శ్రీరామనవమి స్పెషల్..గోధుమ రవ్వ పాయసం ఇలా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!

Posted By:

పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది నోరూరించే తీపి వంటకాలే. సాధారణంగా పండుగలలో రకరకాల పాయసాలు చేయడం మనకు ఆనవాయితీ. అయితే, ఈ శ్రీరామనవమికి కాస్త భిన్నంగా, ఎంతో ఆరోగ్యకరమైన, అందరికీ విపరీతంగా నచ్చే గోధుమ రవ్వ పాయసం ట్రై చేయండి. ఈ పాయసం రుచి అమృతంలా ఉంటుంది.

గోధుమ రవ్వ, బెల్లం, కొబ్బరి పాలు కలిపి చేసే ఈ పాయసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోధుమ రవ్వ పాయసం ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Sri Rama Navami Special Healthy Delicious Wheat Rava Payasam Recipe in Telugu

గోధుమ రవ్వ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు

సంబా గోధుమ రవ్వ (లావు గోధుమ రవ్వ) - 2 కప్పులు
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
తరిగిన బెల్లం - 1 కప్పు
నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్
ఉప్పు - చిటికెడు
జీడిపప్పు - తగినన్ని

గోధుమ రవ్వ పాయసం తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ రవ్వను తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి.

-తర్వాత కడిగిన గోధుమ రవ్వ కుక్కర్‌ లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మూతపెట్టాలి. మీడియం మంట మీద 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి రవ్వ మెత్తగా ఉడికిందో లేదో చూసుకుని గరిటెతో నెమ్మదిగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి తురుము వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పలచటి వస్త్రం లేదా ఫిల్టర్ సహాయంతో వడకట్టి, చిక్కటి కొబ్బరి పాలను పక్కన పెట్టుకోవాలి. సుమారు 2 కప్పుల కొబ్బరి పాలు అవసరం అవుతాయి.

-మరోవైపు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేయాలి. బెల్లం కరిగిన తర్వాత అందులోని నలకలు పోవడానికి ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి.

-ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక పాత్రను స్టవ్ మీద పెట్టి, అందులో కరిగించి వడకట్టుకున్న బెల్లం నీళ్లను పోయాలి. వెంటనే మెత్తగా ఉడికించి పెట్టుకున్న గోధుమ రవ్వను, చిటికెడు ఉప్పును వేసి బాగా కలపాలి. సన్నటి మంటపై ఉడకనివ్వాలి.

-మిశ్రమం కాస్త దగ్గరపడుతున్నప్పుడు, ముందుగా తీసిపెట్టుకున్న కొబ్బరి పాలను పోసి నెమ్మదిగా కలపాలి. కొబ్బరి పాలు పోశాక పాయసాన్ని ఎక్కువగా మరిగించకూడదు. పాయసం కమ్మటి వాసన వస్తున్నప్పుడు యాలకుల పొడి చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.

-చివరగా వేరొక చిన్న కడాయిలో నెయ్యి వేడి చేసి, అందులో జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేసి వాటిని నెయ్యితో సహా పాయసంలో వేసి కలుపుకుంటే
ఎంతో రుచికరమైన, నోరూరించే కమ్మని గోధుమ రవ్వ పాయసం రెడీ. దేవుడికి నైవేద్యంగా సమర్పించడానికి, కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించడానికి ఇది పర్ఫెక్ట్ స్వీట్.

[ of 5 - Users]
Story first published: Friday, March 27, 2026, 8:56 [IST]
Desktop Bottom Promotion