ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్‌ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ

వీకెండ్ వస్తే చాలు.. సముద్రపు అలల సవ్వడి.. చల్లని గాలి.. రుచికరమైన సీఫుడ్.. చేతిలో ఇష్టమైన డ్రింక్.. ఇవన్నీ అనగానే యువతకు వెంటనే గుర్తొచ్చే డెస్టినేషన్ గోవా. మన దేశంలో బీచ్ టూరిజం అనగానే ముందుగా గోవాయే కనిపిస్తుంది. కానీ ఇకపై ఆ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించడానికి మనం అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు.

Goa Vibes Now in AP State Govt Approves Beach Shacks in Vizag Suryalanka

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు కూడా గోవా, పాండిచ్చేరి తరహాలో సరికొత్తగా ముస్తాబు కానున్నాయి. ఏపీలోని సుదీర్ఘమైన సముద్ర తీరాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు వీలుగా ఏపీ తీరాలలో తొలిసారిగా బీచ్ షాక్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారికంగా జీవో నంబర్ 362ను జారీ చేసింది.

అసలు బీచ్ షాక్స్ అంటే ఏమిటి?
బీచ్ షాక్స్ అంటే సముద్ర తీరం వెంబడి ఇసుక తిన్నెలపై వెదురు బొంగులు, చెక్కలు, తాటి ఆకులతో పూర్తిగా పర్యావరణ అనుకూలంగా ఏర్పాటు చేసే అందమైన తాత్కాలిక కుటీరాలు (నిర్మాణాలు). అలల శబ్దాన్ని వింటూ సేదతీరేందుకు ఇక్కడ ప్రత్యేకమైన బీచ్ బెడ్స్ వేస్తారు.

సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ అక్కడి నుంచే పర్యాటకులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నోరూరించే సీఫుడ్, రకరకాల ప్రాంతీయ వంటకాలు, స్నాక్స్, జ్యూస్‌ లతో పాటు బీర్లు, వైన్లు ఇక్కడ అందుబాటులో ఉంచుతారు. పర్యాటకుల కోసం ప్రత్యేకంగా షవర్స్, వాష్‌ రూమ్స్ వంటి మౌలిక సౌకర్యాలు కూడా కల్పిస్తారు.

తొలి అడుగు విశాఖ, సూర్యలంక బీచ్‌ ల్లో..
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (APTDC) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 12 తీర ప్రాంత జిల్లాల్లో ఈ బీచ్ షాక్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే ప్రారంభ దశలో పైలట్ ప్రాజెక్టు కింద విశాఖపట్నంలోని ప్రముఖ బీచ్‌ లు, బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ సూర్యలంక బీచ్‌ లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.

2026 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 2029 ఆగస్టు 31వ తేదీ వరకు వీటి నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చారు. తొలి ఏడాది పాటు వీటి పనితీరు, పర్యాటకుల స్పందన ఎలా ఉందో పరిశీలించి ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా బీచ్‌ లకు ఈ విధానాన్ని విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Goa Vibes Now in AP State Govt Approves Beach Shacks in Vizag Suryalanka

టైమింగ్స్ ఇవే.. నిబంధనలు కఠినం
పర్యాటకులకు వినోదంతో పాటు భద్రత కూడా ముఖ్యమే కాబట్టి ప్రభుత్వం కొన్ని కఠినమైన రూల్స్ పెట్టింది. ఈ బీచ్ షాక్స్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. రాత్రి వేళల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదు.

ఇక్కడ కేవలం బీర్, వైన్, బ్రీజర్స్ వంటి తక్కువ ఆల్కహాల్ శాతం ఉండే పానీయాలు మాత్రమే విక్రయిస్తారు. విదేశీ మద్యం, ఇతర హార్డ్ ఫారిన్ లిక్కర్ అమ్మకాలపై పూర్తిగా నిషేధం ఉంటుంది. అలాగే జాతీయ రహదారుల సమీపంలో మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు నిబంధనలను కచ్చితంగా పాటిస్తారు.

పర్యావరణానికి పెద్దపీట.. స్థానికులకు ఉపాధి
ఈ షాక్స్‌లను పర్యావరణానికి ఎలాంటి హాని చేయని తాత్కాలిక నిర్మాణాలతోనే నిర్మిస్తారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడం, వ్యర్థాల నిర్వహణ బాధ్యత అంతా నిర్వాహకులదే. మాల్దీవులు, గోవా వంటి ప్రాంతాలకు వెళ్తున్న దేశీయ, విదేశీ పర్యాటకులను ఆంధ్రా తీరానికి రప్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీనిద్వారా ప్రభుత్వానికి పర్యాటక ఆదాయం పెరగడమే కాకుండా, తీర ప్రాంత యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Desktop Bottom Promotion