మంచు శివలింగ దర్శనానికి వేళాయె..నేటి నుంచే అమర్‌నాథ్ యాత్ర-2026 రిజిస్ట్రేషన్లు..ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

హిందువులు అత్యంత పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో చేసే ఆధ్యాత్మిక ప్రయాణాలలో అమర్‌నాథ్ యాత్ర ముందు వరుసలో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్‌ లోని హిమాలయాల్లో కొలువైన ఆ మంచు శివలింగాన్ని దర్శించుకోవాలని, ఆ పరమశివుని ఆశీస్సులు పొందాలని ప్రతి శివభక్తుడూ జీవితంలో ఒక్కసారైనా కోరుకుంటాడు. 2026 అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన షెడ్యూల్, సన్నాహాలు మొదలయ్యాయి.

యాత్ర తేదీలు - ప్రత్యేకతలు
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమై, ఆగస్టు 28వ తేదీ వరకు కొనసాగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాత్ర ఏకంగా 57 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనుండటం విశేషం. యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Amarnath Yatra 2026 Registrations Open Now Here s Your Step by Step Guide

ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి(ఏప్రిల్ 15,2026)నుంచి ప్రారంభమైంది. ఆన్‌ లైన్ లేదా ఆఫ్‌ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ ద్వారా: శ్రీ అమర్‌నాథ్ జీ శ్రైన్ బోర్డ్ (SASB) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్‌లైన్ ద్వారా: దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 550కి పైగా బ్యాంక్ శాఖల (SBI, PNB, ICICI తదితర) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఎలా అప్లయ్ చేయాలి?
అప్లికేషన్ ఫామ్‌ లో మీ వ్యక్తిగత వివరాలు స్పష్టంగా నింపాలి. పాస్‌ పోర్ట్ సైజ్ ఫోటోలు, సరైన గుర్తింపు కార్డు జత చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత, దరఖాస్తు విజయవంతమైతే సిస్టమ్ జనరేటెడ్ యాత్రా పర్మిట్ జారీ అవుతుంది. అందులో మీ యాత్ర తేదీ, ఎంచుకున్న మార్గం ఉంటాయి. ఈ పర్మిట్ లేకుండా యాత్రకు అనుమతి లభించదు.

ఆరోగ్య నిబంధనలు-అర్హతలు
అమర్‌నాథ్ యాత్ర అత్యంత ఎత్తైన, మంచుతో కూడిన కఠినమైన హిమాలయ ప్రాంతాల్లో సాగుతుంది కాబట్టి వాతావరణాన్ని తట్టుకునే ఆరోగ్య ధృడత్వం తప్పనిసరి.

13 సంవత్సరాల నుంచి 70 ఏళ్ల లోపు ఉన్నవారు మాత్రమే ఈ యాత్రకు అర్హులు. 6 వారాలకు పైబడిన గర్భిణీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు.

ప్రతి భక్తుడు తప్పనిసరిగా ఆరోగ్య ధృవీకరణ పత్రం (CHC) సమర్పించాలి. ఏప్రిల్ 8వ తేదీ తర్వాత శ్రైన్ బోర్డు గుర్తించిన ప్రభుత్వ హాస్పిటల్, డాక్టర్ల నుంచి మాత్రమే ఈ సర్టిఫికెట్ పొందాలి. ప్రైవేట్ క్లినిక్స్ ఇచ్చే సర్టిఫికెట్స్ చెల్లవు.

Amarnath Yatra 2026 Registrations Open Now Here s Your Step by Step Guide

ఏ మార్గం ఎంచుకోవాలి?

భక్తులు ప్రయాణించడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి

పహల్గామ్ మార్గం: ఇది కొంచెం పొడవైనప్పటికీ, నడవడానికి సాఫీగా ఉంటుంది. మొదటిసారి వెళ్లేవారికి, వృద్ధులకు ఇది అనువైనది.

బల్తాల్ మార్గం: ఇది తక్కువ దూరమే అయినప్పటికీ, చాలా నిటారుగా ఉండి కాస్త శారీరక శ్రమతో కూడుకున్నది. సమయం తక్కువ ఉన్నవారు దీనిని ఎంచుకుంటారు.

భద్రత, సదుపాయాలు
భక్తుల భద్రత దృష్ట్యా ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరికీ ఆర్ఎఫ్‌ఐడీ (RFID) ట్రాకింగ్ కార్డును అందిస్తారు. దీనివల్ల భక్తుల కదలికలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.

అలాగే ప్రతి భక్తుడికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను కూడా అందిస్తున్నారు. బల్తాల్ మార్గంలో మెరుగైన విద్యుత్ దీపాలు, గుర్రాలు, పల్లకీల కోసం ముందస్తు బుకింగ్ సదుపాయం తీసుకువచ్చారు. ఆపదలో ఆదుకోవడానికి ప్రత్యేక రెస్క్యూ బృందాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి.

రోజువారీ కోటా పద్ధతిలో స్లాట్స్ కేటాయిస్తారు కాబట్టి, డిమాండ్ దృష్ట్యా ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ప్రయాణ తేదీకి 7 రోజుల ముందే ఆయా స్లాట్స్ మూసుకుపోతాయి కాబట్టి చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే యాత్రకు ప్లాన్ చేసుకుని, రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం బెటర్

Story first published: Wednesday, April 15, 2026, 12:45 [IST]
Desktop Bottom Promotion