వినాయక నిమజ్జనం ఎప్పుడు చేయాలి? పండితుల మాట ఇదే!

దేశవ్యాప్తంగా ఇవాళ(ఆగస్టు 27,2025)వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హిందువులు మాత్రమే కాకుండా అనేక ఇతర మతాల వ్యక్తులు కూడా వినాయకచవితిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పల్లెల్లో,పట్నాల్లో, గల్లీ గల్లీలో గణేష్ మంటపాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో గణనాథుడికి పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ మంటపాల దగ్గర ఆ ఆనందం, ఆ కోలాహలం మాటల్లో చెప్పలేనిది. ఇళ్లల్లో కూడా బొజ్జ గణపయ్యను ప్రతిష్ఘించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.

అయితే పండుగ ముగిశాక అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే..ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి? ఈ విషయంలో ఎన్నో సందేహాలు, ఎన్నో సంప్రదాయాలు. అయితే అసలు శాస్త్రం ఏం చెబుతోంది? పండితులు వినాయక నిమజ్జనానికి అసలు ఏయే రోజులను శ్రేష్ఠమైనవిగా సూచిస్తున్నారో ఇక్కడ చూడండి.

Ganesh Chaturthi 2025 Auspicious Days for Ganesha Idol Nimajjanam

నిమజ్జనానికి శుభప్రదమైన రోజులు
వినాయక వ్రత కల్పం ప్రకారం ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడిని బేసి సంఖ్య రోజులలో నిమజ్జనం చేయడం అత్యంత శుభప్రదమని పండితులు నొక్కి చెబుతున్నారు. దైవకార్యాలలో బేసి సంఖ్యలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే విగ్రహాన్ని పూజలో ఉంచే రోజుల సంఖ్య బేసిగా ఉండాలని సూచిస్తారు.

ఏకదిన గణపతి (మొదటి రోజు): కొందరు భక్తులు ముఖ్యంగా సమయాభావం ఉన్నవారు లేదా ప్రత్యేక మొక్కులు మొక్కుకున్నవారు చవితి రోజునే పూజ పూర్తి చేసి, సాయంత్రానికే నిమజ్జనం చేస్తారు. దీనిని ఏకదిన గణపతి అంటారు. ఇది కూడా శాస్త్రసమ్మతమే.

మూడవ రోజు: వినాయకుడిని నిమజ్జనం చేయడానికి మూడవ రోజు కూడా ఎంతో పవిత్రమైనది. చాలా కుటుంబాలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తాయి.

ఐదవ రోజు: ఐదవ రోజున చేసే నిమజ్జనం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. ఈ రోజున కూడా అధిక సంఖ్యలో భక్తులు నిమజ్జనం చేస్తారు.

ఏడవ రోజు, తొమ్మిదవ రోజు: ఈ రోజులు కూడా నిమజ్జనానికి అనుకూలమైనవే. తమ వీలును బట్టి భక్తిని బట్టి ఈ రోజులలో గణనాథుడికి వీడ్కోలు పలుకుతారు.

పదకొండవ రోజు (అనంత చతుర్దశి): అన్నింటికంటే అత్యంత శ్రేష్ఠమైన, విశిష్టమైన రోజు అనంత చతుర్దశి. పదకొండవ రోజున వచ్చే ఈ తిథి నాడు చేసే నిమజ్జనం వల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయని పండితులు చెబుతారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా ఈ రోజునే వినాయక నిమజ్జన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

నిమజ్జన ప్రక్రియ ఎలా ఉండాలి?
నిమజ్జనానికి ముందు వినాయకుడికి యథావిధిగా ధూప, దీప, నైవేద్యాలతో ఆఖరి పూజ చేయాలి. దీనిని ఉద్వాసన పూజ అంటారు. స్వామికి ఇష్టమైన ఉండ్రాళ్లు, కుడుములు, పండ్లు, పెరుగు అన్నం వంటివి సమర్పించి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత,ౌ విగ్రహాన్ని కదిలించి గణపతి బప్పా మోరియా అంటూ భక్తితో నినాదాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లాలి. సమీపంలోని నది, చెరువు లేదా శుభ్రమైన నీటి ప్రవాహంలో నిమజ్జనం చేయాలి. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ఇంట్లోనే ఒక బకెట్ నీటిలో కరిగించి, ఆ నీటిని మొక్కలకు పోయడం ఉత్తమమైన పద్ధతి.

Story first published: Wednesday, August 27, 2025, 12:25 [IST]
Desktop Bottom Promotion