జలుబు.. దగ్గు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..!?

How to cure the cough & Cold during rainy season!
వేసవి వెళ్ళింది వర్షాలు మొదలైయ్యాయి. వర్షాలతో పాటు వ్యాధులు కూడా తొడున్నామంటు మన వెంటే ఉంటాయి. వర్షాకాలంలో ఎంత జాగ్రత్త తీసుకొన్నప్పటికీ జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల బారిన పడక తప్పదు. ముఖ్యంగా వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. దీనికి పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడమే ఏకైక మార్గం. వర్షాకాలంలో అనారోగ్యాలకు దూరంగా ఉండాలంటే బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని వైద్య నిపుణులు సలహాలిస్తున్నారు.

వర్షాకాలంలో వచ్చే ఈ సమస్యలకు ప్రధాన కారణం అపరిశుభ్రమైన పరిసరాలు, నీరు. జలుబు, అలర్జీ, గొంతు ఇన్‌ఫెక్షన్, కంటివ్యాధులు, చర్మవ్యాధులు కూడా వస్తుంటాయి. వీటి నుంచి పిల్లలను, పెద్దలను కాపాడుకోవాలంటే...

1. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దుస్తులు వేయాలి. స్కూలుకెళ్లే పిల్లలకు రెయిన్‌ కోట్, గొడుగు పంపించాలి. అపరిశుభ్రమైన నీటిలో తడవరాదు, వర్షంలో ఎక్కువసేపు తడవకుండా చూడాలి. తడిసి ఇంటికి వచ్చిన పిల్లలకు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో స్నానం చేయించాలి. వేడిగా పాలు లేదా సూప్ వంటివి తాగించాలి.

2. ఆహారం తీసుకునే ముందు, తర్వాత చేతులను శుభ్రంగా కడిగించాలి. టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత మెడికేటెడ్ సబ్బు లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్‌తో శుభ్రం చేయించాలి.
3. ఇక పెద్దల విషయంలో వర్షాకాలంలో రోజూ ఆరేడు సార్లు సబ్బుతో చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల జలుబు రాకుండా సాధ్యమైనంత వరకు కాపాడుకోవచ్చు. జలుబుతో బాధపడతున్నవారితో కలిసి పానీయాలు, లిప్‌ స్టిక్‌లు, ఇతర వస్తువులను పంచుకోకూడదు. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో చేతులను శుభ్రపరచుకుంటే క్రిములు నశిస్తాయి.

4. ఈ కాలంలో తరచూ గొంతు ఇన్‌ఫెక్షన్‌లు వస్తుంటాయి. ఇందుకు కారణం అపరిశుభ్రమైన నీటిని తాగడమే. అందుకే కాచి చల్లార్చిన నీటిని లేదా ప్యూరిఫయర్‌లో శుద్ధిచేసిన నీటిని తాగాలి. హోటల్ వంటి చోట్ల తినేటప్పుడు తాగేనీటి విషయంలో జాగ్రత్త వహించాలి. శుద్ధి చేసిన నీటిని సప్లయ్ చేయని హోటల్‌లో బాటిల్ తీసుకోవడమే మంచిది.

5. తాజాపండ్ల, కూరగాయలు శుభ్రంగా కడిగిన తర్వాతే తీసుకోవాలి. పండ్లరసాలు, పండ్లసలాడ్‌ లను సిద్ధం చేసుకున్న వెంటనే అప్పటికప్పుడే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకూ ఆహారాన్ని వేడివేడిగా తినాలి. పాత్రలపై మూతలు తప్పనిసరిగా పెట్టాలి. పెరుగు, మజ్జిగలను తాజాగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆకుకూరలను కూడా ఒకటికి రెండుసార్లు కడిగి, బాగా ఉడకనిచ్చి ఆ తర్వాతే తినాలి. నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకోకూడదు.

6. పిల్లల్లో జలుబు, దగ్గు వచ్చినప్పుడు వైద్యుని సలహా మేరకు ఆహారం, మందులు తీసుకుంటూ మిగిలిన పిల్లలతో కలవకుండా చూడాలి.
అపరిశుభ్రమైన నీటిలో చేతులు ముంచిన తర్వాత పిల్లలు అంతటితో ఊరుకోరు, కాసేపటి తర్వాత ఆ చేతులతో కళ్లను తుడుచుకోవడం, ముఖాన్ని రుద్దుకోవడం... ఇలా ఏదో ఒకటి చేస్తుంటారు. దీనివల్ల చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. కాబట్టి చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలి.

7. చెవులలోకి నీరు వెళ్లనివ్వకూడదు. వెళ్లినా వెంటనే కాటన్ లేదా మెత్తటి క్లాత్‌తో సున్నితంగా తుడవాలి. ఈ కాలంలో దోమలు ఎక్కువవుతుంటాయి కాబట్టి దోమతెరలు, మస్కిటో కాయిల్స్, క్రీమ్‌లను వాడడం మంచిది.

8. జలుబు, దగ్గు తదితరాలకు పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ, బత్తాయి ఎంతో మేలు చేస్తాయి. కర్బూజ, ఆఫ్రికాట్ల గుజ్జు, తాజా పెరుగును తీసుకోవాలి. మంచినీళ్లు, టమాట రసం తీసుకోవాలి. సూప్‌ లలో కూరగాయలను ఎక్కువగా చేర్చాలి. పుచ్చకాయ ముక్కలను నిత్యం తీసుకోవాలి.తాజా మొలకెత్తిన గింజలు రోజూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

పై జాగ్రత్తలతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా పిల్లల్లో.. పెద్దల్లోనూ రోగనిరోధకశక్తిని పెంచవచ్చు. ఇన్‌ఫెక్షన్లు, వైరస్ సంబంధిత వ్యాధుల బయటపడవచ్చు. అలాగే ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే చాలావరకు వ్యాధులను నివారించవచ్చు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Desktop Bottom Promotion