దీపావళి గురించి తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలు.. పండగకు ముందే తెలుసుకుంటే..!

దీపావళికి ఇంకో రెండు రోజులు ఉన్నాయి. సాధారణంగా పండగకు రెండు తిథులు వచ్చినప్పుడు కొంత అయోమయం ఉంటుంది. అయితే సాయంకాల సమయం, అమావాస్య ఘడియలు కలిసి వస్త్ఉన్న అక్టోబర్ 31వ తేదీనే దీపావళి జరుపుకోవాలి. దేశ ప్రజలంతా కూడా ఆరోజే దీపావళిని జరుపుకోనున్నారు. అయితే ఈ దీపావళి గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ వివరించాము. అవేంటో తెలుసుకుందాం..

దీపావళి గురించి ఆసక్తికర విషయాలు..

దేశ ప్రజలందరూ ఎంతో ఘనంగా ఈ పండగను జారుకుంటూ ఉంటారు. సాధారణంగా ఇది హిందువుల పండుగ అని చెబుతూ ఉంటారు. కానీ ఈ పండుగను సిక్కులు, జైనులు కూడా ఘనంగా జరుపుకుంటారు. హిందువుల మాదిరిగానే బాణాసంచా కాల్చడం, దీపాలు వెలిగించడం వంటి కార్యక్రమాలతో ఈ వేడుకను జరుపుకుంటారు.

Unknown facts of Diwali 2024 Know before the festival

దీపావళి అంటే ఒక రోజు పండగ అనే భావన ప్రజల్లో ఉంటుంది. కానీ దీపావళి అంటే అయిదు రోజుల పండుగ. ధన త్రయోదశి, నరక చతుర్థి, దీపావళి, బలి పాడ్యమి, భాయ్ దూజ్. ఈ అయిదు రోజులు ఈ పండగను జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ పండగల తేదీని ప్రతి ఏడాది చంద్రుడి స్థానాన్ని బట్టి నిర్ణయిస్తారు.

దీపావళి పండగను దీపావళి అని ఎందుకు పిలుస్తారో తెలుసా?. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. ఈ పండగ రోజు ప్రజలందరూ దీపాలను వరుసగా పేర్చి పండుగను జరుపుకుంటారు. దీని కారణంగా దీనిని దీపావళి అనే పేరు వచ్చింది.

లక్ష్మీదేవికి ఎంతో పవిత్రమైన రోజు దీపావళి. ఈ దీపావళి రోజున లక్ష్మీపూజ చేయడం వల్ల అత్యంత విశేషంగా భావిస్తుంటారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే విశేషమైన ఐశ్వర్యం, ఆనందం, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతుంటారు.

దీపావళిని ఎందుకు జరుపుకుంటారో అనే దానికి పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. అందులో ఒకటి.. రాముడు రావణాసురుడిని హతమార్చి సీతమ్మను అయోధ్యకు తీసుకొచ్చిన సందర్భంగా ఈ పండగను జరుపుకుంటారని ప్రతీతి. రాముడు అయోధ్యకు తిరిగొచ్చిన రోజు అమావాస్య కావడంతో.. దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చి చీకటిని తరుముతో వెలుగు నింపేందుకు ఈ పండగను జరుపుకున్నారట.

పశ్చిమ బెంగాల్‌లో దుష్ట శక్తులను నాశనం చేసినందుకు కాళీదేవిని దీపావళి రోజు పూజిస్తారు. నేపాల్‌, భారత దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో నరకాసురుడిపై శ్రీకృష్ణుడి విజయానికి ప్రతీకగా ఈ వేడుకను జరుపుకుంటారు.

ఈ దీపావళికి రంగోలి అనే ప్రత్యేకమైన సంప్రదాయముంది. ఈ దీపావళి రోజున రంగు రంగుల ముగ్గులు, పూలు, రంగు రంగుల దీపాలను ఇల్లంతా అలంకరించి దీపాలను వెలిగించి దేవతలను ఇంట్లోకి రమ్మని ఆహ్వానిస్తుంటారు. ఇది దేవతలకు ప్రత్యేకమైన ఆహ్వాన పద్ధతిగా ప్రచారం ఉంది. ఇలా ఆహ్వానిస్తే దేవతలో ఇంట్లోకి ప్రవేశిస్తారని భక్తుల నమ్మకం.

లండన్‌లోని లీసెస్టర్ నగరంలో దీపావళి వేడుకను కన్నుల పండువగా నిర్వహిస్తారు. భారత దేశంలోని ప్రజల మాదిరిగానే ఇక్కడి ప్రజలు కూడా రంగు రంగుల ముగ్గు, పూలు, దీపాలను అలంకరించి వేడుకను అట్టహాసంగా నిర్వహించుకుంటారు. ఈ పండగ సందర్భంగా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. దీనిని విశ్వసించడమనేది పూర్తిగా మీ ఇష్టం. ఇవి నిజమైనవనే అని మేము నిర్ధారించడం లేదు.

Story first published: Monday, October 28, 2024, 13:03 [IST]
Desktop Bottom Promotion