వేడి వేడి అన్నంలోకి మజ్జిగ పులుసు బోండా..కంచాలు కంచాలు లాగించేయడం గ్యారెంటీ!

Posted By:

కొన్ని వంటకాలు తింటుంటే.. ఎక్కడున్నా ఇంటి భోజనం గుర్తొస్తుంది, మనసు ఆనందంతో నిండిపోతుంది. అలాంటి ఓ అద్భుతమైన, కమ్మని వంటకమే మజ్జిగ పులుసులో నానబెట్టిన మినప బోండాల). కమ్మని మజ్జిగ పులుసులో దూదిలా మెత్తగా నానిన బోండాలను లాగిస్తుంటే.. ఆ మజాయే వేరు. దీని రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. మరి ఈ కమ్మని వంటకాన్ని సులువుగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Fluffy Bondas Soaked in Spiced Majjiga Pulusu A South Indian Delight You Must Try Recipe in Telugu

మజ్జిగ పులుసు మినప బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు

పచ్చిమిర్చి - 2 లేదా 3
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
అల్లం - అంగుళం ముక్క
మిరియాలు - అర టీస్పూన్
కరివేపాకు - గుప్పెడు
పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
కందిపప్పు - 1 టీస్పూన్
పచ్చిశనగపప్పు - 2 టీస్పూన్లు
బియ్యం - 1 టీస్పూన్
మినపప్పు - 1 కప్పు
నీళ్లు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
సన్నగా తరిగిన కరివేపాకు - కొద్దిగా
పచ్చిమిర్చి - 1 (సన్నగా తరగాలి)
అల్లం - చిన్న ముక్క
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
పెరుగు - 1 కప్పు
నీళ్లు - అర కప్పు
ఉప్పు - తగినంత
కొబ్బరి నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
ఎండుమిర్చి - 4
కరివేపాకు - కొద్దిగా రెమ్మలు

మజ్జిగ పులుసు మినప బోండా తయారీ విధానం

-ముందుగా మినపప్పుని శుభ్రంగా కడిగి 1 గంటసేపు నానబెట్టుకోవాలి.

-తర్వాత బియ్యం, కందిపప్పు, పచ్చిశెనగపప్పు విడివిడిగా అరగంటసేపు నానబెట్టుకోవాలి.

-అరగంట తర్వాత మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి,జీలకర్ర,ధనియాలు,అల్లం,మిరియాలు,పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టుకున్న కందిపప్పు, నానబెట్టిన బియ్యం, నానబెట్టిన పచ్చి శెనగపప్పు,కరివేపాకు వేసి,కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, అందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా చిలకాలి. ఇందులో ముందుగా రుబ్బి పెట్టుకున్న మిశ్రమం, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పెరుగు మిశ్రమాన్ని స్టవ్‌ పై పెట్టి, మంటను పూర్తిగా తగ్గించి కలుపుతూ వేడి చేయాలి. మిశ్రమం పైకి నురగ వస్తున్నట్లు కనిపిస్తున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరగనివ్వకూడదు.

-మరోవైపు, గంటపాటు నానబెట్టిన మినపప్పును మిక్సీ గిన్నెలో వేసి చాలా తక్కువ నీళ్లు పోస్తూ గట్టిగా, మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, చేత్తో బాగా గిలకొట్టాలి. ఇలా చేయడం వల్ల పిండిలో గాలి చేరి, బోండాలు మృదువుగా వస్తాయి.

-ఇప్పుడు ఆ పిండిలో సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి. స్టవ్‌ పై కడాయి పెట్టి నూనె వేడి చేసి, పిండిని చిన్నచిన్న బోండాలుగా వేసుకుని, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి.

-వేడివేడిగా ఉన్న బోండాలను తీసి, గోరువెచ్చగా ఉన్న మజ్జిగ పులుసులో వేయాలి.

-చివరగా నూనెలో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టుకుని, ఆ తాలింపును మజ్జిగ పులుసులో కలుపుకోవాలి.

-అంతే కమ్మని మజ్జిగ పులుసు మినప బోండా రెసిపి రెడీ. వేడివేడి అన్నంతో వడ్డిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, May 13, 2026, 17:27 [IST]
Desktop Bottom Promotion