పూజలో మర్రి ఆకులు.. ఈ దేవుళ్లకి పొరపాటున కూడా సమర్పించకూడదు.!

హిందుమత శాస్త్రాల ప్రకారం భగవంతుడికి పూజ చేసే సమయంలో కొన్ని నిర్దిష్ట నియమాలు పాటించాల్సి ఉంటుంది. దేవతారాధనలో నియమాలు, ఆచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఒక్కో దేవునికి ఒక్కో రకమైన నైవేద్యంతో పాటు కొన్ని రకాల పత్రాలను ప్రత్యేకంగా సమర్పిస్తాం. ఇందువల్ల భగవంతుడి ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. వాటిలో ముఖ్యమైనది మర్రి ఆకు. ఈ పత్రాలను ఏ దేవతలకు సమర్పించాలి.. ఎవరికి సమర్పించకూడదు అనేది శాస్త్రాల్లో ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..

Should not offer Banyan tree leaves while worshipping these deities

మర్రి ఆకులను అన్ని దేవతలకు సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు. ఇది మీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సుపై ప్రభావం చూపిస్తుంది. అందుకే వైకుంఠవాసుడు, విశ్వానికి సంరక్షకుడు విష్ణుమూర్తికి చేసే పూజల్లో మర్రి ఆకులను ఉపయోగించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీమన్నారాయణుడి పూజలో ప్రధానంగా తులసి ఆకులను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే మర్రి చెట్టు త్యాగానికి ప్రతీకంగా భావిస్తారు. ఈ చెట్టు విష్ణు నివాసం. అందుకే ఆయన నివసించే ప్రదేశం నుంచి ఆకును కోసి ఆయనకు సమర్పించకూడదని పండితులు అంటున్నారు. విష్ణు భగవానుడికి మర్రి ఆకులను సమర్పించడం నిషిద్ధం.

లయకారుడు శివునికి అత్యంత ప్రియమైనవి బిల్వ పత్రాలు, ధతూర. వీటినే ఆయనకు పూజలో సమర్పిస్తారు. అయితే, శివలింగానికి మర్రి ఆకును సమర్పించడం పాపంగా పరిగణిస్తారు. మర్రి చెట్టులోనే శివుడు కొలువై ఉండటం వల్ల.. ఈ ఆకును శివలింగానికి సమర్పించడం నిషేధం. బిల్వ పత్రాలు, ధతూరతో శివయ్యకు అభిషేకం చేసినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇళ్లల్లో సంపద, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయి. అమ్మవారి అనుగ్రహం వల్లే ఇంట్లో సుఖాలు వాటిల్లుతాయి. అయితే పూజలో అమ్మవారికి ఇష్టం లేనివి సమర్పించకూడదు. మోక్షానికి, వైరాగ్యానికి ప్రతీకగా భావించే ఈ ఆకులను సమర్పించడం నిషిద్ధం.

గణేశుడు

విఘ్నాలను తొలగించే భగవంతుడు, జ్ఞానానికి అధిపతి గణేశుడి పూజలో గరిక పోచలను సమర్పిస్తే చాలు ఆయన మహదానందపడిపోతాడని భక్తుల నమ్మకం. కానీ ఆయనకు వగరుగా ఉండే పదార్థాలను సమర్పించకూడదు. అందులో మర్రి ఆకులు ఒకటి. మర్రి ఆకులు త్యాగానికి ప్రతీక కాబట్టి.. వాటిని గణపతి ఆరాధనలో సమర్పించకూడదని పండితులు సూచించారు.

ఏ దేవతలకు సమర్పించాలి..

మర్రి ఆకులను ఈ దేవతలకు సమర్పించడం ద్వారా శుభం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శని దేవుడు, హనుమంతుడి పూజలో మర్రి ఆకులను సమర్పించడం ఉత్తమం. రావి చెట్టును పూజించేటప్పుడు, వట సావిత్రి వ్రతంలో ఈ ఆకులను సమర్పించాలి. అంతేకాకుండా తాంత్రిక పరిహారాల కోసం మర్రి ఆకులను సమర్పిస్తే సత్ఫలితాలు పొందవచ్చు. అయితే మర్రి ఆకులను చెట్టు నుంచి కోసి సమర్పించకూడదు. చెట్టు నుంచి రాలిపడినప్పుడు మాత్రమే పూజకు ఉపయోగించాలి.

Story first published: Wednesday, June 10, 2026, 23:06 [IST]
Desktop Bottom Promotion