పిల్లలకు పాలవలన కలిగే ఎలర్జీలు!

By B N Sharma

Indian-toddler-food
అపుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు ప్రధాన ఆహారంగా వుంటుంది. బిడ్డ ఎదుగుదలకు అవసరమైన పోషకాలు అన్ని తల్లిపాలలో లభిస్తాయి. కనీసం ఒక సంవత్సరంవరకైనా సరే తల్లి బేబీకి పాలను పట్టాలి. అపుడే, బిడ్డకు సరైన రోగ నిరోధక వ్యవస్ధ ఏర్పడి, తర్వాతి దశలలో కూడా బిడ్డ ఆరోగ్యంగా వుంటుంది. తల్లిపాలు తాగినంత కాలం శిశువులలో తల్లి సరైన ఆహారాలు తినకపోతే తప్ప ఏ రకమైన ఆరోగ్య సమస్యలు రావు. తల్లిపాలు తగ్గినపుడు వీరికి సాధారణంగా గేదె లేదా ఆవుపాలు ఇస్తూవుంటారు. అయితే, కొన్ని సమయాలలో ఈ పాలు పడక వారికి అజీర్ణం కలుగుతుంది. మరికొన్ని సార్లు ఎలర్జీ కూడా కలుగుతుంది.

పిల్లలకు పాలు ఎలర్జీ కలగటం సాధారణంగా వచ్చే సమస్య. ఎలర్జీ వస్తే బిడ్డ చికాకుగా ఏడుస్తుంది. అలసట భావిస్తుంది. పొట్ట గడబిడ అవుతుంది, చర్మంపై ర్యాషెస్ రావటం, వాంతులు, డయోరియా వంటి చిహ్నాలు కనపడతాయి. బిడ్డ బరువు తక్కువ వుండటం, శ్వాస సంబంధిత సమస్యలు, గ్యాస్ ఏర్పడటం, డీహైడ్రేషన్, ఆకలి లేకపోవటం, ముక్కు లేదా గొంతులో మ్యూకస్ ఏర్పడటం, మొదలైన లక్షణాలు బేబీలో కనపడతాయి.

తల్లి ఈ లక్షణాలను బిడ్డలో వెంటనే కనిపెట్ట గలగాలి. మొదటి లక్షణంగా బిడ్డకు చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. సాధారణంగా దీనికి కారణం పాలలో వుండే ప్రొటీన్లు బిడ్డలోని యాంటీ బాడీస్ కు స్పందిస్తాయి. తల్లి పాలు ఇచ్చే తల్లులు ఆవు పాలు తాగటం వలన కూడా పిల్లలలో ఈ సమస్య ఏర్పడుతుంది.ఈ సమస్యను పరిష్కరించాలంటే, తల్లి ఆవుపాలు, దాని ఉత్పత్తులు తాగుతున్నా, తింటున్నా వెంటనే మానేయాలి.

అయితే, తక్షణమే వైద్యుడిని సంప్రదించి పిల్లాడికి తగినంత కాల్షియం, ఇతర పోషకాలు అందేందుకు అవసరమైన ఆహారాలు తీసుకోవాలి. ప్రొటీన్లు వుండే ఆహారాలు ఇవ్వాలంటే సోయా ప్రొటీన్ లేదా ఎమినో యాసిడ్లు కల బేబీ ప్రొటీన్ ఫార్ములా ఆచరించాలి. ఈ ఫార్ములాలో ప్రొటీన్ తేలికైన రూపంలో లభిస్తుంది.


Story first published: Saturday, June 30, 2012, 15:41 [IST]
Desktop Bottom Promotion