చుక్క క్రీమ్ వాడకుండానే..రెస్టారెంట్ స్టైల్ క్రీమీ పెరి పెరి సోయా.. ఎలా చేయాలో చూడండి!

Posted By:

రెస్టారెంట్ స్టైల్ లో క్రీమీగా, స్పైసీగా ఉండే వంటకాలు తినాలని ఉందా? కానీ అందులో ఉండే క్రీమ్, క్యాలరీల గురించి భయపడుతున్నారా? అయితే క్రీమీ పెరి పెరి సోయా ట్రై చేయండి. చుక్క కూడా క్రీమ్ వాడకుండానే, ఎంతో క్రీమీగా, మసాలాతో అద్భుతంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఫిట్నెస్ పై శ్రద్ధ వహించేవారికి, ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఒక్కసారి రుచి చూశారంటే మళ్లీ మళ్లీ మీరే చేసుకుని తింటారు.

క్రీమీ పెరి పెరి సోయా తయారీకి కావాల్సిన పదార్థాలు

మీల్ మేకర్ - 1.25 కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్
కశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
పెరి పెరి మసాలా - 2.5 టీస్పూన్లు
నూనె - తగినంత
వెల్లుల్లి తరుగు - కొద్దిగా
ఉల్లిపాయ - 1
ఉల్లికాడలు (స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్) - కొద్దిగా
లో ఫ్యాట్ పనీర్ - 100 గ్రాములు
నానబెట్టిన జీడిపప్పు - 9
వేడి నీళ్లు - తగినంత

క్రీమీ పెరి పెరి సోయా తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని వేడి చేయాలి. అందులో ఒకటిన్నర కప్పుల మినీ సోయా చంక్స్, కొద్దిగా ఉప్పు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 5-6 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇలా చేయడం వల్ల సోయాకు ఉన్న పచ్చి వాసన పోయి రుచి పెరుగుతుంది.

-ఉడికిన తర్వాత నీటిని వంపేసి, సోయా చంక్స్ చల్లారాక వాటిలోని నీళ్లన్నీ పోయేలా గట్టిగా పిండుకోవాలి.

-నీళ్లు పిండేసిన సోయా చంక్స్ ను ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టీస్పూన్ల కశ్మీరీ కారం, 1 టీస్పూన్ పెరి పెరి మసాలా వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా, మెత్తబడే వరకు వేయించాలి.

-ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే ముందుగా మసాలా పట్టించి పెట్టుకున్న సోయా చంక్స్, కొద్దిగా ఉల్లికాడల తరుగు వేసి 3 నుండి 4 నిమిషాల పాటు కలుపుతూ బాగా వేయించుకోవాలి.

-ఒక మిక్సీ జార్ లో 100 గ్రాముల లో ఫ్యాట్ పనీర్, ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పులు, 1.5 టీస్పూన్ల పెరి పెరి మసాలా వేయాలి. తగినన్ని నీళ్లు పోసి మెత్తని, క్రీమీ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. క్రీమ్ లేకుండానే వంటకానికి క్రీమీ టెక్స్చర్ వచ్చేది దీనివల్లే.

-వేగుతున్న సోయా మిశ్రమంలో పనీర్ జీడిపప్పు పేస్ట్ ను వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వేడి నీళ్లు పోసి బాగా కలపాలి. మూత పెట్టి ఈ మిశ్రమాన్ని 6-7 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. గ్రేవీ ఎంతో క్రీమీగా మారి, ఆకర్షణీయమైన రంగులోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

-ఘుమఘుమలాడే వేడి వేడి క్రీమీ పెరి పెరి సోయా' రెడీ. దీన్ని వేడి వేడి రోటీలు, చపాతీలతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి సైడ్ డిష్ లేకుండా దీన్ని స్నాక్ లాగా నేరుగా కూడా లాగించేయొచ్చు.

[ of 5 - Users]
Story first published: Saturday, April 25, 2026, 12:58 [IST]
Desktop Bottom Promotion