భోగి వేళ మంటలు పెడుతుంటే వీటిని అస్సలే వేయకూడదు, అవేంటంటే..

సంక్రాంతి ముందు రోజు భోగి జరుపుకుంటారు. చెక్కు బెరడు, పిడకలు, ఆవు నెయ్యి వేసి భోగి మంటలు వేస్తారు. మరి భోగి మంటల్లో ఏమేం వేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండగ. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో మకర సంక్రాంతి సంబరాలు ఎంతో ఆడంబరంగా జరుగుతాయి. వైభవంగా జరిగే సంక్రాంతి వేడుకలకు వివిధ ప్రాంతాల్లో ఉండే వాళ్లు కూడా సొంతూళ్లకు వస్తుంటారు. భోగితో మొదలయ్యే సంబరాలు మూడ్రోజుల పాటు సాగుతాయి. సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి జరుపుకుంటారు. భోగి రోజు మంటలు వెలిగిస్తారు. చిన్నారులపై భోగి పళ్లు పోస్తారు.

Do not put these things on bhogi mantalu in Telugu

సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజుల్లో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో భోగి మంటలు వాతావరణంలో వెచ్చదనాన్ని ఇస్తాయి. సంక్రాంతి నాడు పంట కోతలు పూర్తవుతాయి. పొలాల్లో ఉండే క్రిమికీటకాలను తరిమికొట్టేందుకు భోగిమంటలు ఉపయోగపడతాయి.

సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లే రోజు మకర సంక్రాంతి జరుపుకుంటారు. దీని వల్ల ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం వస్తుంది. ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. ఎండ వేడి పెరుగుతుంది. ఉన్నట్టుండి వచ్చే ఎండ వేడికి శరీరాన్ని సిద్ధం చేయడానికి భోగి మంటలు ఉపయోగపడతాయి. భోగి మంటలు వేయడం వెనక శాస్త్రీయ కారణం ఇదేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

భోగి అంటే ఏంటి?

భోగి అంటే ఏంటి?

భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు మాత్రమే కాదు. అగ్నిని ఆరాధించే ఓ ప్రత్యేక సందర్భం. హోమానికి ఉన్నంత ప్రాధాన్యత భోగి మంటలకు ఉంటుంది. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటలను అంతే పవిత్రంగా వెలిగించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

భోగి మంట ఎలా వెలిగించాలి?

భోగి మంట ఎలా వెలిగించాలి?

భోగి రోజు తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానం చేసి భోగి మంట కోసం కట్టెలు పేర్చాలి. శుచిగా ఉన్న వ్యక్తి భోగి మంటలు వెలిగించాలి. కర్పూరాన్ని వెలిగించి దాంతో కట్టెలకు నిప్పు అంటించాలి.

భోగి మంటల్లో ఏం వేయవచ్చు?

భోగి మంటల్లో ఏం వేయవచ్చు?

భోగి మంటల్లో చెట్టు బెరడు, పాత కలపను వేసేవారు. ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి వాటిని భోగి మంటల్లో వేసేవారు. భోగి మంటల్లో ఆవు నెయ్యి కూడా పోసేవారు. ఆవు పేడతో చేసిన పిడకలు, ఆవు నెయ్యి వేయడంతో వచ్చే వాయువులు పీల్చితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అంటారు.

పిడకలు, చెట్ల బెరడు అందుబాటులో లేకపోతే తాటి, కొబ్బరి ఆకులు, ఎండిన కొమ్మలు వేయవచ్చు.

భోగి మంటల్లో ఏమేం వేయకూడదు?

భోగి మంటల్లో ఏమేం వేయకూడదు?

భోగి అనగానే కర్రలు, పిడకలు వేసి వెలిగించే వారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. భోగి మంటల్లో ఇంట్లో ఉన్న పాత వస్తువులు వేస్తున్నారు. వాటితో పాటు చెత్తా చెదారం, పనికి రాని వస్తువులు, విరిగిపోయిన కుర్చీలు, రబ్బరు టైర్లు, కవర్లు ఇలా ఏవి పడితే అవి వేస్తున్నారు.

మంచి చెట్టు బెరడు, పిడకలు, ఆవు నెయ్యితో వచ్చే వాయువులతో ఆరోగ్యం బాగుపడుతుందని ఆయుర్వేదం చెబుతుంటే.. దానిని పట్టించుకోకుండా రబ్బరు, ప్లాస్టిక్ వస్తువులు అవి మండేందుకు పెట్రోల్, కిరోసిన్ వంటివి పోస్తున్నారు. వీటి వల్ల వెలువడే వాయువులు ఆరోగ్యానికి చేటు చేస్తాయి.

నగరాల్లో పిడకలు దొరకడం కష్టం కాబట్టి కేవలం కర్రలు, ఆవు నెయ్యి వేసి సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఉండేలా చిన్న మంట వేసినా దాని వల్ల మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

Story first published: Wednesday, January 4, 2023, 11:06 [IST]
Desktop Bottom Promotion