భర్త మరణం, చేతిలో పసికందు,చేతిలో ఉన్నది రూ.500..ఇప్పుడు ఆమె టర్నోవర్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

అది 2008వ సంవత్సరం.. అసోం రాష్ట్రంలోని నల్బారి జిల్లాకు చెందిన కనికా టాలుక్దార్ జీవితంలో ఊహించని విషాదం. రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త ఆకస్మికంగా మరణించారు. అప్పటికి ఆమె చేతిలో నాలుగు నెలల పసికందు. చదివింది పదో తరగతే, కుటుంబ వ్యాపారాల గురించి ఏమాత్రం అవగాహన లేదు, స్థిరమైన ఆదాయం అంతకన్నా లేదు.

Success Story From Rs 500 to Rs 75 Lakhs Incredible Journey of woman enterpreneur Kanika Talukdar

ఆ చీకటి సమయంలో ఆమె ముందు రెండే దారులున్నాయి.. ఒకటి, విధిని నిందిస్తూ చీకటి గదిలో కుంగిపోవడం. రెండోది.. తన బిడ్డ భవిష్యత్తు కోసం గుండెను రాయి చేసుకుని ఒంటరి పోరాటం చేయడం. కనికా రెండో దారినే ఎంచుకుంది. నాటి ఆమె కన్నీటి శపథం, 17 ఏళ్ల తర్వాత ఏటా రూ.75 లక్షల టర్నోవర్ సాధించే వ్యాపార సామ్రాజ్యంగా ఎలా మారిందో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

అక్కడే ఆలోచనలో మార్పు

భర్త మరణించిన తొలి రోజుల్లో ఇంటికే పరిమితమైన కనికా జీవితంలో.. 2014లో తొలి మార్పు వచ్చింది. ఓ స్వయం సహాయక సంఘంలో (ఎస్‌హెచ్‌జీ) చేరిన ఆమె జీవికా సఖిగా బాధ్యతలు తీసుకుంది. పొదుపు చేయడం, బృందంగా కలిసి పనిచేయడం అక్కడ నేర్చుకుంది. ఆ అనుభవం ఆమెలో ఏదైనా సాధించగలను అనే నమ్మకాన్ని నాటింది. ఆ నమ్మకానికి క్రిషి విజ్ఞాన్ కేంద్రం (KVK)లో జరిగిన ఓ వర్క్‌ షాప్ ప్రాణం పోసింది. డాక్టర్ మనోషి చక్రవర్తి ఇచ్చిన వెర్మీకంపోస్ట్ (వానపాముల ఎరువు)తయారీ శిక్షణ కనికా ఆలోచనలను మార్చేసింది.

వెంటనే తన జేబులో ఉన్న కేవలం రూ.500లతో తల్లిదండ్రుల ఇంటి పెరట్లోనే ఓ చిన్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఖరీదైన ముడిసరుకులు కొనే స్థోమత లేక రాలిపోయిన ఆకులు, కూరగాయల వ్యర్థాలతోనే ఎరువు తయారు చేసింది. అదే జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి పునాది రాయి. అయితే తయారు చేయడం సులువే కానీ.. అమ్మడమే పెద్ద సవాలుగా మారింది.

ఏళ్ల తరబడి రసాయన ఎరువులకు అలవాటుపడిన రైతులు సేంద్రియ ఎరువుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. సాధారణంగా ఇక్కడే చాలామంది ఓటమిని అంగీకరిస్తారు. కానీ కనికా వెనక్కి తగ్గలేదు. 2018 నుంచి ఊరూరా తిరుగుతూ రైతులకు అవగాహన కల్పించింది. స్థానిక రేడియోల ద్వారా తన గళాన్ని వినిపించింది. ఆమె పట్టుదల ముందు రైతుల అనుమానాలు పటాపంచలయ్యాయి. అమ్మకాలు నెమ్మదిగా పుంజుకున్నాయి.

అమెజాన్, ఫ్లిప్ కార్డ్ లెవల్ కి

2017లో జయతు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పేరుతో తన బ్రాండ్‌ ను అధికారికంగా రిజిస్టర్ చేసింది. 2019లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ (DIC) అండతో ఆమె వ్యాపారం ఆకాశమే హద్దుగా ఎదిగింది. అమెజాన్, ఫ్లిప్‌ కార్ట్‌ లతో పాటు ప్రభుత్వ పోర్టల్ GeM లో తన ఉత్పత్తులను ఉంచింది. GeM ద్వారా వచ్చిన భారీ ప్రభుత్వ ఆర్డర్లు ఆమె జీవితాన్ని మార్చేశాయి. ఈ కృషికిగానూ ఐఐఎం కలకత్తా, అసోం అగ్రికల్చరల్ యూనివర్సిటీ తదితర సంస్థల నుంచి రూ.27.50 లక్షల గ్రాంట్లు లభించాయి. ఆ డబ్బును సొంతానికి వాడుకోకుండా వ్యాపార విస్తరణకే పెట్టుబడిగా పెట్టింది.

Success Story From Rs 500 to Rs 75 Lakhs Incredible Journey of woman enterpreneur Kanika Talukdar

జాతీయ అవార్డు

ఒకప్పుడు పెరట్లో మొదలైన ఈ ప్రాజెక్ట్.. నేడు నెలకు 70 టన్నుల వెర్మీకంపోస్ట్‌ ను ఉత్పత్తి చేస్తోంది. నిత్యం ట్రాక్టర్ల కొద్దీ ఆవు పేడ, గుర్రపుడెక్క, అరటి ఆకులు ముడిసరుకుగా వస్తుంటాయి. ఈ ఎరువుతో పాటు సేంద్రియ పురుగుమందులు, ఆవు పేడ అగరబత్తీలు కూడా తయారు చేస్తోంది. ఈ అద్భుత ఆవిష్కరణకు 2019లో జాతీయ అవార్డు దక్కింది. పెద్దమొత్తంలో కొనేవారికి కిలో రూ.10కి, ఇంట్లో పెంచుకునే మొక్కల కోసం చిన్న ప్యాకెట్లను రూ.150కి అమ్ముతూ, ఎంతో సరళమైన వ్యాపార విధానాన్ని పాటిస్తోంది.

ఆమె లక్ష్యం ఇదే

భవిష్యత్తులో ఆన్‌ లైన్ వ్యాపారాన్ని మరింత విస్తరించి, మరెంతో మంది గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని కనికా చెబుతోంది. ఒకప్పుడు చేతిలో రూ.500 మాత్రమే ఉన్న ఓ సాధారణ మహిళ.. నేడు రూ.75 లక్షలు సంపాదిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. కష్టాలు వచ్చినప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. కష్టపడి పనిచేస్తే ఒక చిన్న అవకాశం కూడా జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తుందని కనికా కథ నిరూపిస్తోంది.

Story first published: Monday, June 15, 2026, 20:00 [IST]
Desktop Bottom Promotion