా కాకుండా, దప్పిక తీరేలా ఒకేసారి తగినంత నీటిని తాగాలి. ఇలా ఒకేసారి గ్లాసు నిండుగా నీరు తాగినప్పుడు, ఎంత నీటిని శరీరంలో నిలుపుకోవాలి, ఎంత నీటిని బయటకు పంపేయాలి అనేది మన శరీరం ఖచ్చితంగా నిర్ణయించుకోగలుగుతుంది.

ఇక వైద్య నిపుణులు సైతం పాత పద్ధతులను తోసిపుచ్చుతున్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 2.5 లీటర్లు లేదా ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి అని చెప్పే సిద్ధాంతం కేవలం ఒక అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి, మనిషి శరీర బరువు, ఎత్తు, వారు పురుషులా లేక స్త్రీలా.. వారు చేసే శారీరక శ్రమను బట్టి ఎవరికి ఎంత నీరు అవసరం అనేది మారుతూ ఉంటుంది. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణకోశ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

నీరు మాత్రమే కాదు అవి తినాలి
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే..శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కేవలం త్రాగునీటిపైనే ఆధారపడకూడదు. మనం తినే ఆహారం ద్వారా కూడా శరీరానికి నీరు అందాలి. అందుకోసం టమోటా, కీరదోస, ముల్లంగి, నారింజ వంటి నీటి శాతం పుష్కలంగా ఉండే సహజసిద్ధమైన పండ్లు, కూరగాయలను రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, April 20, 2026, 10:12 [IST]
Desktop Bottom Promotion