అసలైన ఆంధ్ర స్టైల్ పల్లీ కారం పొడి..ఇక కూరలతో పనే లేదు

Posted By:

తెలుగు వారి ఇళ్లలో పొడులకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. కంది పొడి, కరివేపాకు పొడి ఇలా ఎన్నో రకాలు మన భోజనంలో భాగమైపోయాయి. ఈ పొడులన్నీ కేవలం రుచిని పెంచడమే కాకుండా, మనకు తెలియకుండానే ఎన్నో పోషకాలను అందిస్తాయి. అలాంటి పొడుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచేది పల్లీ కారం పొడి లేదా వేరుశనగ కారం పొడి.

వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పల్లీ కారం పొడిని కలిపి తింటుంటే ఆ రుచి వర్ణనాతీతం. ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి అల్పాహారాలకు ఇది ఒక అద్భుతమైన సైడ్ డిష్. కూర వండటానికి సమయం లేనప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు ఈ ఒక్క పొడి ఉంటే చాలు. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాలలో కూడా ఇది మేటి. పల్లీ కారం పొడి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Authentic Andhra Style Palli Karam Podi Recipe in Telugu

పల్లీ పొడి తయారీకి కావలసిన పదార్థాలు

పల్లీలు (వేరుశనగ పప్పు) - 1 కప్పు
ఎండు మిరపకాయలు - 20
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు -12
చింతపండు - నిమ్మకాయంత
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకు - 2 రెమ్మలు
నూనె - 1 టీస్పూన్

పల్లీ పొడి తయారీ విధానం

-ముందుగా ఒక మందపాటి బాండీని స్టవ్‌ పై పెట్టి అందులో పల్లీలు వేసి తక్కువ మంట మీద వేయించాలి.

-పల్లీల పై పొట్టు కొద్దిగా రంగు మారి, పప్పులు చిటపటలాడుతూ, మంచి సువాసన వస్తున్నప్పుడు వాటిని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పల్లీలు సరిగ్గా వేగకపోతే పచ్చి వాసన వస్తుంది, ఎక్కువగా వేగితే చేదు వస్తాయి. కాబట్టి ఈ దశ చాలా ముఖ్యం.

-ఇప్పుడు స్టవ్ మీద అదే బాండీలో ఒక టీస్పూన్ నూనె వేసి అందులో ఎండు మిరపకాయలను వేసి తక్కువ మంట మీద దోరగా వేయించాలి. అవి కొద్దిగా ఉబ్బి రంగు మారగానే తీసి పక్కన పెట్టుకోవాలి.

-తర్వాత అదే బాండీలో ధనియాలు, జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి తీయాలి. మీరు కరివేపాకు వాడుతున్నట్లయితే దానిని కూడా చివర్లో వేసి తేమ పోయి కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

-వేయించిన పల్లీలు, మిరపకాయలు, ఇతర దినుసులన్నీ పూర్తిగా చల్లారే వరకు ఆగాలి.

-తర్వాత మిక్సీ గిన్నెలో వేయించిన ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు వేయించి చల్లార్చిన పల్లీలను, పొట్టుతో సహా ఉన్న వెల్లుల్లి రెబ్బలను అందులో వేసి పల్స్ మోడ్‌ లో లేదా పొడి చేసుకోవాలి.

-తయారైన ఘుమఘుమలాడే పల్లీ కారం పొడిని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని, గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే రెండు నెలల వరకు తాజాగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, November 9, 2025, 15:28 [IST]
Desktop Bottom Promotion