ఐరన్, ఫైబర్ పుష్కలం..పిండి రుబ్బే పనిలేకుండా 10 నిమిషాల్లోనే క్రిస్పీ రాగి బీట్ రూట్ దోశ..

Posted By:

ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయం పూట బ్రేక్‌ ఫాస్ట్ ఏం చేయాలి అనేది అందరికీ ఎదురయ్యే పెద్ద ప్రశ్న. అందులోనూ రుచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పైగా త్వరగా అయిపోవాలి..ఇవన్నీ కుదిరే రెసిపీ దొరకడం కష్టమే. అయితే మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలనుకున్నా, మీకు అద్భుతంగా సరిపోయే రెసిపీ ఒకటుంది. అదే అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే ఇన్‌ స్టంట్ బ్రేక్‌ ఫాస్ట్ క్రిస్పీ రాగి బీట్‌ రూట్ దోశ.

Boost Your Iron Fiber Intake with this Superfood Breakfast Ragi Beetroot Dosa Recipe in Telugu

రాగి పిండిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇక బీట్‌ రూట్ సంగతి చెప్పనక్కర్లేదు, ఇందులో ఐరన్ మెండుగా ఉంటుంది. ఇవి రెండూ కలిపి చేసే ఈ దోశ తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యం కూడా. చూడ్డానికి ఎర్రగా, ఆకర్షణీయంగా ఉండే ఈ దోశను పిల్లలు సైతం ఏమాత్రం మారాం చేయకుండా ఎంతో ఇష్టంగా తింటారు.

బీట్‌ రూట్ దోశ తయారీకి కావలసిన పదార్థాలు

బీట్‌ రూట్ - 1
రాగి పిండి - 2 కప్పులు
బియ్యం పిండి - 1 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - 1 టీస్పూన్
ఉల్లిపాయ - 1
కరివేపాకు - కొద్దిగా
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - కొద్దిగా
వంట నూనె - కొద్దిగా

బీట్ రూట్ దోశ తయారీ విధానం

ముందుగా బీట్‌ రూట్‌ ను తీసుకుని, పైన చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

-ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో బీట్‌రూట్ ముక్కలు వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా మిక్సీ పట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న బీట్‌ రూట్ పేస్ట్, 2 కప్పుల రాగి పిండి, 1 కప్పు బియ్యం పిండి వేయాలి.
ఈ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచా జీలకర్ర వేసి, ఉండలు లేకుండా తగినన్ని నీళ్లు పోసుకుంటూ పల్చటి దోశ పిండిలా (రవ్వ దోశ పిండిలా) కలుపుకోవాలి.

- కలుపుకున్న పిండిపై మూతపెట్టి సుమారు 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే పిండి బాగా నానుతుంది.

-పది నిమిషాల తర్వాత ఆ పిండిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి, దోశ పెనం పెట్టి మంటను హై ఫ్లేమ్‌ లో ఉంచి బాగా వేడి చేయాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత, పిండిని గరిటతో తీసుకుని పెనం పైన పల్చగా దోశలా పోసుకోవాలి. పిండి పల్చగా ఉంటేనే దోశ కరకరలాడుతూ వస్తుంది. దోశ పైన కొద్దిగా ఆయిల్ స్ప్రే చేయాలి లేదా చుట్టూ కొద్దిగా నూనె వేయాలి.

-మంటను మీడియం ఫ్లేమ్‌ కి అడ్జస్ట్ చేసుకుని, దోశ ఎర్రగా, క్రిస్పీగా కాలేంత వరకు ఉంచి, జాగ్రత్తగా ప్లేట్‌ లోకి తీసుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వేడి వేడి రాగి బీట్‌రూట్ దోశ రెడీ. దీన్ని చక్కగా కమ్మటి కొబ్బరి పచ్చడితో నంజుకుని తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Wednesday, July 8, 2026, 7:32 [IST]
Desktop Bottom Promotion