ఇడ్లీ, దోస,వేడి అన్నం..దేనిలోకైనా అదుర్స్ అనిపించే ఆంధ్రా స్టైల్ పుదీనా తొక్కు..సింపుల్ గా ఎలా చేయాలంటే..

Posted By:

సాధారణంగా మన ఇళ్లలో ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ లో ఇడ్లీ లేదా దోస ఉన్నప్పుడు వాటి కాంబినేషన్‌ గా పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ చేయడం పరిపాటి. కానీ రోజూ ఒకే రకమైన చట్నీ తింటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే ఈసారి మీ బ్రేక్‌ ఫాస్ట్‌ ను మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి పుదీనా తొక్కును ప్రయత్నించండి.

పుదీనాలోని ఔషధ గుణాలు జీర్ణక్రియకు మేలు చేయడమే కాకుండా, నోటికి కొత్త రుచిని అందిస్తాయి. ఈ పుదీనా తొక్కు కేవలం ఇడ్లీ, దోసెల్లోకే కాదు.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది. గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే వారం రోజుల పాటు ఫ్రెష్‌ గా ఉంటుంది. మఘుమఘుమలాడే పుదీనా తొక్కును ఆంధ్రా స్టైల్ లో ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
పుదీనా ఆకులు: 1 కప్పు
ఎండు మిరపకాయలు: 10
వెల్లుల్లి రెబ్బలు: 10
చింతపండు రసం: 1 టేబుల్ స్పూన్
ధనియాలు: 1 టీస్పూన్
నువ్వులు: 1 టీస్పూన్
మెంతులు: అర టీస్పూన్
జీలకర్ర: 2 టీస్పూన్లు
బెల్లం: 1 టీస్పూన్
నూనె: 3 టేబుల్ స్పూన్లు
ఆవాలు: అర టీస్పూన్
పసుపు: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక టీస్పూన్ నూనె వేడి చేయండి. నూనె వేడయ్యాక మెంతులు, ఎండు మిరపకాయలు, ధనియాలు, నువ్వులు వేసి దోరగా వేయించాలి. ఎండు మిరపకాయలు ఎర్రగా మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.

-దినుసులన్నీ వేగాక చివరగా జీలకర్ర వేసి అవి చిటపటలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

-ఇప్పుడు అదే పాన్‌ లో మరికొద్దిగా నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి వేయించాలి. వెల్లుల్లి బంగారు రంగులోకి వచ్చాక వాటిని కూడా ప్లేట్‌ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను పాన్‌ లో వేసి, ఆకులోని పచ్చి వాసన పోయి పూర్తిగా మగ్గిపోయే వరకు ఉడికించాలి. ఆకులు దగ్గరగా ముడుచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

-తర్వాత మిక్సీ జార్‌ లోకి వేయించి పెట్టుకున్న దినుసులు, వెల్లుల్లి, చింతపండు, పుదీనా మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు, చిన్న బెల్లం ముక్క వేసి మెత్తగా రుబ్బుకోవాలి.ఇందులో అస్సలు నీళ్లు పోయకూడదు. అవసరమైతే కొద్దిగా నూనె వేసి చిక్కటి పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-ఇప్పుడు తాలింపు కోసం పాన్‌ లో నూనె వేడి చేసి ఆవాలు వేయండి. ఆవాలు చిటపటలాడాక చిటికెడు పసుపు వేయండి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పుదీనా పేస్ట్‌ ను ఈ తాలింపులో వేసి నూనె పైకి తేలే వరకు 1-2 నిమిషాలు సన్నని మంటపై కలుపుతూ ఉడికించాలి.

-అంతే ఎంతో రుచికరమైన, ఘాటైన ఆంధ్రా స్టైల్ పుదీనా తొక్కు రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, December 6, 2025, 10:55 [IST]
Desktop Bottom Promotion