Modi Ji Thali: అమెరికా రెస్టారెంట్‌లో మోదీ పేరిట థాలీ, ప్రధాని యూఎస్ పర్యటన సందర్భంగా ప్రారంభం

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో యూఎస్ దేశ న్యూజెర్సీ సిటీలోని ఓ రెస్టారెంట్ మోదీ పేరిట ప్రత్యేక థాలీని తీసుకొచ్చింది. భారతీయ సంతతికి చెందిన చెఫ్ శ్రీపాద్ కులకర్ణి ఈ ప్రత్యేక థాలీని తీర్చిదిద్దారు. ప్రధాని పర్యటన వేళ ప్రత్యేకంగా ఈ థాలీని ఆవిష్కరించినట్లు తెలిపారు. అమెరికాలో ఉంటున్న భారతీయుల డిమాండ్ మేరకు మోదీజీ థాలీని తయారు చేసినట్లు శ్రీపాద్ కులకర్ణి తెలిపారు.

చెఫ్ శ్రీపాద్ కులకర్ణి తయారు చేసిన మోదీ జీ థాలీలో కిచ్డీ, సర్సన్ కా సాగ్, రసగుల్లా, కశ్మీరీ దమ్ ఆలూ, ఇడ్లీ, ధోక్లా, చాచ్, పాపడ్ సహా ఇతర వంటకాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రత్యేక మోదీ జీ థాలీని చాలా మంది ప్రయత్నించారు. చాలా మంది కస్టమర్లు ఈ థాలీని చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు రెస్టారెంట్ యజమాని, చెఫ్ శ్రీపాద్ కులకర్ణి తెలిపారు. భారతీయ సమాజంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆహారాలతో ఈ థాలీని తయారు చేయడంతో చాలా మంది ఇష్టం తింటున్నారని వెల్లడించారు. అయితే ఈ ప్రత్యేక మోదీ జీ థాలీ ధర మాత్రం వెల్లడించలేదు.

US Restaurant Launches Modi Ji Thali Ahead Of PM Narendra Modi America Visit Telugu

జైశంకర్ పేరిట మరో థాలీ:

భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేరిట మరో ప్రత్యేక థాలీని త్వరలోనే ప్రారంభిస్తామని రెస్టారెంట్ యజమాని తెలిపారు. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో జైశంకర్ కు ఉన్న క్రేజ్ తక్కువేం కాదని, అందుకే ఈ జైశంకర్ థాలీని తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక థాలీ:

గత సంవత్సరం మోదీ జన్మదినం సందర్భంగా ఢిల్లీకి చెందిన ఓ రెస్టారెంట్ పీఎం కు అంకితం చేస్తూ ఓ ప్రత్యేక థాలీని తీసుకొచ్చింది. కొనాట్ ప్లేస్ లో ఉన్న ఆర్డోర్ 2.1 రెస్టారెంట్.. 56 ఆహార పదార్థాలు ఉన్న బిగ్ సైజ్ థాలీని ప్రారంభించింది. ఇందులో వెజ్, నాన్-వెజ్ రెండు రకాల థాలీలు ఉంటాయి.

4 రోజుల పర్యటన, వైట్‌హౌస్‌లో డిన్నర్:

నాలుగు రోజుల పాటు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. తన పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో భేటీ కానున్నారు. అలాగే ప్రవాస భారతీయుల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమెరికా భాగస్వామ్యంతో జనరల్ ఎలక్ట్రిక్ జెట్ ఇంజిన్లు తయారీతో పాటు అడ్వాన్స్డ్ డిఫెన్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.

యూఎస్ పర్యటనకు రానున్న మోదీ జూన్ 22వ తేదీన వైట్ హౌస్‌లో విందుకు హాజరు కానున్నారు. ఈ మేరకు జో బైడెన్, అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ నుంచి మోదీకి ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు, భారత ప్రధానికి వైట్ హౌస్‌లో విందు ఏర్పాటు చేయడం సుదీర్ఘ విరామం తర్వాత ఇదే తొలిసారి.

Story first published: Monday, June 12, 2023, 10:30 [IST]
Desktop Bottom Promotion