ఉగాది నాడు తప్పక చేయాల్సిన 5 పనులు..పచ్చడి తింటూ చదవాల్సిన శ్లోకం..ధర్మసింధు ఏం చెబుతోంది?

తెలుగు లోగిళ్లలో సరికొత్త ఆశలకు, ఆనందాలకు ప్రతీకగా నిలిచే తొలి పండుగ ఉగాది. ఉగాది నుంచి సృష్టి ప్రారంభమయిందని చెబుతారు. బ్రహ్మ ప్రళయం ముగిసిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభమయ్యే కాలాన్నే బ్రహ్మ కల్పం అంటారు. అలా ప్రతి కల్పంలో వచ్చే యుగాదియే మన ఉగాది.

ఉగాది పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలో, ఏయే నియమాలు పాటించాలో ప్రఖ్యాత గ్రంథం ధర్మసింధు వివరంగా తెలియజేసింది. ఈ పవిత్రమైన రోజున పంచకృత్యాలు (ఐదు విధులు) తప్పనిసరిగా ఆచరించాలని స్పష్టం చేసింది. ఇవాళ(మార్చి 19)ఉగాది పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ధర్మ సింధు సూచించిన ఆ ఐదు విధులు ఏవో ఇక్కడ చూడండి.

Ugadi 2026 5 Essential Rituals to Perform on Ugadi According to Dharma Sindhu

తైలాభ్యంగనం (నూనెతో తలంటు స్నానం)
ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నువ్వుల నూనెను ఒంటికి, తలకి రాసుకుని అభ్యంగన స్నానం ఆచరించాలి. అభ్యంగం కారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్టిదం అని ఆయుర్వేదం చెబుతోంది. అంటే తైలభ్యంగనం వల్ల దేహంలోని సర్వ అవయవాలకు పుష్టి, ఆరోగ్యం చేకూరుతాయి. పండుగ రోజున ఈ స్నానం అత్యంత శుభప్రదం.

నూతన సంవత్సర స్తోత్రం
స్నానం ముగిసిన వెంటనే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఇల్లు, దేవుడి మందిరాన్ని మామిడి తోరణాలు, బంతిపూలతో సుందరంగా అలంకరించుకోవాలి. కొత్త పంచాంగాన్ని, ఇష్టదేవతలను, సంవత్సర దేవతను భక్తిశ్రద్ధలతో పూజించి, నైవేద్యాన్ని సమర్పించి నూతన సంవత్సర ప్రారంభ ప్రార్థనలు చేయాలి.

నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
ఉగాది అనగానే గుర్తుకొచ్చేది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. వేపపువ్వు, కొత్త చింతపండు, బెల్లం, మామిడి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పుతో పాటు కొద్దిగా చెరుకు ముక్కలు, పుట్నాలు వేసి దీనిని తయారు చేస్తారు. జీవితంలో కష్టసుఖాలను, సంతోష విషాదాలను సమానంగా స్వీకరించాలనే గొప్ప జీవన సత్యాన్ని ఈ పచ్చడి వివరిస్తుంది.

Ugadi 2026 5 Essential Rituals to Perform on Ugadi According to Dharma Sindhu

ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు చదవాల్సిన శ్లోకం

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ..సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం.

ఈ శ్లోకాన్ని పఠిస్తూ పచ్చడిని సేవించడం వల్ల వజ్రసమానమైన దేహం, ఆయురారోగ్యాలు, సర్వసంపదలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. ఉగాది రోజు మొదటి జాములో ఈ పచ్చడిని తింటే సంవత్సరం మొత్తం సౌఖ్యంగా ఉంటుందని శాస్త్ర వచనం.

ధ్వజారోహణం - పూర్ణకుంభ దానం
పూర్వం ఉగాది రోజున ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజాలను ప్రతిష్టించేవారు. ఒక వెదురు గడకు పట్టువస్త్రం కట్టి, మామిడి ఆకులు, వేప మండలతో కలశాన్ని ఉంచి ఇంటి ఆవరణలో పూజించేవారు. కాలక్రమేణా ఈ ఆచారం స్థానంలో పూర్ణకుంభ దానం వాడుకలోకి వచ్చింది. రాగి, వెండి లేదా కొత్త మట్టి కుండను కలశంగా మార్చి, రంగులతో అలంకరించి అందులో అక్షతలు, పూలు వేయాలి. పసుపు కుంకుమలు రాసిన కొబ్బరి బొండాన్ని కలశంపై ఉంచి, నూతన వస్త్రంతో అలంకరించి పండితులకు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

పంచాంగ శ్రవణం
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఉగాది రోజు దేవాలయాల్లో కానీ, పండితుల సమక్షంలో కానీ కందాయ ఫలాలు తెలుసుకుని, ఏడాది పొడవునా ఎలా ఉండాలో ముందుగానే వినడం సంప్రదాయం. దీనివల్ల గంగాస్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది.

పంచాంగం వినడం వల్ల నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు వైభవాన్ని, కుజుడు శుభాలను, శని ఐశ్వర్యాన్ని, రాహు-కేతువులు బలాన్ని, కులాధిక్యతను ప్రసాదిస్తారని ప్రగాఢ విశ్వాసం.

Story first published: Thursday, March 19, 2026, 8:06 [IST]
Desktop Bottom Promotion