దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?

ప్రతి యేటా జూన్‌ 8వ తేదీ వచ్చిందంటే చాలు దేశవిదేశాల ప్రజలు భాగ్యనగరానికి చేరుకుంటారు. వేలు కాదు లక్షల సంఖ్యలో ప్రజలు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కి ముందు రోజు నుంచే క్యూ కడతారు. వీళ్లంతా వచ్చేది కేవలం ఒక 'చేప ప్రసాదం’ కోసం. ఒకప్పుడు చేపతో కలిపి మందుగా పంపిణీ చేసిన మూలికా వైద్యాన్ని ఇప్పుడు ప్రసాదంగా పిలుచుకుంటున్నారు. దశాబ్దాలుగా బత్తిని కుటుంబం అందిస్తున్న ఈ ప్రసాదం వెనకున్న కథేంటి.. అసలు ఈ మందు ఎలా తయారైంది.. ఈ కథనంలో చూద్దాం..

Every year in Hyderabad on June 8th on the day of Mrigasira Karte fish prasadam is distributed The interesting story behind it is

శ్వాసకోశ సమస్యలు ముఖ్యంగా ఆస్తమా వ్యాధితో ఆస్పత్రులకి తిరిగినా ఫలితం దక్కని వారు చివరి ఆశగా ఇక్కడి విచ్చేసి బత్తిని కుటుంబం అందించే ఈ అమూల్యమైన ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా దొరకని ఈ ప్రసాదం కేవలం హైదరాబాద్‌లో మాత్రమే యేటా ఒక్క రోజు లభ్యమవుతుంది. దశాబ్దాలుగా కోట్ల సంఖ్యలో ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ సమాజ సేవలో భాగస్వామ్యులవుతున్నారు బత్తిని సోదరులు.

ప్రతి యేటా వర్షాకాలం ప్రారంభమయ్యే ముందు వచ్చే మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ఆస్తమాతో పాటు వివిధ శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం కలిగిస్తుందనే నమ్మకంతో లక్షల సంఖ్యలో స్థానికంగా మాత్రమే కాకుండా దేశవిదేశాల నుంచి తరలివస్తుంటారు.

చేప ప్రసాదం ఎలా పుట్టింది..

దశాబ్దాల సంప్రదాయంగా కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ వెనుక ఆసక్తికర కథ ఉంది. ఈ ప్రసాదాన్ని బత్తిని కుటుంబం మాత్రమే తయారుచేయగలదు. ఎందుకంటే ఈ రహస్య మూలికా ఫార్ములా వారికే సొంతం. చరిత్ర ప్రకారం 1845వ సంవత్సరంలో బత్తిని వీరన్న గౌడ్‌కి ఓ హిమాలయ సాధువు ఈ రహస్య మూలికా ఫార్ములా అందజేశారు. ఆనాటి నుంచి దాదాపు 180 ఏళ్లుగా కేవలం బత్తిని వంశస్థులు మాత్రమే ప్రజలకు ఉచితంగా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ మూలికా ఫార్ములా వారికి మాత్రమే తెలిసిన రహస్యంగా నిలిచింది.

చేప ప్రసాదం ఎలా ఉంటుంది

బత్తిని కుటుంబం పంపిణీ చేసే 'చేప ప్రసాదం’.. మూలికా మిశ్రమం ఒక పసుపు రంగు ముద్దలాగా ఉంటుంది. ఈ ముద్దను బతికి ఉన్న కొరమీను చేప పిల్ల నోటిలో పెట్టి ఆ చేపపిల్లను రోగితో మింగిస్తారు. ఇలా చేయడం ద్వారా సజీవంగా ఉన్న చేప పిల్ల గొంతు నుంచి లోపలికి వెళ్లే క్రమంలో కదలికలు చేస్తుంది. తద్వారా శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుందని.. ఫలితంగా శ్వాస తీసుకోవడం సులభం అవుతుందని ప్రజల విశ్వాసం. అయితే నాన్ వెజ్‌ తినని వారికి ఈ మూలికా మిశ్రమాన్ని బెల్లంతో కలిపి నోటి ద్వారా మింగిస్తారు.

Fish prasadam distribution every year in hyderabad story behind this trust and tradition

ప్రసాదం నియమాలు

అయితే చేప ప్రసాదం కేవలం ఒక సంవత్సరం మాత్రమే తీసుకుంటే సరిపోదని నిర్వాహకులు చెబుతున్నారు. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకి సంబంధించి పూర్తి ఫలితం దక్కాలంటే వరుసగా మూడేళ్లపాటు ఈ ప్రసాదాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రసాదం తీసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు తప్పనిసరిగా పథ్యం ఉండాలని పేర్కొంటున్నారు. నిర్దిష్టమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని సూచించారు.

బత్తిని కుటుంబీకులు ఈ రహస్య వైద్యాన్ని వాణిజ్య పరంగా వాడుకోకుండా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తూ సమాజ సేవలో లీనమయ్యార. కాగా మొదట్లో ఈ ప్రసాదాన్ని 'చేప మందు’గా పిలిచేవారు. కానీ హేతువాద, సైన్స్‌ సంఘాలు.. ఈ మందుకు ఎలాంటి శాస్త్రీయత, ల్యాబ్‌ టెస్టులు ధ్రువీకరణ లేదని కోర్టులను ఆశ్రయించారు. అయితే ల్యాబ్‌ టెస్టుల్లోనూ ఈ మూలికా మిశ్రమంలో ఎలాంటి రసాయనాలు లేవని తేలింది. ఈ క్రమంలో ఈ మూలికా వైద్యాన్ని మందుగా పిలవొద్దని న్యాయస్థానాలు ఆదేశించాయి. ఈ ప్రకారం అప్పటి నుంచి చేప ప్రసాదంగా పిలుస్తున్నారు.

ప్రభుత్వ మద్దతు

చేప ప్రసాదంలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ ప్రజల విశ్వాసమే వారిని దశాబ్దాల తరబడి ఈ మూలికా వైద్యాన్ని స్వీకరించేలా చేస్తుంది. వారి నమ్మకాన్ని ప్రభుత్వం సైతం వమ్ము చేయకుండా మద్దతుగా నిలుస్తోంది. బత్తిని కుటుంబీకులకు చేప పిల్లల పంపిణీకి సహకరిస్తోంది. అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడకుండా నాంపల్లి గ్రౌండ్స్‌ కేటాయించింది. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు సైతం దాదాపు మూడు రోజులపాటు సిటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పర్యవేక్షిస్తున్నారు.

Desktop Bottom Promotion