శ్రీరామనవమి రోజునే సీతారాముల కళ్యాణం ఎందుకు?..దీని వెనుక ఉన్న రహస్యం ఏంటీ?

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో పరిపూర్ణ మానవావతారం శ్రీరామావతారం. సాక్షాత్తు ఆ దేవాదిదేవుడే సామాన్య మానవుడిగా జన్మించి, కష్టనష్టాలను చిరునవ్వుతో స్వీకరించి, ధర్మ సంస్థాపన చేసిన మహనీయుడు మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు.

పద్నాలుగేళ్ల వనవాసం, భార్యా వియోగం, రావణ సంహారం.. ఇలా ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని ఆదర్శమూర్తిగా నిలిచాడు. చైత్ర శుద్ధ నవమి రోజు ఆ జగదభిరాముని జన్మదినమే కాదు, లోకకళ్యాణ కారకమైన సీతారాముల పరిణయ దినం కూడా.

Sri rama Navami 2026 The Real Reason Why We Celebrate sita rama kalyanam on Lord Rama Birthday

అభిజిత్ లగ్నంలో అవతరించిన సూర్యవంశపు తేజం
శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు (అభిజిత్ ముహూర్తంలో) జన్మించాడు. పురాణాలు, జ్యోతిష, ఖగోళ శాస్త్ర పండితుల పరిశోధనల ప్రకారం.. త్రేతాయుగంలో క్రీస్తుపూర్వం 5114 జనవరి 10వ తేదీన స్వామి జననం జరిగిందని ఓ అంచనా.

అప్పట్లో జనవరి నుంచే చైత్ర మాసం మొదలయ్యేది. దశరథుని ముద్దుల పట్టిగా పెరిగిన రామయ్య, లేత వయసులోనే గురువైన విశ్వామిత్రుని యాగ రక్షణార్థం వెళ్లి, అసాధారణ పరాక్రమంతో రాక్షస సంహారం చేశాడు. ఆ తర్వాత గురువు అడుగుజాడల్లో సోదరుడు లక్ష్మణునితో కలిసి మిథిలా నగరానికి పయనమయ్యాడు.

జనకనందిని.. అపురూప స్వయంవరం
మిథిలాధిపతి జనక మహారాజు గారాల పట్టి సీతాదేవి. భూమిని దున్నుతుండగా నాగటి చాలులో దొరికిన అయోనిజ ఆమె. జనకుడి ఇంట పరమశివుడు అనుగ్రహించిన అత్యంత బరువైన శివధనుస్సు ఉండేది.

సీతమ్మ బాల్యంలో ఆడుకుంటూ ఉండగా, బంతి ఆ ధనుస్సు కిందకు వెళ్లగా, మహావీరులకు సైతం కదపడానికి సాధ్యంకాని ఆ విల్లును పూలచెట్టును పక్కకు జరిపినంత సునాయాసంగా ఎడమచేతితో పక్కకు నెట్టేసింది. కూతురి అసాధారణ శక్తిని గమనించిన జనకుడు, ఆ శివధనుస్సును ఎక్కుపెట్టిన పరాక్రమవంతుడికే తన కుమారిని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించి, స్వయంవరానికి ఏర్పాట్లు చేశాడు.

Sri rama Navami 2026 The Real Reason Why We Celebrate sita rama kalyanam on Lord Rama Birthday

శివధనుర్భంగం - పితృవాక్య పరిపాలన
విశ్వామిత్రునితో కలిసి స్వయంవరానికి విచ్చేసిన రామలక్ష్మణులు అక్కడ ఆసీనులయ్యారు. ఎందరో ఉద్దండ రాజులు విల్లును కనీసం ఎత్తలేక భంగపడ్డారు. అప్పుడు గురువు ఆజ్ఞతో వేదికనెక్కిన శ్రీరాముడు, ఆ శివధనుస్సును అవలీలగా పైకెత్తి, నారి సారిస్తుండగానే అది పెద్ద శబ్దంతో రెండు ముక్కలైంది.

అప్పుడు సీతమ్మ మనసు ఆనందంతో ఉప్పొంగింది. జనక మహారాజు పరమానందంతో రామచంద్రునికి సీతనిచ్చి వివాహం చేయడానికి సిద్ధపడగా..మా తండ్రి దశరథుని అనుమతి లేనిదే ఈ వివాహం జరగదు అని రాముడు తన పితృభక్తిని చాటుకున్నాడు. వెంటనే వాయువేగంతో అయోధ్యకు వర్తమానం వెళ్లడం, దశరథుడు తన పరివారంతో సంతోషంగా మిథిలకు చేరుకోవడం జరిగిపోయాయి.

దివిజలు మెచ్చిన దివ్య కల్యాణం
సకల యజ్ఞయాగాది క్రతువులు ముగిశాక, సర్వాలంకార భూషిత అయిన సీతమ్మను జనకుడు స్వయంగా వివాహ వేదిక దగ్గరకు తీసుకువచ్చాడు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, పవిత్ర జలాలను వదులుతూ ఆ కమలకన్నుల రాముడికి కన్యాదానం చేశాడు.

శ్రీరాముడు సీతమ్మ చేయి పట్టుకున్న ఆ పాణిగ్రహణ శుభ ముహూర్తాన ఆకాశం నుంచి దేవతలు పూలవాన కురిపించారు. దేవ దుందుభులు మ్రోగాయి. గంధర్వులు గానం చేయగా, అప్సరసలు నాట్యం చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు శ్రీరామనవమి రోజు ఆ జగత్ కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపించడం మనకు సంప్రదాయంగా మారింది.

Story first published: Thursday, March 26, 2026, 10:28 [IST]
Desktop Bottom Promotion