Chilkur Balaji Temple: వీసా మాఫియా గుడి.. చిలుకూరు బాలాజీ ఆలయంపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

అమెరికాలో అడుగుపెట్టి మంచి ఉద్యోగం సాధించాలనేది ఎంతోమంది భారతీయుల కల. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల యువత ఈ కల సాకారం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తాజాగా అమెరికా వర్క్ వీసాలకు సంబంధించి ఓ పెద్ద వివాదం ఆన్‌ లైన్ ‌లో రాజుకుంది. ఏకంగా హైదరాబాద్‌ సమీపంలో ఉన్న ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ గుడి ప్రస్తావన అమెరికా రాజకీయాల్లోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

US Senator Calls H-1B a Scam Mocks Chilkur Balaji Temple NRIs Outraged

హెచ్-1బీ అనేది ఒక స్కామ్.. ఒక వీసా కార్టెల్

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ఎరిక్ ష్మిట్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అమెరికాలోని H-1B, L-1, F-1, OPT వంటి వీసా ప్రోగ్రామ్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ అనేది పక్కా మోసం, ఒక స్కామ్. గ్లోబల్ కార్పొరేట్ కంపెనీలకు అమెరికా మార్కెట్లు కావాలి, అమెరికా కోర్టుల రక్షణ కావాలి కానీ, అమెరికన్ కార్మికులు మాత్రం వద్దట.. అమెరికన్లకు జరుగుతున్న ఈ ద్రోహానికి వెంటనే ముగింపు పలకాలి అని ఆయన ఘాటుగా విమర్శించారు. అంతేకాకుండా ఈ వ్యవస్థను వీసా కార్టెల్ గా ఆయన అభివర్ణించారు.

విదేశీ ఉద్యోగులను తక్కువ జీతాలకు నియమించుకుంటూ, స్థానిక అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను ఈ కార్పొరేట్ సంస్థలు దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీనివల్ల అమెరికన్ల వేతనాలు పడిపోతున్నాయని, అవుట్‌సోర్సింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో బిలియన్ల కొద్దీ డాలర్ల సంపద భారతదేశానికి తరలిపోతోందని ఆయన మండిపడ్డారు. ఈ వీసా విధానం అమెరికాలోని మధ్యతరగతి వర్గాలను నిర్వీర్యం చేస్తుందన్నారు.

US Senator Calls H-1B a Scam Mocks Chilkur Balaji Temple NRIs Outraged

వీసా టెంపుల్ ప్రస్తావనతో భగ్గుమన్న నెటిజన్లు
అయితే, ఈ విమర్శల పరంపరలో ఎరిక్ ష్మిట్.. తెలంగాణలోని హైదరాబాద్ శివార్లలో ఉన్న ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయం గురించి ప్రస్తావించడం భారతీయులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్తే అమెరికా వీసా గ్యారెంటీ అని చాలామంది నమ్మకం. అనేకసార్లు అమెరిక వీసా తిరస్కరణకు గురైన తర్వాత చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లి వచ్చాక అమెరికా వీసా వచ్చినవాళ్లు చాలామందే ఉన్నారు.

వీసా ఇంటర్వ్యూకు వెళ్లే ముందు భక్తులు ఇక్కడ స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకోవడం, వీసా మంజూరైన తర్వాత మళ్లీ ఆలయానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకోవడం ఇక్కడ ఏళ్ల తరబడి వస్తున్న పవిత్రమైన ఆచారం. ఇది వారి నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక. అమెరికా సెనేటర్ తన రాజకీయ విమర్శలకు ఈ ఆలయాన్ని, అందులోని ఆచారాలను ముడిపెడుతూ ఎగతాళి చేయడం పట్ల నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ట్రంప్ విధానాల నీడలోనే..
అమెరికాలో హెచ్-1బీ వీసాల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు అమెరికాకు వెళ్తుంటారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ వీసా నిబంధనలను కఠినతరం చేయడం, కనీస వేతనాలను పెంచడం వంటి చర్యలు చేపట్టారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో రిపబ్లికన్ సెనేటర్ విదేశీ ఉద్యోగులపై మాటల దాడికి దిగడం ఆందోళన కలిగిస్తోంది.

ఎరిక్ ష్మిట్ చేసిన వీసా కార్టెల్ వ్యాఖ్యలు, అందులోనూ హిందువుల విశ్వాసాలకు ప్రతీక అయిన చిలుకూరు ఆలయాన్ని ప్రస్తావించడంపై ఆన్‌ లైన్‌ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సెనేటర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా, సున్నితత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భారతీయ నెటిజన్లు,ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా టెక్ రంగం అభివృద్ధిలో భారతీయ టాలెంట్ పాత్ర ఎంతో కీలకమని, ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు తగవని వారు హితవు పలుకుతున్నారు.

Story first published: Saturday, May 16, 2026, 22:29 [IST]
Desktop Bottom Promotion