అమర్‌నాథ్‌ యాత్రికులకు అలర్ట్‌.. బడ్జెట్‌ ఎక్కడ, ఎంతవుతుంది.. పూర్తి వివరాలు.!

దేశంలోనే అత్యంత పవిత్రమైన, సాహసోపేతమైన పుణ్యక్షేత్ర దర్శనాల్లో అమర్‌నాథ్‌ యాత్ర ఒకటి. వర్షాకాలంలో ప్రారంభమయ్యే ఈ యాత్రకు దేశవ్యాప్తంగా భక్తులే కాదు ఇతర దేశాల నుంచీ లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈ యాత్రకు అనుకున్నంత సులభంగా చేరుకోలేరు. వయసు పరిమితిని పాటించాలి. ఎలాంటి అనారోగ్య కారణాలు ఉండకూడదు. ఇంకా ముందస్తు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి. ఇవన్నీ ఇలా ఉండగా.. అసలు అమర్‌నాథ్‌ యాత్రకు ఎక్కడ ఎంత ఖర్చవుతుందనే విషయాలు చాలా మందికి తెలియదు.

Details on how to go the Amarnath Yatra and the estimated budget

జులై 3 నుంచి ఆగష్టు 28 వరకు మొత్తం 57 రోజుల పాటు అమర్‌నాథ్‌ యాత్ర కొనసాగుతుంది. అమర్‌నాథ్‌ యాత్రలో పవిత్ర హిమలింగాన్ని దర్శించుకునేందుకు ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అమర్‌నాథ్‌ యాత్రకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ నుంచి రైలు, విమాన మార్గాల ద్వారా జమ్మూ, శ్రీనగర్‌ వరకు చేరుకోవచ్చు. అక్కడి నుంచి బల్తాల్‌ బేస్‌ క్యాంపులకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అమర్‌నాథ్‌ గుహకు కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అన్ని చోట్లా ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి ఆన్‌లైన్‌ లావాదేవీలు పనిచేయవు. పర్సులో ఎప్పుడూ నగదు సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. మరి మీ ప్రయాణంలో ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అమర్‌నాథ్‌ యాత్రలో బడ్జెట్‌, ఖర్చు వివరాలు తెలుసుకోవడం మంచిది.

Details on how to go the Amarnath Yatra and the estimated budget

రిజిస్ట్రేషన్ ఛార్జీలు

యాత్రకు బయలుదేరే ముందు భక్తులు అమర్‌నాథ్‌ యాత్ర అధికారిక వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. దీనికి రూ. 150 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత యాత్ర కార్డు పొందవచ్చు. అమర్‌నాథ్‌ యాత్రకి బయలుదేరే ముందు ఈ కార్డు తప్పనిసరి అని గుర్తుంచుకోవాలి.

రాకపోకలు

యాత్రలో వయసు పైబడిన వారికి, నడవలేని వారికి వివిధ ప్రయాణ సౌకర్యాలతో మూడు మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో ధరలు వేర్వేరుగా ఉంటాయి. అందుకనుగుణంగా బడ్జెట్‌ మారే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా పర్సులో డబ్బు సిద్ధంగా ఉంచుకోవాలి. శారీరకంగా దృఢంగా ఉండి నడవగలిగితే.. ఇక్కడ అదనపు ఛార్జీలు ఏమీ ఉండవు. ఆహారం, వసతికి డబ్బు చెల్లిస్తే సరిపోతుంది.

Details on how to go the Amarnath Yatra and the estimated budget

కాలినడకన చేరుకోలేని వారి కోసం

యాత్రలో కాలినడకన చేరుకోలేని వారు కంచర గాడిదలు, పల్లకీలు, కూలీల సాయం తీసుకోవచ్చు. కంచర గాడిదకు ఖర్చు రూ. 4000 నుంచి ప్రారంభమవుతుంది. పల్లకీ ఖర్చు రూ. 8,000 వరకు ఉండొచ్చు. ఆలయ మండలి నిర్దేశించిన ధరల ప్రకారం ఛార్జీలు ఉంటాయి.

