ఇండియాలో మెస్సీ మౌనం వెనుక ఆ రూల్.. గోల్ కొడితే 8000 కోట్లు గోవిందా!

Photo Courtesy: X.Com/TelanganaCMO

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ ఇండియా టూర్ సంచలనాలు, వివాదాలు నడుమ పూర్తయిన సంగతి తెలిసిందే. గోట్ ఇండియా టూర్ 2025 పేరుతో డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 15 వరకు మెస్సీ మనదేశంలోని కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోవడంతో పాటు ప్రతిపక్షాలు, అధికారం పక్షాల మధ్య మాటల యుద్ధం, అరెస్ట్‌లు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇండియా టూర్‌లో మెస్సీ ఎక్కడా ఫుట్‌బాల్ ఆడలేదు. కేవలం గ్రౌండ్‌లోకి దిగి అభివాదం చేస్తూ, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వరకే పరిమితమయ్యారు. అసలు మెస్సీ ఎందుకు మ్యాచ్ ఆడలేదు? దీనికి దారి తీసిన పరిస్థితులు ఏంటీ? అన్న దానిపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఓ కొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

భారత్‌లోనూ మెస్సీకి ఫ్యాన్స్
అర్జెంటీనా జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు లియోనల్ మెస్సీ. బంతిని కంట్రోల్ చేసే విధానం, ఎంతటి ఒత్తిడిలోనైనా అద్భుతమైన ఆటతీరు, ప్రత్యర్ధి ఆటగాళ్లను బోల్తా కొట్టించే విధానం, అతని గోల్స్ వేసే నైపుణ్యం తదితర అంశాలు మెస్సీకి జాతీయ, అంతర్జాతీయంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. అన్నింటికీ మించి మెస్సీ వ్యక్తిత్వం, దశాబ్ధాలుగా నిలకడకు మారుపేరుగా నిలవడం వంటివి ఫుట్‌బాల్ గేమ్‌కు అతనిని రారాజును చేశాయి. క్రికెట్‌ను ఓ మతంలా భావించే భారత్ లాంటి దేశంలోనూ మెస్సీకి అభిమానులు ఉన్నారంటే అతని ఆటను, మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు.

Lionel Messi s left foot insurance worth 900 million is reason for he Didn t Play a Football Match in GOAT India Tour 2025

Photo Courtesy: X.Com/TelanganaCMO

2022లో ఖతార్ వేదికగా జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ పోటీలలో విజయం సాధించి తొలిసారిగా వరల్డ్ కప్‌ను అందుకుని తన కలను, అభిమానుల కలను నెరవేర్చుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 91 గోల్స్ చేయడం, బాలన్ డీ ఓర్ అవార్డును రికార్డు స్థాయిలో 8 సార్లు గెలుచుకోవడం తదితర అంశాలు మెస్సీని ఫుట్‌బాల్‌కు ఐకాన్‌గా మార్చాయి. ఈ క్రమంలోనే భారత్‌లో పర్యటించాల్సిందిగా లియోనల్ మెస్సీకి ఆహ్వానం అందింది.

కోల్‌కతాలో ఉద్రిక్త పరిస్ధితులు
ఇండియా టూర్‌లో భాగంగా కోల్‌కతాలో మెస్సీకి చేదు అనుభవం ఎదురైంది. మైదానంలో షెడ్యూల్ సమయం కంటే తక్కువగా ఉండటంతో అభిమానులు మండిపడ్డారు. గ్రౌండ్‌లోకి వాటర్ బాటిల్స్, కుర్చీలు విసిరేయడం వంటివి చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తలవంపులు తీసుకొచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో మెస్సీ పర్యటన ఎలాంటి గందరగోళం లేకుండా విజయవంతంగా ముగిసింది. అయితే ఇండియాలో ఎక్కడా ఆయన ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడలేదు.. కేవలం ఆటగాళ్లను, అభిమానులను ఉత్సాహపరచడంతో సరిపెట్టాడు. అదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది?

మెస్సీ ఎడమ కాలికి 8 వేల కోట్ల ఇన్సూరెన్స్
అయితే దాదాపు 8000 కోట్ల రూపాయలు ఆయనను అడ్డుకుందట. అదేంటీ? అని మీకు డౌట్ రావొచ్చు. మెస్సీ ఎడమ కాలే ఆయన బలం. గోల్స్, ఫ్రీకిక్స్, డ్రిబ్లింగ్ వంటి వాటితో పాటు మైదానంలో చురుకుగా కదలడంలో, ప్రత్యర్ధి ఆటగాళ్లను బోల్తా కొట్టించడంలో మెస్సీ ఎడమ కాలు కీలకపాత్ర పోషిస్తుంది. అనుకోని విధంగా మెస్సీ ఎడమ కాలికి గాయమైతే.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న క్లబ్‌లు, స్పాన్సర్లకు ఆర్దిక పరంగా ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ఉండటానికి గాను మెస్సీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఎడమ కాలికి దాదాపు 900 మిలియన్ల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 8000 వేల కోట్ల రూపాయలు) విలువైన ఇన్సూరెన్స్ పాలసీ చేయించారు.

రూల్స్ బ్రేక్ చేయలేక
ఈ కారణంగా కేవలం తన అర్జెంటీనా జాతీయ జట్టు, తన క్లబ్ అయిన ఇంటర్ మియామీ తరపున మాత్రమే మెస్సీ మైదానంలో బరిలోకి దిగడానికి అనుమతి ఉంది. ఇతరత్రా పర్యటనలు, ఫ్రెండ్లీ, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు, ఇతర ఈవెంట్స్‌లో ఆడితే ఇన్సూరెన్స్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తారు. అదే జరిగితే వేల కోట్ల రూపాయల మేర మెస్సీకి నష్టం చేకూరుతుంది. అందుకే మెస్సీ తన గోట్ ఇండియా టూర్‌లో కేవలం సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెస్సీ ముందుచూపును, తన వల్ల ఎవరికీ నష్టం కాకూడదనే మనస్తత్వాన్ని మెచ్చుకుంటున్నారు.

Story first published: Tuesday, December 16, 2025, 20:08 [IST]
Desktop Bottom Promotion