Bonalu 2023: ఆషాఢమాస బోనాల విశిష్టత.. గ్రామ దేవతకు సమర్పించే బోనాలకు విశేషమైన చరిత్ర

తెలంగాణలో ఆషాఢమాసం బోనాలకు అట్టహాసంగా అంకురార్పణ జరిగింది. హైదరాబాద్ లో నెల రోజుల పాటు ఈ బోనాల జాతర ఎంతో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆషాఢమాస బోనాల విశిష్టత, ప్రాముఖ్యత, గ్రామ దేవతలకు సమర్పించే ఈ బోనాల చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బోనం అంటే ఏంటి?

బోనం అంటే భోజనం. కొత్త కుండలో భోజనం వండి గ్రామ దేవతలకు భక్తితో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెడతారు. ఈ బోనాన్ని నెత్తిపై మోసుకుంటూ జాతరగా వెళ్లి గ్రామ దేవతకు సమర్పిస్తారు. ముందు మెడలో వేప మండలు కట్టుకున్న వేటపోతులు తరలి వెళ్తుంటే.. వెనక వేపాకులు పట్టుకుని బోనం ఎత్తుకున్న మహిళలు జాతరగా తరలి వెళ్తారు.

Bonalu 2023 Significance Of Ashada Month Bonalu And History Of Bonalu In Telugu

మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొందరు ఉల్లిపాయలతో చేసిన అన్నంను మట్టి, ఇత్తడి లేదా రాగి కుండల్లో పెట్టి, వాటికి బొట్లు పెడతారు. చేతిలో వేప ఆకులు పట్టుకుని బోనాన్ని తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో సంబరంగా అందరూ కలిసి జాతరగా గ్రామ దేవత వద్దకు బయలుదేరతారు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ లాంటి వివిధ పేర్లతో పిలిచే గ్రామ దేవతల కొలువుకు వెళ్లి బోనం సమర్పిస్తారు. కొందరు బోనంతో పాటు సాక సమర్పిస్తారు. ఇలా బోనాలు సమర్పించడం వల్ల గ్రామ దేవతలు శాంతిస్తారని, అంటు వ్యాధులు రాకుండా కాపాడతారని భక్తుల విశ్వాసం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బోనాల పండగను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి ఏటా ఘనంగా నిర్వహిస్తోంది.

బోనం ఆచారాలు:

ఆషాఢమాసంలో ఆడబిడ్డలను పుట్టింటికి తెచ్చుకుంటారు. ఇంటి ఆడబిడ్డ ఇళ్లకు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలిసిందే. ఆషాఢమాసంలో గ్రామ దేవత పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. పుట్టింటికి వచ్చే గ్రామ దేవతకు తమ ఇళ్లల్లోకి సాదరంగా ఆహ్వానం పలుకుతారు భక్తులు. కూతురు ఇంటికి వచ్చిన భావనతో భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. దీనిని ఊరడి అంటారు. కొన్ని చోట్ల పెద్ద పండుగ, వంటల పండుగ గా పిలుస్తారు. ఇదే కాలక్రమంలో బోనాలుగా మారింది. బోనాలు సమర్పించడానికి వెళ్లేటప్పుడు పోతురాజులు, శివసత్తుల విన్యాసాలతో నృత్యాలు చేస్తూ డప్పు చప్పుళ్లతో వెళ్తారు.

బోనాల ఆచారం ఈనాటిది కాదు:

పల్లవ రాజుల కాలానికి ముందు నుంచే ఈ బోనాల పండుగ ఉండేదని చరిత్ర చెబుతోంది. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఏడు కోల్ల ఎల్లమ్మ నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనం సమర్పించినట్లు చరిత్ర. 1676లో కరీంనగర్ హుస్నాబాద్ లో ఎల్లమ్మగుడిని సర్వాయి పాపన్న కట్టించాడు తర్వాత బోనాలు సమర్పించాడు.

హైదరాబాద్ జంట నగరాల్లో 1869 లో ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాది మంది చనిపోయారు. దీంతో గ్రామ దేవతలను పూజించి బోనం సమర్పించారట స్థానికులు. ఆ తర్వాత ప్లేగు వ్యాధి క్రమంగా తగ్గినట్లు చెబుతారు. అప్పట్లో హైదరాబాద్ ను పాలించిన నిజాం ప్రభువుల కాలంలోనూ బోనాల పండగ ఘనంగా జరిగేదని చరిత్ర చెబుతోంది. నిజాం ప్రభువులు కూడా ఈ పండగకు పూర్తిగా సహకరించేవారట. అలాట గోల్కోండలోని జగదాంబ అమ్మవారి ఆలయం కూడా వారే నిర్మించినట్లు చెబుతారు.

Desktop Bottom Promotion