హెలికాప్టర్ ప్రయాణం

అమర్‌నాథ్‌ గుహకి ఆరు కి.మీ దూరం వరకు హెలికాప్టర్‌ సదుపాయు కూడా ఉంటుంది. వేగంగా చేరుకోవచ్చు, కానీ ఖరీదు ఎక్కువగా ఉంటుంది. పంచతర్ణి వద్ద దిగవచ్చు. అక్కడి నుంచి 6 కి.మీ ప్రయాణం.. కంచర గాడిద, పల్లకీ ద్వారా చేరుకోవచ్చు. బల్తాల్ నుంచి సుమారు రూ. 3,250 ఉండొచ్చు. పంచతర్ణి నుంచి ఇంకా పెరగొచ్చు(దాదాపు రూ. 4,900). మీ బడ్జెట్‌లో ఎక్కువ భాగం ఖర్చు ఇక్కడే అవుతుందని గమనించాలి.

Details on how to go the Amarnath Yatra and the estimated budget

బేస్‌ క్యాంప్‌నకు సౌకర్యాలు

బల్తాల్‌ బేస్‌ క్యాంపు చేరుకోవడానికి శ్రీనగర్‌, జమ్మూ, బల్తాల్‌, పహల్గామ్‌ మార్గాల్లో బస్సులు, షేర్డ్‌ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి. కి.మీ చొప్పున ధరలను ఆలయ మండలి నిర్ణయిస్తుంది. అమర్‌నాథ్‌ గుహకి చేరుకునే మార్గంలో వివిధ ప్రదేశాల్లో యాత్రికులకు ఆహారం అందించేకు ఉచిత లంగర్ల సౌకర్యం కల్పించవచ్చు. దీంతో ఆహార ఖర్చులు గణనీయంగా తగ్గించుకోవచ్చు. బేస్ క్యాంప్‌లో, గుహ మార్గంలో వసతి సౌకర్యం ఉంటుంది. టెంట్లు, షెల్టర్లను నిర్ణీత ధరలకు పొందవచ్చు. మరింత సౌకర్యం కోరుకుంటే హోటల్‌తో పాటు మరిన్ని సౌకర్యాలున్న క్యాంప్‌లు కూడా ఉంటాయి. వీటి ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది.

ఎంత బడ్జెట్‌ కావాలి

యాత్ర మార్గంలో లంగర్లు, సాధారణ టెంట్లలో బస చేయడంతో పాటు కాలినడకన వెళ్లాలనుకుంటే రూ. 10,000 నుంచి రూ. 15,000 బడ్జెట్‌ వరకు ఉండొచ్చు. కంచర గాడిద, పల్లకీ సదుపాయాలు కావాలనుకుంటే రూ. 25,000 వరకు బడ్జెట్‌ చూసుకోండి. హెలీకాప్టర్‌ సదుపాయం కావాలనుకుంటే రూ. 45,000 వరకు ఉండొచ్చు. మీరు ఎంచుకునే సౌకర్యాలు, రవాణాపైనే మీరు బడ్జెట్‌ ఆధారపడి ఉంటుంది.

నెట్‌వర్క్‌ పరిస్థితులు

అమర్‌నాథ్‌ యాత్ర ఎత్తైన మార్గాలు, పర్వత ప్రాంతాల ద్వారా సాగుతున్న కారణంగా.. నెట్‌వర్క్‌ అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువ. పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌ నెట్‌వర్క్‌లకు ఇబ్బంది ఉండదు. కానీ ప్రీపెయిడ్‌ సిమ్‌లకు తరచుగా నెట్‌వర్క్‌ సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి భక్తులు ఇక్కడ గుర్తింపు కార్డు చూపించి పోస్ట్‌పెయిడ్‌ సిమ్‌ కార్డు పొందవచ్చు. ఇందుకోసం బేస్‌ క్యాంపుల వద్ద టెలికాం కంపెనీల ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయి. కాగా, నెట్‌వర్క్‌ పరిస్థితుల కారణంగా పూర్తిగా ఆన్‌లైన్‌ చెల్లింపులపై ఆధారపడకుండా మీ వద్ద నగదు సిద్ధంగా ఉంచుకోవడం ముఖ్యం. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

తనిఖీ తప్పనిసరి

మీ యాత్ర బడ్జెట్‌లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కేవలం ఆలయ మండలి నిర్దేశించిన అధికారిక ధరల ప్రకారం చెల్లింపులు చేయండి. ఆ వివరాలు ముందే తెలుసుకోండి. ధరలు ఒక్కోసారి మారుతూ ఉండొచ్చు. ఈమేరకు మీరు అమర్‌నాథ్‌ యాత్ర ప్రయాణానికి ముందు అధికారిక SASB వెబ్‌సైట్‌లో తాజా సమాచారాన్ని తనిఖీ చేసుకోవడం మంచిది.

Desktop Bottom Promotion