Latest Updates
-
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి -
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి!
ప్రపంచంలోనే తొలి శివాలయం.. ఏడాదిలో ఒక్కరోజే నిజరూప దర్శనం, ఆ కిరణాలను తాకితే
భారతదేశంలో శివాలయం లేని గ్రామం లేదు. ఊరురా శివయ్యగా ఆయన పూజలు అందుకుంటున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలతో పాటు వేల ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాలు మనదేశంలో ఉన్నాయి. భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ శివాలయాలు ఉన్నాయి. అయితే వీటిలో తొలి శివాలయం ఏది? ఎక్కడ శివయ్య తొలిపూజలు అందుకున్నాడు. ఈ వివరాల్లోకి వెళితే..
ప్రపంచంలోనే తొలి శివాలయం
ఉతిర కోస మంగై ఆలయం.. ఇదే ప్రపంచంలో తొలి శివాలయంగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని మంగళనాథర్ ఆలయంగా పిలుస్తారు. ఇక్కడి స్వామివారిని మంగళనాథుడిగా, అమ్మవారిని మంగళాంభికగా వ్యవహరిస్తారు. ఉతిరం... రహస్యాలు, కోసం... బహిర్గతం చేయడం, మంగై... పార్వతి అనే పదాలతో ఈ ఆలయం పేరును ఉతిర కోస మంగై ఆలయంగా పిలుస్తారు. పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన, పవిత్రమైన ఆలయాలలో ఒకటిగా ఈ దేవాలయాన్ని భావిస్తారు.

చందనంతో కప్పి ఉండే మూల విరాట్టు
ఇక ఆలయంలో అత్యంత ప్రత్యేకమైనది స్వామివారి విగ్రహం. ఇక్కడ పరమేశ్వరుడు నటరాజ రూపంలో మరకతశిలలో దర్శనమిస్తారు. దీని ఎత్తు 6 అడుగులు (1.8 మీటర్లు). అయితే ఈ మరకతం నుంచి ప్రసరించే కిరణాలు, వెలుగును ప్రజలు తట్టుకోవడం కష్టమని.. అందుకే స్వామి వారి విగ్రహాన్ని ఏడాది పొడవునా చందనంతో లేపనం చేసి కప్పిఉంచుతారట. అయితే ఏడాదికి ఒకరోజున మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం నాడు మాత్రం ఆరుద్ర దర్శన్ పేరుతో ఇక్కడ పండుగలా జరుపుకుంటారు.
ఆ ఒక్క రోజే నిజరూప దర్శనం
ఆ రోజున మంగళనాథ స్వామివారి విగ్రహానికి అభిషేకం, పూజలు నిర్వహించడంతో పాటు చందనాన్ని తొలగించి భక్తులకు నిజరూప దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు. దాంతో ఆ రోజున స్వామివారిని దర్శించుకునేందుకు తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఆరుద్ర నక్షత్రం ముగిసిన తర్వాత మరకత నటరాజ స్వామి విగ్రహాన్ని తిరిగి చందనంతో కప్పి ఉంచుతారు. అయితే పరమేశ్వరుడు ఇక్కడ నటరాజస్వామిగానే కాకుండా లింగరూపంలోనూ, స్పటిక లింగ రూపంలోనూ దర్శనం ఇస్తున్నారు. నట రాజస్వామికి తప్పించి మిగిలిన రెండు లింగాలకు ప్రతిరోజూ అభిషేకం, ఇతర పూజ కార్యక్రమాలు జరుగుతాయి.
3000 ఏళ్ల చరిత్ర
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ ఉతిర కోస మంగై మంగళనాథ స్వామి ఆలయం ఉంది. ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ మంగళనాథ ఆలయానికి దాదాపు 3000 ఏళ్ల చరిత్ర ఉందని స్థల పురాణం చెబుతుంది. త్రేతాయుగంలో మండోదరి ఇక్కడ తపస్సు చేసి రావణాసురుడిని వివాహం చేసుకుందని చెబుతారు. వారిద్దరి వివాహం ఇక్కడ జరుగుతుండగా.. పరమేశ్వరుడు ఒక బాలుడు రూపంలో వారికి దర్శనమిచ్చాడు. దీంతో రావణుడు.. ఆ పిల్లాడిని ఎత్తుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన అగ్నిగా మారిపోతాడు. అది చూసిన రుషులు ఆలయానికి సమీపంలో ఉన్న అగ్నితీర్ధం అనే కొలనులో దూకుతారు. 1000 మంది రుషులకు గాను 999 మంది రుషులు అందులో దూకుతారు. ఒక్క మనిక వాసరగుడనే మహర్షి మాత్రం శివుడికి సంబంధించిన పవిత్ర గ్రంథాలను రక్షించడానికి ఆగిపోతాడు.
20 ఎకరాల సువిశాల ప్రాంగణం
దాదాపు 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ ఆలయం ఉంది. దాదాపు 1000 మంది శివభక్తులచే ఆలయం నిర్మించబడిందని తమిళ గ్రంథాలు చెబుతున్నాయి. ప్రధాన దైవం మంగళనాథుడితో పాటు ఇంకా ఈ ఆలయంలో నటరాజు, స్వయంభూ లింగం, భైరవుడు, దక్షిణామూర్తి, చండీకేశ్వరుడు, బాల భైరవ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే వారాహి అమ్మవారి ఆలయం కూడా ఉంది. జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నవారు ఈ మంగళనాథ ఆలయాన్ని దర్శిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని చెబుతున్నారు. ఈ మంగనాథ ఆలయానికి చేరుకోవాలనుకునే వారు రామనాథపురం రైల్వేస్టేషన్, బస్టాండ్ నుంచి ఆటో, టాక్సీలలో ఇక్కడికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications











