అజిత్ పవార్ మరణంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాల్లో బుధవారం అనూహ్యమైl, అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. బారామతి గడ్డపై జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కన్నుమూశారు.

ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు కూడా చనిపోవడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఈ ఘటన కేవలం ఒక ప్రమాదమేనా లేక దీని వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Accident or Conspiracy Mamata Banerjee Raises Questions on Ajit Pawar Death

వైరల్ అవుతున్న వీడియో

విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇవి చూసిన వారి గుండెలు బరువెక్కుతున్నాయి. బారామతి ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ కోసం సిద్దమవుతున్న టైంలో విమానం అకస్మాత్తుగా అదుపు తప్పినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

గాల్లోనే బ్యాలెన్స్ కోల్పోయిన విమానం భారీ శబ్దంతో నేలను ఢీకొట్టింది. ఆ మరుక్షణం అది ఒక పెద్ద అగ్నిగోళంగా మారిపోయింది. మంటల తీవ్రత ఎంతలా ఉందంటే..సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఎవరూ సాహసించలేకపోయారు.

ప్రత్యక్ష సాక్షులు ఏమన్నారంటే
ఈ ప్రమాదాన్ని దగ్గరి నుండి చూసిన ప్రత్యక్ష సాక్షుల మాటలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. విమానం ల్యాండింగ్‌ కు ముందే గాల్లో అస్థిరంగా చక్కర్లు కొట్టడం తాము గమనించామని ఒక మహిళ తెలిపారు. విమానం రన్‌ వేపై దిగడానికి వస్తుండగా ఒక వైపుకు వంగిపోయింది.

నేలను తాకగానే పెద్ద శబ్దం వచ్చింది. ఆ వెంటనే మంటలు చెలరేగి, వరుసగా నాలుగైదు పేలుళ్లు సంభవించాయి. విమాన శకలాలు గాల్లోకి ఎగిరి మా ఇంటి ఆవరణలో పడ్డాయి అని ఆమె భయంతో వణికిపోతూ చెప్పారు.

మరో సాక్షి మాట్లాడుతూ..విమానం కిందకు దిగుతున్న తీరు చూస్తేనే ఏదో ప్రమాదం జరగబోతోందని మాకు అనిపించింది. రన్‌ వేకి దాదాపు 100 అడుగుల దూరంలో ఉండగానే అది కూలిపోయింది. మేము కాపాడడానికి పరుగెత్తే లోపే మంటలు చుట్టుముట్టాయి. అజిత్ పవార్ అందులో ఉన్నారని తెలిసి మేము షాక్‌ కి గురయ్యాము అని ఆవేదన వ్యక్తం చేశారు.

మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ఈ విషాద ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా సంచలన ఆరోపణలు చేశారు. అజిత్ పవార్ తన పాత గూటికి (శరద్ పవార్ వర్గంలోకి) తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యారని, ఆ నిర్ణయం అమల్లోకి రాకముందే ఈ ఘోరం జరిగిందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

రెండు రోజుల క్రితమే అజిత్ పవార్ బీజేపీని వీడబోతున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన తిరిగి సొంత పార్టీకి వెళ్లేలోపే ఈ సంఘటన జరిగింది. దేశంలో ఎవరికీ భద్రత లేదు అని మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి
కేంద్ర దర్యాప్తు సంస్థలపై తనకు నమ్మకం లేదని,అవి పూర్తిగా అమ్ముడుపోయాయని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మాత్రమే సమగ్ర దర్యాప్తు జరగాలి. ఇది సాధారణ ప్రమాదం కాదు అని ఆమె తెలిపారు. అజిత్ పవార్ కుటుంబానికి, శరద్ పవార్‌కు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాంగ్రెస్ డిమాండ్
ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ..ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. అజిత్ పవార్ మరణం తీరని లోటు. ఈ ప్రమాదం వెనుక ఉన్న వాస్తవాలు బయటకు రావాలంటే నిష్పాక్షిక దర్యాప్తు జరగాల్సిందే అని డిమాండ్ చేశారు.

Story first published: Wednesday, January 28, 2026, 17:30 [IST]
Desktop Bottom Promotion